నవంబర్ 28న రాత్రి 8.30 గంటల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. చాలా సంతోషించాను. ఆయన నాతో ‘కొద్దిసేపటి కిందట జరిగిన విలేకరుల సమావేశం టీవీలో చూశావా’ అని అడిగారు. నేను లేదని చెప్పా. 1996-97లో సెంటర్ ఫర్ సబాల్ట్రన్ స్టడీస్లో (సీఎస్ఎస్) జరిపిన చర్చల గురించి ఆ సమావేశంలో ప్రస్తావించినట్టు కేసీఆర్ చెప్పారు.
ఉమ్మడి రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్న కేసీఆర్ సీఎస్ఎస్ ఏర్పాటులో, నిర్వహణలో ఎంతగానో సహకరించారు. అప్పుడు నేను ఇండియన్ ఎక్స్ప్రెస్లో పని చేస్తున్నాను. నాతో పాటు మరో సీనియర్ జర్నలిస్టు ఉండేవారు. నేను, దివంగత కేఎన్ చారి (ఆంధ్రభూమి) రోజువారీ నిర్వహణ బాధ్యతలను చూసుకునేవాళ్లం. ప్రధానంగా, సీఎస్ఎస్ లక్ష్యం ఏమిటంటే.. ఆలోచనాపూర్వకమైన చర్చలు జరిపి, ప్రత్యేక తెలంగాణ సాధించడానికి మార్గాలను అన్వేషించడం.
సీఎస్ఎస్ను అధికారికంగా ప్రారంభించే ముందు సచివాలయంలోని కేసీఆర్ చాంబర్లో అనేక తడవలు చర్చలు నిర్వహించాం. భావసారూప్యత కలిగిన కొందరం తెలంగాణ గురించి మాట్లాడుకునేందుకు ఒక వేదికను ప్రారంభించాలని మొదట అనుకున్నాం. కానీ, సమాజంలో అణచివేతకు గురవుతున్న అన్నివర్గాల సమస్యలను కూడా మేధోమథనంలో భాగం చేయాలని కేసీఆర్ సూచించారు. అందుకే సెంటర్ ఫర్ సబాల్ట్రన్ స్టడీస్ అనే పేరును ఆ సంస్థకు పెట్టాం.
కేసీఆర్ అధికారిక నివాసమైన మెట్టుగూడలోని ట్రాన్స్పోర్ట్ భవన్లో సీఎస్ఎస్కు సంబంధించిన అంశాలు చర్చించేందుకు అనేకసార్లు సమావేశమయ్యాం. నాటి ఓయూ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ రామకిష్టయ్య, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సర్దార్ అలీఖాన్, పౌరహక్కుల కార్యకర్త కన్నాబిరాన్, ప్లానింగ్ కమిషన్ మాజీ సభ్యులు సీహెచ్ హనుమంతరావు వంటి హేమాహేమీలందరూ సీఎస్ఎస్కు వచ్చినవారే. ప్రముఖ మేధావులు గెయిల్ ఓవ్ువెట్, అరుణ్శౌరీ, అస్ఘర్ అలీ ఇంజినీర్, ప్రొఫెసర్ ఎఫ్డీ వకీల్, ప్రొఫెసర్ కంచె ఐలయ్య, బీడీ శర్మ, డాక్టర్ కె.బాల్గోపాల్ వంటివారు ఉమ్మడి రాష్ర్టానికి సంబంధించిన వివిధ అంశాలు, సమస్యలపై సమర్పించిన పేపర్లను కూడా సేకరించాం. తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించాలని భావించినప్పుడు నాటి శాసనసభ్యులు పి.ఇంద్రారెడ్డి కూడా మేం చేస్తున్న పనేమిటో, ఎలా చేస్తున్నామో తెలుసుకోవడానికి సీఎస్ఎస్కు వచ్చారు.
వివిధ రంగాల్లో తెలంగాణకు జరిగిన, జరుగుతున్న అన్యాయం గురించి నాటి సీఎం కార్యాలయంలో కేసీఆర్ బహిరంగంగా విభేదించేవారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే వీటన్నింటికీ పరిష్కారమని ఆయన అప్పుడే భావించారు. తెలంగాణ వెనుకబాటుతనంపై ఎటువంటి చర్చను అనుమతించేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధంగా లేని కాలమది.
సభలో తెలంగాణపై చర్చకు అనుమతించబోమంటూ నాటి అసెంబ్లీ స్పీకర్ వై.రామకృష్ణుడు తిరస్కరించారు. తెలంగాణ అన్న పదానికి బదులుగా వెనుకబడిన ప్రాంతాలు అన్నమాట ఉపయోగిస్తేనే చర్చకు అనుమతిస్తామని రామకృష్ణుడు సభలో ప్రకటించారు. నాటి స్పీకర్ రూలింగ్ను తీవ్రంగా పరిగణించిన అతి తక్కువమంది నాయకులలో కేసీఆర్ ఒకరు.
2000లో విద్యుత్తు ధరలను పెంచినప్పుడు దానితో విభేదిస్తూ సీఎంకు బహిరంగ లేఖను రాయడం ద్వారా చంద్రబాబుతో తనకున్న అభిప్రాయభేదాలను కేసీఆర్ బట్టబయలు చేశారు. ప్రధానంగా బోరుబావులపై ఆధారపడి వ్యవసాయం చేసుకునే తెలంగాణ ప్రజలపై విద్యుత్తు ధరల పెంపు పర్యవసానం ఎలా ఉంటుందనే విషయాన్ని అత్యంత శ్రద్ధతో అధ్యయనం చేశారాయన. అధికార పార్టీ నుంచి ఈ నిర్ణయాన్ని మొట్టమొదట వ్యతిరేకించిన వ్యక్తి కేసీఆరే.
కేసీఆర్ రాజకీయ జీవితంలో ఆ లేఖే గొప్ప మలుపు అని చెప్పాలి. నిద్రాణంగా ఉన్న ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని పునరుద్ధరించాలని అప్పుడే ఆయన నిర్ణయాత్మక వైఖరి తీసుకున్నారు. చాలామంది అపనమ్మకంతో చూశారు. కానీ, ఆయన తన నిర్ణయంపై దృఢ సంకల్పంతో ముందుకెళ్లారు. అలా 2001లో తెలంగాణ రాజకీయ ఉద్యమానికి తెరలేపారు. చర్చలు, వాదోపవాదాలు సర్వసాధారణమై, టీఆర్ఎస్ మరొక సీఎస్ఎస్ అయింది.
(2016 డిసెంబర్ 20న ప్రచురితమైన వ్యాసంలోని ముఖ్యాంశాలు)
-ఎస్. రామకృష్ణ