దేశ రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కొత్త విప్లవాన్ని సృష్టిస్తున్నది. సమస్య ఏదైనా.. పరిష్కరించే సత్తా, సామర్థ్యం ఉన్న నాయకుడు కేసీఆర్. ఆయన అధ్యక్షతన ఏర్పడిన బీఆర్ఎస్ ద్వారా కేవలం మా సమస్యలే కాదు, దేశంలోని సమూల మార్పులు సాధ్యమని సింగరేణి కార్మిక లోకం నమ్ముతున్నది. 103 ఏండ్ల సింగరేణి చరిత్రను తిరగరాసి.. కేవలం ఎనిమిదేండ్లలో ప్రభుత్వరంగ సంస్థ దిశ దశను మార్చడమే కాదు, దేశంలోనే నంబర్ వన్ సంస్థగా తీర్చిదిద్దేందుకు జరుగుతున్న ప్రయత్నాలు, రూపుదిద్దుకున్న ప్రణాళికలే అందుకు కారణం.
సింగరేణికి కొత్త బ్లాక్లు దక్కాలంటే కేంద్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండాలన్న అభిప్రాయం కార్మికుల్లో కనిపిస్తున్నది. ఇదే కాదు, కేంద్రం పరిధిలో అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలు పరిష్కారం కావాలంటే దేశానికి కేసీఆర్ నాయకత్వం కావాలన్న భావన కార్మికుల్లో వ్యక్తమవుతున్నది.
సింగరేణికి మహర్దశ రావాలన్నా, కేంద్రం కుట్రలకు అడ్డుకట్ట పడాలన్నా, కార్మికులకు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలుకావాలన్నా, దశాబ్దాల తరబడి కేంద్రం వద్ద ఉన్న అనేక పెండింగ్ సమస్యలకు పరిష్కారం లభించాలన్నా కేంద్రంలో బీఆర్ఎస్ ఉంటేనే సాధ్యమవుతుందని సింగరేణి కార్మిక లోకం బలంగా నమ్ముతున్నది. సింగరేణి కార్మికలోకం అసలు బీఆర్ఎస్ వైపు ఎందుకు చూస్తున్నదని పరిశీలిస్తే…. ఆ సంస్థపై కేంద్రం చూపుతున్న వివక్ష, స్వరాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, మూలాలను లోతుగా చూడాల్సిన అవసరం ఉన్నది. గలగలా పారే గోదావరి పాదాల చెంతన 350 కిలోమీటర్ల పొడవున ఆరు జిల్లాల్లో సింగరేణి విస్తరించి ఉన్నది. 1889లో ఇల్లెందు ఏరియాలోని సింగరేణి గ్రామం వద్ద బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించి.. డిసెంబర్ 23, 1920లో సింగరేణి కాలరీస్ కంపెనీగా పేరు మార్చుకున్నది. 1945లో నిజాం ప్రభువు సింగరేణి షేర్లను కొనుగోలు చేయడంతో తొలి ప్రభుత్వరంగ సంస్థగా మారింది. ఇప్పటికే సింగరేణి పరిధిలో 26 భూగర్భ, 20 ఉపరితల గనులున్నా యి. దాదాపు 43 వేల పైచిలుకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. స్వరాష్ట్రంలో కొత్తగా కారుణ్య నియామకాలు, వివిధ నోటిఫికేషన్ల ద్వారా 17 వేలకు పైగా పోస్టులను భర్తీ చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో చీకట్లు అలుముకున్న సింగరేణి స్వరాష్ట్రంలో పరుగులు పెడుతున్నది. యజమాని, శ్రామిక సంబంధాలను మానవ సంబంధాలుగా మారుస్తూ సింగరేణి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తున్నది. లాభాల వాటా, కారుణ్య నియామకాలు, దసరా బోనస్, కార్మికుల సొంత గృహాల కోసం రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణం, కార్మికుల తల్లిదండ్రులకు కార్పొరేట్ వైద్య సదుపాయం, సంస్థ సాధించిన లాభాల్లో కార్మికులకు 10 శాతంగా ఉన్న వాటాను క్రమంగా 30 శాతానికి పెంచింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కార్మికులకు నజరానాగా తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలో అతిపెద్ద బొగ్గు పరిశ్రమ అయినా కోల్ ఇండియా కన్నా.. మెరుగైన సంక్షేమ పథకాలు, అలవెన్సులు, లాభాల్లో కార్మికులకు భాగస్వామ్యం కల్పిస్తున్న సంస్థ ఒక్క సింగరేణి మాత్రమే. 2013-14లో రూ.11,928 కోట్లుగా ఉన్న టర్నోవర్.. ప్రస్తుతం రూ.26,586 కోట్లకు పైగా పెరగడం స్వరాష్ట్రంలో సాధించిన ప్రగతికి నిదర్శనం. ఈ పరిస్థితుల్లోనే కేవలం సంప్రదాయ బొగ్గు ఉత్పత్తికి మాత్రమే పరిమితం కాకుండా థర్మల్, సౌర విద్యుత్తు ఉత్పత్తి రంగాల్లోకి ప్రవేశించి.. మంచి విజయాలను సంస్థ సాధిస్తున్నది. భవిష్యత్తులో మరిన్ని వినూత్న వ్యాపారాల్లోకి ప్రవేశించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. వచ్చే యాభై ఏండ్ల వరకు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు సాగుతున్నది.
