ప్రధాని మోదీ ఉపన్యాసాలను వింటే చినుకు రాలకుండానే గంటల తరబడి ఉరిమే మబ్బులు గుర్తుకువస్తున్నాయి. అలాగే బయటకు రాక, లోపలికి పోక అక్కడే కదలాడే సోడాబుడ్డిలోని గోలీని తలపిస్తున్నాయి. తన పదేండ్ల పాలనలో ‘ఆయిల్, టెలికాం, విద్యుత్తు, ఇన్సూరెన్స్, వ్యవసాయం, మీడియాలను అంబానీకి.. ఓడరేవులు, ఎయిర్పోర్టులు, రైల్వేలు, వ్యవసాయ భూములు, బొగ్గు గనులు, ప్రభుత్వ రంగ సంస్థలను అదానీకి అప్పగించారు. అంతేకాదు, ప్రభుత్వరంగ సంస్థలు నష్టాల్లో ఉన్నాయంటూ ప్రైవేటు వాళ్లకు కారుచౌకగా తెగనమ్మారు. అదే ప్రైవేటు సంస్థలు నష్టాల్లో ఉంటే వాటికున్న రూ.లక్షల కోట్ల రుణాలను రద్దుచేశారు.
PM Modi | తత్కారణంగా మోదీ హయాంలో పేరుకుపోయిన నిరర్థక ఆస్తులు భారతదేశ బ్యాంకుల రుణాలలో 3.2 శాతం. మనకన్నా పెద్ద దేశం చైనాలోని నిరర్థక ఆస్తులు కేవలం 1.6 శాతం. ఐరోపా దేశాల నిరర్థక ఆస్తులు 1-1.5 శాతమే. అంతర్జాతీ య ప్రమాణాల ప్రకారం.. ఒక దేశపు నిరర్థక ఆస్తులు 2 శాతం ఉంటే ఆ దేశ బ్యాంకు రుణాలు ప్రమాదంలో పడినట్టుగా పరిగణిస్తారు. మరి 3.2 శాతం నిరర్థక ఆస్తులను పోగేసి భారతీయ బ్యాంకులను మీరు ఎంత పెద్ద ప్రమాదంలో నెట్టేశారో తెలుస్తున్నదా మోదీజీ? బ్యాంకులు ప్రమాదంలో పడితే ఆ దేశపు ఆర్థికవ్యవస్థ సంక్షోభంలో పడినట్టే. గతంలో సంభవించిన ప్రపంచ ఆర్థిక సంక్షోభం నేర్పిన గుణపాఠమదే కదా!
పదేండ్ల బీజేపీ పాలనలో మీరు ప్రజలకు ఇచ్చిందేమిటో ఒక్కసారి మననం చేసుకోండి. మీరు పోగు చేసిన నిరర్థక ఆస్తులు ఏంటంటే.. భారీ అప్పులు, జీఎస్టీ పేరిట నిర్బంధ పన్నులు, అధిక ధరలు, అవినీతి, నిరుద్యోగం, దారిద్య్రం, వినసొంపైన ఉపన్యాసాలు, మత విద్వేషాలు. మీరు ప్రజలకు అంటగట్టింది ఇవే కదా మోదీజీ! ప్రజాహిత కార్యక్రమాలు చేయకున్నా సరే కార్పొరేట్ బీజేపీ ఎలా విజయం సాధించగలుగుతుంది? అన్న ప్రశ్నలకు పరిశీలకులు పలు కారణాలు చెప్తున్నారు. అవేమిటంటే.. క్విడ్ ప్రో కో ద్వారా ఎన్నికల బాండ్ల రూపంలో బడా కార్పొరేట్లు ఇచ్చిన వేల కోట్ల నిధులతో ఓటర్లను, ఎమ్మెల్యేలను, ఎంపీలను కొనడం. నిఘా వ్యవస్థలను, దర్యాప్తు సంస్థలను తమ చేతి రిమోట్లుగా మార్చుకొని ప్రతిపక్షాలపై కేసులు పెట్టించి ఆయా పార్టీలను, నేతలను ప్రజల్లో అప్రతిష్ట పాలుచేయడం, ఆ కేసులకు బెదిరి లొంగిపోయినవారికి పార్టీ కండువా కప్పి బీజేపీ బలాన్ని పెంచుకోవడం. భావోద్వేగాలను రెచ్చగొడుతూ మెజారిటీ హిందూ ఓటర్లను సమీకరించుకోవడం. జాతీయ మీడియాను మోదియాగా మార్చడం. మోదీని ఆకాశానికెత్తే, ప్రతిపక్షాలను పాతాళానికి పడేసే అబద్ధాల సోషల్మీడియా యూనివర్సిటీని నిర్మించుకోవడం ద్వారా గత రెండు దఫాలు బీజేపీ అధికారాన్ని దక్కించుకున్నది.
