కేంద్ర ఆర్థికమంత్రి అందజేసిన సమాచారం ప్రకారం.. 2014-15 నుంచి 2021-22 వరకు మొత్తం నిరర్థక ఆస్తులు రూ.66.5 లక్షల కోట్లు. వీటిలోంచి రూ.14.5 లక్షల కోట్లను రద్దు చేశారు. వీటిలో ఎంత గరిష్ఠంగా వసూలు చేసినా రూ.2.8 లక్షల కోట్లకు మించి రాదు. మిగిలిన రూ.12 లక్షల కోట్లు శాశ్వతంగా నష్టపోయినట్లే. ప్రజల సొమ్మును ప్రభుత్వ అనుకూల కార్పొరేట్లు దోచుకునే ఈ విధానానికి అంతమెప్పుడు?
నరేంద్రమోదీ ఎనిమిదేండ్ల పాలనలో రూ.12 లక్షల కోట్ల రుణాలను బ్యాంకులు మాఫీ చేశాయి. ఈ రుణాలు ము ఖ్యంగా భారీ కార్పొరేట్ కంపెనీలు తీసుకున్నవే. ఇదంతా ‘చట్టబద్ధంగానే’ జరిగింది. ఎ లాగంటే, పరిశ్రమల స్థాపన పేరుతో రుణాలు తీసుకోవటం ఆ తర్వాత వాటిని నిరర్థక ఆస్తులుగా (ఎన్పీఏలుగా) ప్రకటించటం. రుణాల ను మాఫీ చేయించుకోవటం. భారత్లో ఎన్పీఏలు అంతర్జాతీయంగా అంగీకరించిన ప్రమాణాల కన్నా 4-6 రెట్లు అధికంగా ఉంటున్నా యి. ఇంత భారీస్థాయి వ్యవహారం రాజకీయ మద్దతు లేకుండా జరిగే అవకాశమే లేదు. ఎవరైనా ఒకరిద్దరు జైలులో ఉన్నారంటే, వారికి రాజకీయ బాసుల రక్షణ లేకపోవటం వల్లేనని మనం భావించవచ్చు. ఎన్పీఏలు అన్నీ కూడా కావాలని తయారైనవి కావన్నది వాస్తవం. అందుకనే, మొత్తం రుణాల్లో 1-2 శాతం ఎన్పీఏలుగా మారే అవకాశం ఉందని అంతర్జాతీయంగానే అంగీకరించిన విషయం. వీటిలో సగం (0.5-1 శాతం) వరకు రుణాలు రద్దు చేయబడతాయి కూడా. ఐఎంఎఫ్-2021 నివేదిక ప్రకారం మొత్తం రుణాల్లో ఎన్పీఏల నిష్పత్తి అమెరికాలో, బ్రిటన్లో దాదాపు ఒక శాతం. కెనడాలో 0.4 శాతం, దక్షిణ కొరియాలో 0.2 శాతం, స్విట్జర్లాండ్లో 0.7 శాతం ఉంది. ఆర్థిక అక్రమాలపై అత్యంత కఠినంగా వ్యవహరించటం వల్లే ఈ దేశాల్లో పరిస్థితులు ఇంత మెరుగ్గా ఉన్నాయి. ప్రజాధనాన్ని, వనరుల్ని ఇష్టారీతిన దోచుకునే క్రోనీ క్యాపిటలిస్టులు ఉన్న రష్యాలో ఈ నిష్పత్తి 8.3 శాతం ఉంది. మోదీ పాలనలో ఉన్న భారత్ కూడా రష్యాకు ఏమీ తీసిపోవటం లేదు. కానీ, దీనిపై ప్రధాన స్రవంతి మీడియా ఎన్నడూ నోరు మెదపటం లేదు.
