పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హిందీ బెల్టుగా పిలుచుకునే ఛత్తీస్గఢ్,
రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లో ఆ పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నది. ముఖ్యంగా ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో హస్తం పార్టీ అధికారాన్ని కోల్పోయింది. తాజా ఎన్నికల ఫలితాలు ఈ మూడు రాష్ర్టాల్లోని అనేకమంది కాంగ్రెస్ సీనియర్ నేతల రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉన్నది.
77 ఏండ్ల కమల్నాథ్, 72 ఏండ్ల అశోక్ గెహ్లాట్, 76 ఏండ్ల దిగ్విజయ్సింగ్లపై అతిగా ఆధారపడటమే ఆయా రాష్ర్టాల్లో కాంగ్రెస్ కొంప ముంచిందని చెప్పవచ్చు. మధ్యప్రదేశ్, రాజస్థాన్లో అన్నీ తామై నడిపించిన కమల్నాథ్, దిగ్విజయ్సింగ్, అశోక్ గెహ్లాట్ పార్టీని నట్టేట ముంచారు. ఛత్తీస్గఢ్లో సీనియర్ నేత, సీఎం సీటు కోసం భూపేశ్ భగేల్తో పోటీ పడ్డ టీఎస్ సింహ్ దేవ్ ఏకంగా ఓటమి పాలయ్యారు. దీంతో ఆయా రాష్ర్టాల్లో కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల వేళ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది.
కర్ణుడి చావుకు వంద కారణాలన్నట్టు.. మూడు రాష్ర్టాల్లో కాంగ్రెస్ ఓటమికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ప్రధానంగా సీనియర్ నేతల ఒంటెత్తు పోకడలు, వారసత్వ రాజకీయాలు, జూనియర్లను ఎదగకుండా అడ్డుకోవడం తదితర కారణాల వల్లే పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నదని విశ్లేషకులు చెప్తున్నారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ కుమారుడు నకుల్నాథ్ ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. దిగ్విజయ్సింగ్ కుమారుడు జై వర్ధన్ సింగ్ కమల్నాథ్ క్యాబినెట్లో మంత్రిగా పని చేశారు. వీరు తమ కుమారుల రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ ప్రయోజనాలను పణంగా పెట్టినట్టు విమర్శలు వస్తున్నాయి. రెండో తరం నేతలను ఎదగకుండా అడ్డుకుంటుండటంతోనే జ్యోతిరాధిత్య సింధియా కాంగ్రెస్ను వీడి కమల్నాథ్ ప్రభుత్వాన్ని కూల్చారని విశ్లేషకులు వివరిస్తున్నారు.
రాజస్థాన్లోనూ ఇటువంటి పరిస్థితు ల వల్లే ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అక్కడ కూడా వెటరన్ నేత అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య పొసగని సంగతి తెలిసిందే. సచిన్ పైలట్ ఏకంగా సొంత ప్రభుత్వంపైనే తిరుగుబాటు ఎగురవేశారు. అవినీతి ఆరోపణలు చేస్తూ ఆందోళనలకు దిగారు. ప్రభుత్వాన్ని చీల్చేందుకు విఫలయత్నం చేశారు. ఎన్నికల వేళ కూడా ఇరువురు నేతలు ఎవరకి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరించడంతోనే రాజస్థాన్లో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయిందని తెలుస్తున్నది. ఛత్తీస్గఢ్లోనూ వెటరన్ నేత టీఎస్ సింహ్దేవ్, భూపేశ్ భగేల్ మధ్య వర్గ పోరు వల్లే ఆ రాష్ర్టాన్ని కూడా హస్తం పార్టీ కోల్పోవాల్సి వచ్చింది.
