ఛీత్కరింపులు, చీదరింపులతో రోజురోజుకూ కునారిళ్లిపోతున్న వృద్ధ జీవులకు తెలంగాణ సర్కారు ఇస్తున్న ఆసరా పథకం విప్లవాత్మకమైన మార్పునే తెచ్చింది. దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే మరొకరికి ఆదర్శంగా నిలిచేలా ఆసరా పథకం రూపుమార్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ అపర జ్యోతిబాఫూలే అనిపించుకున్నారు. లక్షలాది మందికి ఆసరా పథకం ద్వారా నెలనెలా పింఛన్ పథకాన్ని అందజేస్తూ లబ్ధిదారులు తమ పెద్ద కొడుకుగా పిలుచుకునేలా పథకాన్ని అమలు చేస్తున్నారు. నేడు వికలాంగులైన లబ్ధిదారులకు రూ.3,016, ఇతరులకు రూ.2,016 చొప్పున పింఛన్ సొమ్ము నెలనెలా అందజేస్తూ వారి కళ్లల్లో ఆనందం తాండవించేలా చేస్తున్నారు. పైఉదాహరణ ఒక్కటి చాలు. నాడు పడిన వేదన, నేడు జీవన ఛేదన. అదొక్కటే కాదు.. అదే పింఛన్ సొమ్ము దవాఖానల ఖర్చుకూ, ఇతర ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపుతున్నది.
సోమరులను చేసేందుకే పాలకులు ఉచిత పథకాలు ప్రవేశపెడుతున్నారని సోషల్ మీడియాలో అదేపనిగా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. ఆసరా పథకం వల్ల మాత్రం ప్రజలకు అనేక లాభాలున్నాయి. గతంలో పల్లెల్లో విత్తనాలు చల్లిన నాటి నుంచి ధాన్యం ఇంటికి వచ్చే వరకూ ప్రతి ఒక్కరికీ పలు రకాలుగా వ్యవసాయ కూలీపనులు దొరికేవి. నేడు సాగునీటి రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చి, ఆధునిక వ్యవసాయ సాగు విధానంతో కూలీల అవసరం తగ్గిపోయింది. దీంతో కొంతమేరకు ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయి. గతంలో మాదిరిగా వ్యవసాయ పనులు అంతగా లేవు. అయితే పారిశ్రామిక ప్రగతి, భవన నిర్మాణ పనులు పెరిగి ఉపాధి అవకాశాలు మెండయ్యాయి. ఉన్న ఊరు నుంచి మరో ప్రాంతానికి వెళ్లలేని నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధులు, వితంతు మహిళలు, వికలాంగులు, వృత్తిదారుల కండ్లల్లో కేసీఆర్ సర్కార్ ఇస్తున్న ఆసరా పథకం ఆనందం నింపుతున్నది.
ఒకరు.. ఇద్దరూ కాదు.. ఊరూరా వందలాది మంది ఆసరా పింఛన్ పథకంలో లబ్ధిదారులుగా ఉన్నారు. వారందరికీ నెలనెలా ఠంచన్గా ప్రభుత్వ ఉద్యోగులకు నెలవారీ వేతనాలు వచ్చే విధంగా ఆసరా పింఛన్ సొమ్మును ప్రభుత్వం అందజేస్తున్నది. ఆ పింఛన్ సొమ్ము కోసం పేద కుటుంబాలు ఆర్తిగా ఎదురుచూస్తూ తమ అవసరాలను తీర్చుకుంటున్నాయి.
2014 ఎన్నికల సమయంలో ఉద్యమ నేతగా కేసీఆర్ అనేక హామీలు ఇచ్చారు. వాటిలో భాగంగా ఆసరా పింఛన్ సొమ్మును పెంచుతానని భరోసా కల్పించారు. అన్న మేరకు నాడు 200గా ఉన్న పింఛన్ సొమ్మును రూ.1,000కి, రూ.500గా ఉన్న వికలాంగుల పింఛన్ను రూ.1,500కు పెంచుతూ విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. మళ్లీ 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆసరా పింఛన్ పెంపుపై ఎన్నికల హామీ ఇచ్చారు. పెరిగిన ధరలకు అనుగుణంగా పింఛన్ సొమ్మును పెంచుతానని పెద్ద మనసుతో ప్రకటించారు.
ఇచ్చిన మాటను తప్పకుండా రూ.1,000గా ఉన్న పింఛన్ సొమ్మును రూ.2,016గా, రూ.1,500గా ఉన్న వికలాంగుల పింఛన్ను రూ.3,016కు పెంచుతూ సామాజిక విప్లవాన్నే సృష్టించారు. దీంతో మునుపెన్నడూ లేనంతగా, మరే రాష్ట్రంలోనే ఇవ్వనంతగా, ప్రపంచంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో సామాజిక పింఛన్ సొమ్ము ఇవ్వలేనంతగా కేసీఆర్ ప్రభుత్వం ఇస్తుండటం విశేషం.
సామాజికంగా పేద కుటుంబాలకు ఈ ఆసరా పింఛన్ సొమ్ముతో న్యాయం జరుగుతున్నది. అయితే మరింత మందికి లబ్ధి చేకూరేలా మరో అసాధారణమైన నిర్ణయాన్ని తీసుకున్న సీఎం కేసీఆర్ అపర జ్యోతిబా ఫూలే అని నిరూపించుకున్నారు. 31-03-2019 వరకు 65 ఏండ్లుగా ఉన్న వృద్ధాప్య పింఛన్ అర్హత వయసును 57 ఏండ్లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు సుమారు 7 లక్షల మందికి లబ్ధి చేకూరుతున్నది. దీంతో రాష్ట్రంలో ఆసరా పింఛన్ లబ్ధిదారుల సంఖ్య సుమారు 47 లక్షల మందికి చేరింది.
వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, బోధకాలు వ్యాధిగ్రస్థులు, డయాలసిస్ పేషెంట్లు, నేత, గీత కార్మికులు, ఎయిడ్స్ బాధితులకు ఆసరా పింఛన్ పథకం వర్తిస్తున్నది. దరఖాస్తుదారుల పేరున మెట్టభూమి 7.5 ఎకరాలు, మాగాణి 3 ఎకరాలకు మించి ఉండరాదనే నిబంధన ఉన్నది. కుటుంబ వార్షికాదాయం గ్రామాల్లో రూ.1.5 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షలుగా ఉన్నది.
ఇది మామూలు విషయమేమీ కాదు.. గతంలో పైన చెప్పిన అవసరాలన్నీ తీరక అసహాయులంతా సతమతమయ్యేవారు. వాటిని వాయిదా వేసుకొనేవారు. కన్నీళ్లతో దిగమింగుకునే వారు. పంటి బిగువున బాధలను భరించేవారు. దిక్కులేని బతుకులాయెనే అని ఆవేదనతో కుమిలిపోయేవారు.. కునారిళ్లేవారు. కలో గంజో తాగి కడుపు నింపుకొనే వారు. పచ్చడి మెతుకులతో ఆకలి తీర్చుకొనేవారు. ఇలాంటి వారిందరికీ సీఎం కేసీఆర్ పెద్ద కొడుకై ఆసరా అయ్యిండు. వారికి నెలనెలా పింఛన్ ఇస్తూ ఆదుకుంటు న్నడు.
(వ్యాసకర్త : సీనియర్ జర్నలిస్టు)
-బొమ్మకంటి బిక్షమయ్యగౌడ్
97053 47798