పల్లె అంటేనే ప్రకృతికి నిలయం. ఆ ప్రకృతికి, సహజత్వానికి మరింత శోభనిచ్చేలా పల్లెల్లో ప్రకృతి వనాల/గ్రామీణ సహజ వనాల (పార్కులు) నిర్మాణం జరిగితే అది పల్లె ప్రకృతి వనం. పట్టణాలు, నగరాలకే పరిమితమైన పార్కులు పల్లెల్లోనూ నేడు కనువిందు చేస్తున్నాయి. ఈ వనాల్లో ఆహ్లాదాన్ని నింపేలా, సేద తీరేలా అన్ని రకాల పూలు, పండ్ల మొక్కలు, నీడనిచ్చే వృక్షాలు, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించే వృక్షాలు పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
హరితహారంలో భాగంగా గ్రామాల్లో ప్రకృతి వనాలను ఏర్పాటు చేశా రు, కొన్ని చేస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ కనీసం ఒక ఎకరం విస్తీర్ణానికి తగ్గకుండా ప్రకృతి వనాలను తీర్చిదిద్దారు. గ్రామాల్లో వేర్వేరు ప్రదేశాల్లో స్థలం అందుబాటులో ఉం టే చిన్న చిన్న వనాలను కూడా ఏర్పాటు చేశా రు. ప్రతి గ్రామంలోనూ కనీసం ఒక్క టైనా ప్రకృతి వనం ఏర్పాటు చేయడానికి వీలుగా భూమిని అభివృద్ధి చేయాలని ప్రభు త్వ ఆదేశాల ప్రకారం గ్రామ పంచాయతీలలో పల్లె ప్రకృతి వనాలు ఏర్పడ్డాయి. పల్లె ప్రకృతి వనం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మంచి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి ఒక ప్రకృతి వనం ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో 19,472 గ్రామాల్లో గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో వనాలను ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణకు హరితహారంలో భాగంగా రూ.116 కోట్ల వ్యయంతో 19,472 వనాలు నిర్మించబడ్డాయి.
గ్రామీణాభివృద్ధి శాఖ, అటవీ శాఖల సమన్వయానికి యాదాద్రి మాడల్ ప్లాంటేషన్ అభివృద్ధి మంచి ఉదాహరణ అని నీతి ఆయోగ్ తన నివేదికలో పేర్కొన్నది. యాదాద్రి మాడల్ ప్లాంటేషన్, గ్రామ పంచాయతీలలో పల్లె ప్రకృతి వనాలను అభివృద్ధి చేయడంలో తెలంగాణ చేపట్టిన హరిత కార్యక్రమాలను నీతి ఆయోగ్ ఉటంకించింది. సామాజిక రంగంలో ఉత్తమ పద్ధతులు: ఒక సంగ్రహం – 2023’ (Best Practices in sector: A Compendium- 2023) అనే నివేదికలో యాదాద్రి మాడల్ ప్లాంటేషన్, గ్రామ పంచాయతీలలో పల్లె ప్రకృతి వనాలు ప్రభావవంతమైనవి, వినూత్నమైన ఉత్తమ పద్ధతులుగా ప్రశంసించారు. మియావాకీ ప్లాంటేషన్లో (తక్కువ స్థలంలోనే ఎక్కువ మొక్కలను అడవుల్లా పెంచే జపాన్ పద్ధతి) యాదాద్రి మాడల్ ప్లాంటేషన్ను గ్రామీణాభివృద్ధి శాఖ, అటవీ శాఖలు సంయుక్తంగా అభివృద్ధి చేయడం మంచి ఉదాహరణ అని నీతి ఆయోగ్ తన నివేదికలో పేర్కొన్నది. తెలంగాణ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం అయిన ‘తెలంగాణకు హరితహారం’ కింద, రాష్ట్రవ్యాప్తంగా 19,472 గ్రామ పంచాయతీ ఆవాసాలలో పల్లె ప్రకృతి వనాలను అభివృద్ధి చేయడానికి చొరవ తీసుకున్నారు. ఈ పల్లె ప్రకృతి వనాలు మియావాకీ ప్లాంటింగ్ మాడల్పై ఆధారపడి ఉన్నాయి. వీటిని రాష్ట్రంలో యాదాద్రి ప్లాంటేషన్ మాడల్ నుంచి స్వీకరించారు. స్థానికంగా లభించే వృక్ష జాతులతో మినీ అడవులు రూపొందు తున్నాయి.
దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందిన యాదాద్రి ప్లాంటేషన్ మాడల్లో ఒక ఎకరం విస్తీర్ణంలో 4000 మొక్కలు నాటారు. మొక్క ల మధ్య ఒక మీటరు దూరం ఉంటుంది. గ్రామంలోని డంపింగ్ యార్డులో మట్టిని దున్నించి వర్మీ కంపోస్టును వాడారు. మొక్క లు నాటడానికి ముందు వేప, గ్లిరిసిడియా, పొంగమియా ఆకులను కుళ్ళిపోవడానికి మట్టిలో కలుపుతారు. పొదలు, ఔషధ మూలికలు, పండ్ల మొక్కలతో సహా స్థానిక వృక్ష జాతులను తోట ల పెంపకానికి ఉపయోగిస్తారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద అటవీ శాఖ సాంకేతిక సహాయంతో ఈ కార్యక్రమం అమలవుతున్నది. కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడం వల్ల, నేడు పల్లె ప్రకృతి వనాలు దట్టమైన మొక్కలతో అనేక పక్షులు, కీటకాలు, సీతాకోక చిలుకలు మొదలైన వాటికి నిలయంగా మారాయి. స్థానిక వృక్షజాలం, జంతుజాలపు జన్యు సమూహాన్ని మెరుగుపరచడం ద్వారా ఒక ఏడాది వ్యవధిలో ఒక పెద్ద పర్యావరణ వ్యవస్థ సృష్టించబడిందని నీతి ఆయోగ్ నివేదిక పేర్కొన్నది.
యాదాద్రి నమూనా ఆధారంగా తెలంగాణ వ్యాప్తంగా 19,472 గ్రామ పంచాయతీలు, ఆవాసాలలో అభివృద్ధి చేయబడిన గ్రామ ప్రకృతి పార్కులను మొదటి రెండేండ్లు ఎన్ఆర్ఈజీఎస్ కింద నిర్వహించగా, తర్వాత నుంచి వీటి నిర్వహణ బాధ్యతను గ్రామ పంచాయతీలకు అప్పగించారు. రాష్ట్రంలోని కొన్ని గ్రామాల్లో పచ్చని చెట్లు, మొక్కలతోపాటు ఎరువులు వంటివి వాడకుండా కూరగాయలు, ఆకుకూరలు కూడా పండిస్తున్నారు.
సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి ప్రతి శుక్రవారం మల్టీపర్పస్ వర్కర్లు, గ్రామ పంచాయితీ సిబ్బందితో మొక్కలకు నీళ్లు పట్టించారు. రాష్ట్ర వ్యాప్తంగా పల్లె ప్రకృతి వనాలు చాలా వరకు పచ్చగా ఉన్నా.. నిర్వహణ లోపం, నిర్లక్ష్యం వల్ల కొన్ని ప్రకృతి వనాల మొక్కలు ఎండిపోతున్నాయి. వాటిని కాపాడుకోవలసిన బాధ్యత గ్రామస్థులదే. అందరి సహకారంతోనే ప్రకృతి వనాలు మరింత పచ్చగా ఉంటూ గ్రామ పర్యావరణ సమతుల్యంలో కీలక పాత్ర
పోషిస్తాయి.
-డాక్టర్ కందగట్ల శ్రవణ్ కుమార్
86393 74879