ఇంత జరిగినా సీనియర్లు తమ పట్టును వీడకపోతుండటంతో వారిని సాగనంపేందుకు కాంగ్రెస్ మల్లగుల్లాలు పడుతున్నది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ పునరుజ్జీవం కోసం కొత్త నాయకత్వాన్ని తెరపైకి తీసుకురావాలని ఆశిస్తున్నది. 1963లో అప్పటి కాంగ్రెస్ నేత కె.కామరాజ్ ప్రతిపాదించిన ప్లాన్ను అమలుచేయాలని చూస్తున్నది. కొత్త తరం నేతలకు సీనియర్లు నాయకత్వాన్ని బదిలీ చేయాలని సొంత పార్టీ నేతలే చెప్తున్నారు. ప్రజాదరణ కోల్పోయిన సీనియర్లకు రాజకీయ పునరావాసం కల్పించి, కొత్త వారికి మార్గం సుగమం చేసే దిశగా పార్టీలో చర్చలు జరుగుతున్నట్టు ఏఐసీసీ వర్గాలు పేర్కొన్నట్టు విశ్లేషకులు చెప్తున్నారు.
ప్రముఖ రాజకీయ ఎనలిస్ట్ యోగేంద్ర యాదవ్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘కొత్త తరానికి నాయకత్వం బదిలీ చేసే సమయం ఆసన్నమైంది. ప్రజల్లో ఆదరణ కోల్పోయిన సీనియర్లను సాగనంపి కొత్త రక్తాన్ని తెరపైకి తీసుకురావాలి. వారు వారసత్వ రాజకీయాలకు సంబంధించిన వాళ్లు కాకూడదు. కొత్త తరం అంటే యువకులని అర్థం కాదు. వారు కొత్త ఆలోచనలతో ప్రజల ముందుకురావాలి. కొత్త విజన్తో ప్రజల మన్ననలు పొందేవారై ఉండాలి’ అని యోగేంద్ర యాదవ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే పార్టీ నష్టపోతున్నా సీనియర్లు తమ పదవులను వదిలేందుకు సిద్ధంగా లేకపోవడం శోచనీయం.
కూటమిపై ప్రభావం ఉంటుందా?: మరోవైపు మూడు రాష్ర్టాల్లో కాంగ్రెస్ ఓటమి ఇండియా కూటమిపై కూడా ప్రభావాన్ని చూపిస్తున్నది. కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయాలతో బీజేపీకి పుంజుకునే అవకాశాన్ని కల్పించిందని కూటమి నేతలు విమర్శిస్తున్నారు. పొత్తులు లేకుండానే ఒంటెత్తు పోకడలతో కాంగ్రెస్ కూటమి భవిష్యత్తును కూడా ప్రమాదంలో నెట్టేసిందని పలువురు సీనియర్లు మండిపడుతున్నారు. ‘ఇది కాంగ్రెస్ ఓటమి. ఇండియా కూటమి ఓటమి కాదు’ అని జనతాదళ్ (యూనైటెడ్) నేత కేసీ త్యాగి పేర్కొనడం గమనార్హం. మరోవైపు కూటమిని నడిపించేందుకు ఆప్ లాంటి పార్టీలు తహతహలాడుతున్నాయి. మూడు రాష్ర్టాల్లో కాంగ్రెస్ ఓటమి అనంతరం ఆప్ నేత ఒకరు ‘ఉత్తర భారతదేశంలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ తమదే’ అని ట్వీట్ చేశారు. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగిన కాంగ్రెస్ ఈ నెల 6న ఇండియా కూటమి సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నది. అయితే ఈ సమావేశానికి కూటమి కో- ఆర్డినేషన్ కమిటీ మెంబర్ అభిషేక్ బెనర్జీ గైర్హాజరు కానున్నట్టు సమాచారం. మరోవైపు కూటమిపై కాంగ్రెస్ ఓటమి ఏమాత్రం ప్రభావం చూపదని ఎన్సీపీ సీనియర్ నేత శరద్పవార్ ధీమా వ్యక్తం చేశారు. అయితే కూటమి భవిష్యత్తు ఏమిటనేది రానున్న నాలుగు నెలల్లో తేలిపోనున్నది.
– ఎడిటోరియల్ డెస్క్