గతేడాది డిసెంబరు 13న రాజ్యసభలో ఆర్థికమంత్రి నా ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘అన్ని షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల రుణాలు, నిరర్థక ఆస్తుల నిష్పత్తి 31 మార్చి 2014న 4.1 శాతం ఉండగా, 31 మార్చి 2018న అది 11.46 శాతానికి పెరిగింది’ అని తెలిపారు. ఆర్థికశాఖ సహాయమంత్రి మరింత వివరంగా.. గత ఏడేండ్లలో గరిష్ఠం 12.17 శాతానికి చేరిందని వెల్లడించారు. అయితే, గతేడాది మార్చి 31కి ఇది తగ్గి 5.9 శాతానికి, సెప్టెంబరుకు 6.5 శాతానికి పెరిగింది. దీనిపై ఆర్థిక మంత్రి ప్రభు త్వ చర్యల కారణంగానే ఇది సాధ్యమైందని చెప్పుకొచ్చారు. కానీ, అదంతా వట్టిదేనని గతేడాది డిసెంబరు 29న విడుదలైన ఆర్బీఐ నివేదిక స్పష్టం చేసింది. 2023 సెప్టెంబరుకు ప్రభుత్వరంగ బ్యాంకుల ఎన్పీఏలు 9.4 శాతానికి, ప్రైవేటు బ్యాంకుల ఎన్పీఏలు 5.8 శాతానికి చేరుకోవచ్చని అంచనా వేసింది.
ఈ పరిస్థితిని బ్యాలెన్స్ చేసుకోవటానికి లా భాలను ఆర్జించే ప్రభుత్వరంగ బ్యాంకుల (పీఎస్బీ) చేత నష్టాలు వస్తున్నట్లుగా చూపిస్తున్నది ప్రభుత్వం. యూపీఏ-2 హయాంలో పీఎస్బీలు ఏటా రూ.35 వేల కోట్ల నుంచి రూ.50 వేల కోట్ల లాభాలు ఆర్జించాయి. అవే బ్యాంకులు మోదీ పాలన మొదలైన నాలుగేండ్లలోనే (2015-16 నుంచి 2019-20) రూ.2 లక్షల కోట్ల నష్టాలు చవిచూశాయి. ఎన్పీఏలను భరించటం వల్లనే వీటికి ఈ నష్టాలు. రాజ్యసభలో ఆర్థికమంత్రి ఇచ్చిన సమాధానం ప్రకారం.. 2014 నుంచి 2018కి ఎన్పీఏలు రూ.2.51 లక్షల కోట్ల నుంచి 9.63 లక్షల కోట్ల కు పెరిగాయి. నాలుగేండ్లలో నాలుగు రెట్ల పెరుగుదల. ఈ డబ్బంతా ఎటు పోతోందని నిలదీ స్తూ బ్యాంకు ఉద్యోగుల సంఘాలు రోడ్డెక్కా యి. ఈ స్థాయిలో ఎన్పీఏలను, రుణాల రద్దు ను మనదేశం గతంలో ఎప్పుడూ చూడలేదు.
ఎన్పీఏల కోసం రూ.1.93 లక్షల కోట్లను కేటాయించిన యూపీఏ-2 హయాంలోనే ఈ సమస్య మొదలై ఉండవచ్చు. కానీ, నాడు ఎన్పీఏల నిష్పత్తి 3-4 శాతానికి మించలేదు. ఆ తర్వాతే పరిస్థితి విషమించింది. ఎన్పీఏల కోసం రూ.10.16 లక్షల కోట్ల భారీ మొత్తాన్ని కేటాయించటం జరిగింది. విచిత్రమేమిటంటే, మన్మోహన్ పదేండ్ల హయాంలో ఈడీ 112సార్లు సోదాలు జరిపితే, మోదీ ఎనిమిదేండ్ల పాలనలోనే దానికి 27 రెట్లు సోదాలు పెరిగాయి. అయినప్పటికీ, ఎన్పీఏలు తగ్గలేదు సరికదా.. విపరీతంగా పెరిగాయి. దీనికి ప్రధాన కారణం.. మోదీతో, బీజేపీతో సన్నిహిత సంబంధాలున్న కార్పొరేట్లే. నీరవ్మోదీ, మెహుల్ చోక్సీ వంటి వాళ్లకు అప్పులివ్వక తప్పని పరిస్థితిని ఎదుర్కొన్న బ్యాంకులు ఎలా దివాళా తీశాయో ఇప్పటి వరకూ బయటకు రాలేదు. రూ.లక్ష కోట్ల మేర అప్పు చేసి చేతులెత్తేసిన అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూపు కంపెనీల వ్యవహారంపై కూడా నిశ్శబ్దమే కొనసాగుతున్నది.
