తెలంగాణ రాష్ట్రంలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ ఎన్నికల ప్రణాళికను ప్రకటించింది. అది 80 పేజీలతో రూపొందించిన మ్యానిఫెస్టో. అందులో ప్రధానమైన వాటిని కొన్నింటిని చర్చించుకుందాం.
బీజేపీ మ్యానిఫెస్టో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏ మేరకు ఉపయోగపడుతుందో చూద్దాం..!
సమ్మక్క- సారక్క గిరిజన యూనివర్సిటీ..: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే గిరిజనులకు సమ్మక్క-సారక్క పేర్ల మీద గిరిజన యూనివర్సిటీని నిర్మిస్తామంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం గిరిజనులకు రిజర్వేషన్ పెంచుతూ అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రానికి పంపింది. కానీ కేంద్రం నేటికీ స్పందించలేదు. నూతన పార్లమెంట్ భవనం ప్రారంభానికి రాష్ట్రపతి, గిరిజన బిడ్డ ద్రౌపది ముర్మును ఆహ్వానించలేదు.
అలాంటి వారికి గిరిజనులపై ప్రేమ ఉన్నదంటే నమ్మగలమా?
గ్యాస్ సిలిండర్ల ధర తగ్గించటం : గ్యాస్ సిలిండర్ల ధరలు తగ్గిస్తామని మ్యానిఫెస్టోలో ప్రస్తావించారు. పదేండ్లుగా గ్యాస్ ధరలు పెంచుతూ పోతు న్న కేంద్రం గ్యాస్ ధరలు తగ్గిస్తామంటే ప్రజలెలా నమ్ముతారు.
బీసీ ముఖ్యమంత్రి: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేస్తామని ఆ పార్టీ ప్రకటించింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న బీసీ నేతను పక్కనపెట్టి అగ్రకులానికి చెందిన వారిని అధ్యక్షుడిగా చేసింది. అలాంటి బీజేపీ చేసిన బీసీ ముఖ్యమంత్రి ప్రకటనను ఎవరూ నమ్ముతారు.
ఎస్సీ వర్గీకరణ : ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏండ్లుగా ఉద్యమం కొనసాగుతున్నది. వర్గీకరణకు తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. కానీ కేంద్రం స్పందించలేదు. అంటే వర్గీకరణపై చిత్తశుద్ధి లేదనేది స్పష్టం.
తెలంగాణ రాష్ట్ర పూర్వ వైభవం: అంటే రాజుల కాలం నాటి రాజరిక వ్యవస్థనా? మరేదైననా? ఆ పార్టీకే క్లారిటీ లేదు.
అధికారికంగా విమోచన ఉత్సవాలు : తెలంగాణ విమోచన ఉత్సవాలను ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించడం సరైనదే. కానీ ప్రజలు ఎవరి నుంచి విమోచన పొందారు నిజాం రాజు నుంచా? స్థానిక దొరల నుంచా? ప్రజలకు విప్పిచెప్పాలి. అప్పుడే కదా అర్థమయ్యేది.
అర్చకుల జీతాలు పెంచడం: ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అర్చకులకు జీతాలు ఇస్తున్నది. పెంచటం మంచిదే కానీ, అర్చకులుగా ఇతర కులాల వారిని ఎందుకు నియమించకూడదు?
కృష్ణానది జలాల్లో తెలంగాణ వాటా తేల్చడం: కృష్ణానది జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలనుకునే బీజేపీ తెలంగాణకు రావలసిన వాటాను ఇవ్వటం లేదు. పైగా కర్ణాటక ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇస్తూ తెలంగాణ వాటాను దక్కకుండా చేస్తున్నది.
సమగ్ర ధాన్యలక్ష్మి ప్రణాళిక: సమగ్ర ధాన్యలక్ష్మి పథకం ప్రవేశపెట్టి రైతులు పండించే ధాన్యాలకు సరైన గిట్టుబాటు ధరను కల్పిస్తామని చెప్తున్నది. కానీ కేంద్రం వ్యవసాయరంగాన్ని కార్పొరేట్ల చేతుల్లో పెట్టి వ్యవసాయ రంగాన్ని ప్రైవేటీకరించాలని చూస్తున్నది.
పసుపు బోర్డు ఏర్పాటు: పదేండ్లుగా కేంద్రాన్ని ఒప్పించలేని రాష్ట్ర బీజేపీ నాయకులు ఇప్పుడు ‘పసుపు బోర్డు’ ఏర్పాటుచేస్తామని చెప్పడం హాస్యాస్పదం.
నారీ శక్తి వందన్: నారీ శక్తి వందన్ పేరుతో మహిళలకు 30 శాతం రిజర్వేషన్లు అమలుచేయడం ద్వారా చట్టసభలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు అవకాశం కల్పిస్తామంటున్నారు. కానీ బీసీ మహిళలకు సబ్కోటా కేటాయించకుండా రిజర్వేషన్లు తీసుకురావాలనుకోవటం వారిని చట్టసభలకు దూరం చేయడమే.
గిరిజన సంప్రదాయాల పరిరక్షణ: గిరిజనుల సం స్కృతి. సంప్రదాయాలను పరిరక్షిస్తామని బీజేపీ చెప్పటం విడ్డూరం. ఆదివాసులున్న ప్రాంతాల్లో ఖనిజ సంపదను కార్పొరేట్లకు అప్పగిస్తూ వారి సంస్కృతిని బీజేపీ విధ్వంసం చేస్తున్నది. సాధ్యం కానీ హామీల తో విడుదల చేసిన బీజేపీ మ్యానిఫెస్టోతో ప్రజలకు ఏ మాత్రం ఉపయోగం లేదు.
గుండమల్ల సత్యనారాయణ
95059 98838