‘కాదేదీ కవితకనర్హం’ అని శ్రీశ్రీ అంటే.. ‘కాదేదీ భావోద్వేగానికి అనర్హం’ అని అంటున్నారు మోదీజీ! అందుకే ఆయన సముద్రతీరాన ప్లాస్టిక్ సంచులేరారు. పార్లమెంట్కు ప్రణమిల్లారు. చప్రాసీ కాళ్లు కడిగారు. నెమళ్లకు గింజలు పెట్టారు. హిమాలయాలకు వెళ్లి సైనికులతో టీ తాగారు. చర్చికెళ్లి ప్రార్థనల్లో పాల్గొన్నారు. చర్చిలను తగలబెడుతుంటే మౌనం వహించారు. హిందువులున్న చోట గోవులను పూజించారు. ఈశాన్య రాష్ర్టాల ఎన్నికల పర్యటనలో పశుమాంస భక్షణం తప్పు కాదని ప్రకటింపజేశారు. ఏ రాష్ర్టానికి వెళ్తే ఆ వేషం వేశారు, ఆ తిండి తిన్నారు.
గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో పాకిస్థాన్, చైనా, పుల్వామా, బాలాకోట్ అంశాలతో పొరుగు దేశాల పట్ల ద్వేషాన్ని.. శివాజీ, పటేల్ ప్రస్తావనతో చారిత్రక హీరోయిజాన్ని.. జౌరంగజేబు పేరిట చారిత్రక విద్వేషాన్ని రగిల్చి మెజారిటీ హిందూ ఓటర్లను ఆకర్షించింది బీజేపీ.
ప్రస్తుత ఎన్నికల్లో కూడా మత ప్రాతిపదికన పౌరసత్వ చట్టాన్ని, అయోధ్య రామాలయాన్ని ఆయుధాలుగా చేసుకోవాలని బీజేపీ భావించింది. ముఖ్యంగా రామమందిరం కూడా వాళ్లు ఊహించినంతగా ప్రభావితం చేయలేకపోతున్నది. రామాలయాన్ని కూల్చి మసీదు కట్టారు కనుక దాన్ని కూల్చి తిరిగి అక్కడే రామాలయాన్ని కడతామన్న బీజేపీ.. తద్విరుద్ధంగా మసీదుకు అల్లంత దూరాన రామాలయాన్ని నిర్మించడం ఒక కారణం. మన దేశంలోని రామాలయాలు సీతా-రామ-లక్ష్మణ-ఆంజనేయుల విగ్రహాలతో అలరారుతుంటాయి. ఎందుకంటే, మానవాళికి ఏకసతీ-పతీవ్రతాన్ని ఆచరించి చూపిన ఆదర్శ దంపతులు సీతారాములు. భ్రాతృ ప్రేమకు లక్ష్మణుడు, సేవానిరతికి ఆంజనేయుడు ప్రతీకలు. యథారాజా తథా ప్రజా అని ఆచరణ ద్వారా ప్రబోధించిన ప్రజా పాలకుడు శ్రీరాముడు. అందుకే వారి విగ్రహాలతో అలరారుతూ పాలకులకు, ప్రజలకు సదరు ఆశయాలను ప్రబోధిస్తుంటాయి రామాలయాలు. అదే రామాలయాల విశిష్ఠత. ఈ ఔన్నత్యాన్ని విస్మరించి, కేవలం బాలరాముడిని ప్రతిష్ఠించి భారీ ప్రచారపు ఖాళీ చెంచాతో ఎన్నాళ్లు తినిపించినా హిందువుల కడుపు నిండుతుందా?
కుంభకోణాల పార్టీలంటూ హేళన చేయటమే కాదు, ఎన్నికలు రాగానే వాళ్లను త్రిశూలంతో వేటాడి వేధిస్తున్నారు కూడా. ఉదాహరణకు కొందరికి భారీ మొత్తంలో లబ్ధి కలిగించేలా మద్యం పాలసీని రూపొందించి, రూ.100 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారంటూ కేజ్రీవాల్, కవిత తదితరులను చెరసాలలో వేయించారు కదా. మీ హిందూత్వ, దేశభక్తి, అవినీతి నిర్మూలన, నిస్వార్థం, నిజాయితీలో ఉన్న డొల్లతనాన్ని ప్రజలు మాత్రం పసిగట్టారు. అంతేకాదు, ఉపన్యాసాల్లో మీరు ఎంతగా ఉరిమినా, వాగ్దానాలతో ఎంతగా మెరిసినా, ప్రజాహిత కార్యక్రమమనే చినుకును కూడా వర్షించని మాయమబ్బు నరేంద్ర మోదీ-బీజేపీ అన్న వాస్తవాన్ని ప్రజలు గ్రహించారు. బహుశా ఇటీవల జరిగిన తొలి దశ ఎన్నికల్లోనే మీకు ఈ విషయం తెలిసినట్టుంది. అందుకే కాబోలు ప్రతిపక్షాలపై మరింతగా విరుచుకుపడుతున్నారు.
పాతూరి వేంకటేశ్వరరావు
98490 81889