బీఆర్ఎస్ వైపు కార్మికుల చూపు: అనేక ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసి కార్పొరేటు కంపెనీలకు ధారాదత్తం చేసిన కేంద్రం సింగరేణిని కూడా అదే బాటలో కలిపేందుకు దొడ్డిదారుల్లో వెళ్తున్నది. సింగరేణికి చెందిన కల్యాణ్ఖని బ్లాక్-6, కోయగూడెం బ్లాక్-3, సత్తుపల్లి బ్లాక్-3, శ్రావణ్పల్లి బ్లాకులను ప్రైవేటీకరణ చేసేందుకు తన కుట్రలను అమలుచేస్తున్నది. ఇప్పటికే కోయగూడెం బొగ్గు బ్లాకును అరబిందో ఫార్మా కంపెనీకి అంటగట్టేందుకు నిర్ణయం తీసుకున్నది. 2022 నవంబర్ 12న గోదావరిఖని వచ్చిన ప్రధాని మోదీ సింగరేణిని ప్రైవేటీకరణ చేయబోమని సభా వేదికగా హామీ ఇచ్చిన మరుసటి రోజు నుంచే ప్రైవేటీకరణ కుట్రలు మరింత వేగవంతమయ్యాయి. ఈ కుతంత్రాలకు అడ్డుకట్టపడి.. సింగరేణికి కొత్త బ్లాక్లు దక్కాలంటే కేంద్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండాలన్న అభిప్రాయం కార్మికుల్లో కనిపిస్తున్నది.
ఇదే కాదు, కేంద్రం పరిధిలో అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలు పరిష్కారం కావాలంటే దేశానికి కేసీఆర్ నాయకత్వం కావాలన్న భావన కార్మికుల్లో వ్యక్తమవుతున్నది. ఇందుకు అనేక ఉదాహరణలున్నాయి. మచ్చుకు ఒక్కటి తీసుకుంటే త్రివిధ దళాల మాదిరిగానే సింగరేణి కార్మికులకు ఇన్కంటాక్స్ మినహాయింపు నివ్వాలని కోరుతూ 2014 జూన్ 4న అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. తొమ్మిదేండ్లు గడిచినా ఉలుకు లేదు, పలుకు లేదు. పార్లమెంట్ సమావేశాల్లోనూ తెలంగాణ ఎంపీలు పలుమార్లు ఈ అంశాన్ని లేవనెత్తినా అవేం తమకు పట్టవన్నట్లుగా కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నది. అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానానికి పరిష్కారం చూపకపోగా.. కార్మికుల వేతనాల నుంచి ఆదాయపన్ను పేరిట ఏటా కోట్లు దండుకుంటున్నది.
సింగరేణిలో రాష్ర్టానికి 51 శాతం వాటా ఉంటే కేంద్రానిది 49 శాతం వాటా. కేంద్రం కుట్రలను ఉహించిన సీఎం కేసీఆర్ ప్రభు త్వం వచ్చిన తొలినాళ్లలోనే కేంద్ర 49 శాతం వాటాను కూడా కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని స్వయంగా లేఖ రాశారు. కానీ, కేంద్రం ఇప్పటికీ సమాధానం ఇవ్వలేదు.
కేంద్రం చిన్నచూపు: బొగ్గు గని కార్మికులకు ఐదేండ్లకోసారి అమలుచేయాల్సిన వేతన ఒప్పందాలు ఏండ్ల తరబడి పెండింగ్లో ఉన్నా యి. వేజ్బోర్డు సమావేశాలను తరచూ వాయి దా వేస్తున్నది. 2021, జూలై 1 నుంచి అమ లుకావాల్సిన వేతన ఒప్పందానికి అతీగతి లేదు. గడిచిన రెండు దశాబ్దాలుగా పింఛన్లో పెరుగుదల లేదు. సింగరేణి ఒకవైపు తన పరిధిని ఇతర రాష్ర్టాలకు విస్తరించుకుంటూనే పలు బొగ్గు గనులను దక్కించుకొని ముందు కు సాగుతుంటే కేంద్రం చిన్నచూపు చూడటాన్ని కార్మికులు జీర్ణించుకోలేకపోతున్నారు. కేంద్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే కార్మికుల పరిస్థితి బాగుంటుందని కార్మిక లోకం ఆశిస్తున్నది. కార్మికుల హక్కులు, వారి సంక్షేమం, సింగరేణికి మహర్దశ రావాలంటే కేంద్రంలో బీఆర్ఎస్ ఉండాలన్నదే కార్మికుల బలమైన డిమాండ్గా వినిపిస్తున్నది.
(వ్యాసకర్త: కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ)
-కడపత్రి ప్రకాశ్రావు
80966 77022