ఒకప్పుడు ఒకరి అరెస్టు అనగానే అందరూ ఆ కేసులో నిజం ఉందని నమ్మేవారు. కాలం గడిచి, రాజకీయాలు భ్రష్టుపట్టిన కొద్దీ ప్రజలకు ఆ రాజకీయాలపైన, ప్రభుత్వాలపైన, పోలీసు ఏజెన్సీలపైన విశ్వాసం తగ్గటం మొదలైంది. అందుకు పర్యవసానంగా రాజకీయ అరెస్టులపై కూడా విశ్వాసం తగ్గుతూ వస్తున్నది. ఈ స్థితి కేంద్రంలో నరేంద్రమోదీ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పరాకాష్ఠకు చేరుకుంది. ఇప్పుడు ఈ అరెస్టులకు ప్రజల్లో ఎటువంటి విశ్వసనీయత లేకుండాపోయింది. అందుకు కారణం దేశ ప్రజలకు ఎవరో, ఏదో చెప్పి బోధించడం కాదు. అన్ని పరిణామాలు గత పదేండ్లుగా తమ కండ్ల ఎదుటే జరుగుతున్నవి. వాటిని బట్టి ప్రజలు ఇటువంటి అభిప్రాయానికి వస్తున్నారు.
Arrest | బీఆర్ఎస్ నాయకురాలు కవిత కేసునే గమనించండి. ఢిల్లీ ప్రభుత్వ మద్యం విధానం కేసులో ఆమె నిందితురాలు. ఆ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా మరికొందరిని నిందితులుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పేర్కొన్నది. ఇప్పుడు అసలు ఆ విధానమే లేదు, రద్దయింది. అయినా కేసు ఏడాదికి పైగా సాగుతున్నది. ఈడీ ఇంతకాలంలో మరికొద్ది మంది నిందితులు తనకు లొంగిపోయి ఇచ్చిన వాంగ్మూలాల ప్రకటనలు మినహా ఆధారాలు ఏవీ సంపాదించలేక పోయింది. ఆ మాట మనం అనటం కాదు. స్వయంగా ఢిల్లీలోని సీబీఐ కోర్టు న్యాయమూర్తి ఎంకే నాగ్పాల్ అన్నారు. ఆయన ఈ మాట అని ఇప్పటికి 10 నెలలు గడిచాయి. అయినప్పటికీ అసలు ఏ నిందితులపై కూడా తగిన సాక్ష్యాధారాలు సేకరించి చూపలేకపోయారు. ఈడీ మాత్రం ఆ కేసును నిందితులపై దాడులు, సోదాలు, అరెస్టుల పరంపరలతో ఎడతెగకుండా కొనసాగిస్తూనే ఉంది. అందులో భాగంగా కవితను ఈ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్లో అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకువెళ్లారు. దీనిని బట్టి ప్రజలకు కలిగే అభిప్రాయం ఏమిటి? ఈ కాలమంతా ఈడీ విచారణకు ఆమె సహకరిస్తూనే వచ్చారు. ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి ఎన్నోసార్లు హాజరయ్యారు. కానీ, అధికారులు ఇంతవరకు తేల్చగలిగింది ఏమీ లేకపోయింది. తనకు శనివారం నాడు వారం రోజుల రిమాండ్ ఒక రొటీన్ విషయం.
మోదీ అధికారానికి వచ్చినప్పటి నుంచి ఈడీ, ఐటీ, సీబీఐ వంటి సంస్థలకు విశ్వసనీయత లేకుండా పోవడంలో ఇది ఒకానొక ఉదాహరణ మాత్రమే. ఇటువంటి సందర్భాలు కోకొల్లలన్నది ఇక్కడ గుర్తించవలసిన విషయం. ఒకవేళ ఇటువంటివి ఒకటి రెండు మాత్రమే జరిగి ఉంటే, అవి అసత్యపు కేసులు అయినప్పటికీ, ప్రజలలో విశ్వసనీయత ఏర్పడేదేమో. కానీ అట్లా కాదు. అవి డజన్లకొద్దీ కనిపిస్తున్నాయి. దేశమంతా ఉంటున్నాయి. ఈ పదేండ్లుగా సాగుతూనే ఉన్నాయి. ఎవరిపైన? బీజేపీతో ఏకీభవించని వారిపైన, ప్రతిపక్షాలపైన. ఆ పార్టీకి లొంగని వారిపైన. ఎవరైనా కేసులకు, దాడులకు భయపడి ఆ తర్వాత లొంగివస్తే వారిపై కేసులు వెంటనే రద్దవుతున్నాయి లేదా నిరవధికంగా పెండింగులో పడుతున్నాయి.