మన్మోహన్ రెండో దఫాలో జీడీపీ
లో కార్పొరేట్ పన్నుల వాటా 3.34 శాతానికి చేరుకుంటే, మోదీ రెండో దఫాలో అది 2.3 శాతానికి పడిపోయింది. ఈ భారాన్ని క్రూరమైన జీఎస్టీ, కేంద్ర పన్నులు, సుంకాలు, వ్యక్తిగత ఆదాయపన్నుల రూపంలో సామాన్య పౌరులు మోశారు. జీడీపీలో ఒక్క శాతాన్ని మోదీ ఈ విధంగా కార్పొరేట్లకు బహుమతిగా ఇచ్చారు. ప్రతిగా వారి నుంచి మోదీకి, బీజేపీకి కచ్చితంగా ప్రత్యుపకారం జరిగే ఉండవచ్చు. ఆ పార్టీ నిధుల ప్రవాహంతో అజేయంగా క నిపిస్తున్నదంటే దానంతట అదే జరగదు.
షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల (ప్రభుత్వరంగ, ప్రైవేటు, విదేశీ బ్యాంకుల) మొత్తం నిరర్థక ఆస్తులు 2014-15 నుంచి 2021-22 మధ్య కాలంలో రూ.66.5 లక్షల కోట్లుగా పేరుకుపోయాయి. ఇది పార్లమెంటులో ఆర్థికమంత్రి చెప్పిన వివరాల ఆధారంగా వేసిన లెక్కనే. అయితే, ఈ ఎనిమిదేండ్ల కాలవ్యవధిలో ఎన్పీఏల్లో ఎంత మాఫీ చేశారన్నదానిపై స్పష్టత లేదు. పాత గణాంకాల ప్రకారం చూస్తే ఇది రూ.14.5 లక్షల కోట్లు ఉంటుంది. ఎన్పీఏలను రద్దు చేసినప్పటికీ.. కొంత మొత్తాన్ని వేలం ద్వారా, ఇతరత్రా ఎగవేతదారుల నుంచి రాబట్టటానికి అవకాశం ఉంది. ఆర్థికమంత్రి చెప్పిన ప్రకారమే.. 13 శాతం వరకు రాబట్టవచ్చు. దీనిని మరింత పెంచి 20 శాతంగా తీసుకున్నా.. మొత్తం రూ.14.5 లక్షల కోట్లలో రూ.2.8 లక్షల కోట్లు మాత్రమే ఏనాటికైనా వసూలయ్యే అవకాశం ఉంది. అంటే, దాదాపు రూ.12 లక్షల కోట్లు శాశ్వతంగా దేశం నష్టపోయినట్లే. ఈ డబ్బు మనవంటి సాధారణ డిపాజిట్దారులు, చిన్నస్థాయి ఇన్వెస్టర్లదే. బోఫోర్స్ కుంభకోణం విలువ రూ.64 కోట్లు. కానీ, ఇక్కడ రూ.12 లక్షల కోట్ల కుంభకోణం జరిగింది. చిన్న చిన్న ఆర్థిక నేరాలపై క్రిమినల్ చర్యలు తీసుకుంటున్నప్పుడు.. ఈ భారీ నేరాలపై చర్యలు ఎప్పుడు తీసుకుంటారు?
(వ్యాసకర్త: జవహర్ సర్కార్, రాజ్యసభ ఎంపీ,ప్రసారభారతి మాజీ సీఈఓ) (ది వైర్ సౌజన్యంతో)