బీజేపీయేతరులపై పెట్టిన కేసులలో చివరకు రుజువు అవుతున్నవి అత్యల్పం. ఇవేవీ ఊహాగానపు మాటలు కావు.అన్నింటికీ స్పష్టమైన లెక్కలు, పేర్లు ఉన్నాయి. నిజానికి ఇవన్నీ తరచూ పత్రికలలో వెలువడుతున్నవే. కొంత దృష్టి పెట్టి వార్తలు చదివేవారికి తెలిసినవే. ఎప్పటికప్పుడు సామాన్యులు కూడా మాట్లాడుకుంటున్నవే.ఈ తరహా కేసులకు, ప్రభుత్వానికి విశ్వసనీయత లేకుండా పోయింది అందువల్లనే.అందరికీ తెలిసిన విషయాలే అయినప్పటికీ ఇప్పుడు ఒక సందర్భం ఏర్పడింది కనుక ఆ వివరాలు కొద్దిగా చెప్పుకుందాం. మోదీ పదేండ్ల పాలనలో ప్రతిపక్ష నాయకులపై ఈడీ పెట్టిన కేసులు 5,150 కాగా రుజువైనవి కేవలం 24. సీబీఐ కేసులు 118 కాగా రుజువైనవి 0.42 శాతం మాత్రమే. తక్కినవి నిరవధికంగా అట్లా సాగుతూనే ఉన్నాయి. వాటిని ఆధారం చేసుకుని ప్రతిపక్ష నేతలను వేధించటం, బీజేపీకి లొంగిపోవాల్సిందిగా ఒత్తిడి చేయడం అంతులేకుండా జరుగుతున్నాయి. ఇక బీజేపీకి లొంగిపోయినవారిపై కేసులు నిరవధికంగా పెండింగులో పడిపోవడం, అంతకుమించి వారి ప్రాముఖ్యతను బట్టి పదవులు సైతం కట్టబెట్టడం చేస్తున్నారు. అందుకు రెండు ఉదాహరణలు తెలుగువారి నుంచే ఉండటం తెలిసిందే.
వారు టీడీపీ పార్లమెంటు సభ్యులైన సీఎం రమేష్, సుజనా చౌదరి. ఇందులో రమేష్పై ఈడీ, ఐటీ.. సుజనా చౌదరిపై ఈడీ, సీబీఐ దాడులు జరిపాయి. వారు బీజేపీలో చేరి నాలుగేండ్లకు పైగా గడిచిపోయాయి. దానితో ఇక దాడులు, విచారణలు, కేసులు ఏవీ లేకుండా పోయాయి. వీరిద్దరే గాక నారాయణ రాణే, అజిత్ పవార్, సువేందు అధికారి, హిమంత బిశ్వశర్మ, ముకుల్ రాయ్, జ్యోతిరాదిత్య సింధియా తదితర దేశమంతా తెలిసిన ప్రముఖులు మరెందరో ఉన్నారు. ఇటువంటి తీరును ప్రతిపక్షాలు, మీడియా, మేధావులు ఎంతగా ఎత్తిచూపినా, తీవ్రమైన విమర్శలు చేసినా ఆయా సంస్థల నుంచి గానీ, ప్రధాని మోదీ నుంచి గానీ ఉలుకూపలుకూ లేదు. ఆ సంస్థలు స్వతంత్రమైనవని, అవి తమ పని తాము చేస్తాయని, రాజకీయ జోక్యం ఏమీ లేదని మొక్కుబడి మాటలు చెప్పటం మినహా. అందుకు ప్రజల దృష్టిలో విశ్వసనీయత లేదన్నది వేరే చెప్పనక్కర్లేదు. మొత్తం ఈ విధమైన పదేండ్ల తీరుకు అనుగుణంగానే ప్రస్తుతం కవితపై కేసు, దాడులు, అరెస్టు వ్యవహారం సాగుతున్నది. ఇవన్నీ ప్రజలు ఎప్పటికప్పుడు చూస్తున్నవే.
మోదీ దురదృష్టవశాత్తు ఈ పరిణామాలు ఎన్నికల బాండ్ల కేసు సందర్భంలో జరగటం గమనించదగినది. తమ నీతి గురించి, తమ ప్రభుత్వం అవినీతిని సహించకపోవటం గురించి, అవినీతిని నిర్మూలించటం గురించి, తమ పార్టీలో, ప్రభుత్వంలో అవినీతిపరులకు స్థానం లేకపోవడం గురించి ప్రధానమంత్రి తరచూ దృఢమైన స్వరంలో మాట్లాడుతుంటారు. అందులో నిజమెంతో మనం పైన చర్చించిన విషయమే తిరుగులేని విధంగా స్పష్టం చేస్తున్నది. ఈ సమయంలో ప్రస్తావనకు రాకపోయినా ఆయన ప్రభుత్వం తమ ఆశ్రిత పెట్టుబడిదారుల కోసం ప్రత్యేకంగా ఏమేమి చేస్తూ వస్తున్నదో తెలిసిన విషయమే. అవి తెరవెనుక జరుగుతూ సాధారణ ప్రజల దృష్టికి అంతగా రావని అనుకోవచ్చు. కానీ, నిన్నమొన్ననే ఎన్నికల బాండ్ల వ్యవహారం సుప్రీంకోర్టు ఉత్తర్వుల వల్ల బయటకు వచ్చి ప్రభుత్వ పెద్దల నీతి ప్రవచనాల్లోని డొల్లతనాన్ని దేశమంతటి ముందు బయటపెట్టింది. దీని ప్రభావం అనివార్యమైన రీతిలో ఈడీ, ఐటీ, సీబీఐతో పాటు వాటిని నిర్దేశించే మోదీ ప్రభుత్వ విశ్వసనీయతపై కూడా ఉంటుంది.
వివరాలు గమనించండి. ఎన్నికల బాండ్ల చట్టం మోదీ హయంలో 2017 నుంచి అమల్లోకి వచ్చింది. రాజకీయ పార్టీలకు వ్యాపార సంస్థలు, వ్యక్తులు ఇచ్చే విరాళాలు పారదర్శకంగా ఉండటం ఇందులోని ప్రధాన ఉద్దేశమని అప్పట్లో అన్నారు. ఆ వివరాల్లోకి వెళ్లేందుకు ఇది సందర్భం కాదు. కానీ, విషయం పారదర్శకంగా ఎంతమాత్రం సాగటం లేదంటూ కొంతకాలం పాటు విమర్శలు జరిగాయి. అంతా అధికార పక్షానికి అనుకూలంగా రహస్యంగా జరుగుతున్నదని, కనుక బాండ్ల వ్యవహారాన్ని వెల్లడి చేయాలంటూ ఏడీఆర్ అనే సంస్థ సుప్రీంకోర్టుకు వెళ్లింది. బాండ్ల వివరాలు వెల్లడి చేయాల్సిందేనని కోర్టు ఉత్తర్వు ఇచ్చింది. అయినా ఆ చర్యను వాయిదా వేయించడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గట్టి ప్రయత్నం చేసినా కోర్టు అంగీకరించలేదు. చివరకు రెండు రోజుల క్రితం తగినన్ని వివరాలు బయటకు రావటం, మిగిలినవాటిని కూడా రప్పించేందుకు కోర్టు చేస్తున్న ప్రయత్నం తెలిసిందే.
ఇందులో గమనించవలసింది ఏమంటే, మోదీ ప్రభుత్వం పారదర్శకత పేరిట చేసిందంతా అందుకు విరుద్ధమేనని ఈసరికే దేశానికి అర్థమైంది. బాండ్ల రూపంలో అధికార పక్షం చేసింది వేలకోట్ల రూపాయల మేర లబ్ధి పొందటం. పెద్ద కంపెనీల నుంచి భారీ విరాళాలు సంపాదించి వాటికి లైసెన్సులు, కాంట్రాక్టులు ఇవ్వడం మోదీ ప్రభుత్వం చేసిన పని. కొన్ని కంపెనీలపై ఏజెన్సీల ద్వారా దాడులు జరిపి భయపెట్టి ఆ విధంగా వారు భారీ విరాళాలు ఇచ్చేట్లు ఒత్తిడి చేయడం. బాండ్లకు సంబంధించి మిగిలిన విషయాలు వెలుగులోకి వచ్చినప్పుడు ఈ నీతి పురాణాల గురించి దేశం మరింతగా అర్థం చేసుకోగలదు.ఇవన్నీ చర్చించుకున్న తర్వాత ప్రస్తుత మద్యం పాలసీ ఆరోపణల కేసు గురించి గానీ, అందులో భాగంగా కవిత అరెస్టు, వారం రోజుల రిమాండ్ విషయం గురించి గానీ, మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు గురించి గానీ ఇంకా మాట్లాడవలసింది బహుశా ఏమీ ఉండదు.
-టంకశాల అశోక్