ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఆయన పక్కలో బల్లెంలా మారారు. అప్పటి నుంచి అవకాశం కోసం కాచుకొని కూర్చున్న మోదీ ప్రభుత్వం ఆయన్ను అరెస్టు చేసే దాకా నిద్రపోలేదు. ఇటీవల ఓ కేసులో ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్టు కాగా.. తాజాగా మరో సీఎం కేజ్రీవాల్ అరెస్టు కావడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అవినీతికి వ్యతిరేకంగా అన్నాహజారే నాయకత్వంలో జరిగిన పోరాటంలో చురుకైన పాత్ర పోషించిన కేజ్రీవాల్.. చివరికి అవినీతి కేసులోనే అరెస్టు కావటం శోచనీయం. ఇది నిజంగా కేజ్రీవాల్ స్వయంకృత అపరాధమా? లేక బీజేపీ కుట్రలో భాగమా? అనేది భవిష్యత్తులోనే తేలుతుంది.
కేజ్రీవాల్ స్థాపించిన ఆప్ ప్రస్థానం మొదటి నుంచీ సంచలనమే. ఢిల్లీలో రికార్డు స్థాయిలో మూడుసార్లు గెలిచి బీజేపీ, కాంగ్రెస్లకు కొరకరాని కొయ్యగా తయారైన ఆ పార్టీ క్రమంగా ఇతర రాష్ర్టాలకు వ్యాపించి తన బలాన్ని చాటుకుంటున్నది. 2013లో ఢిల్లీలో తొలిసారి అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ సర్కార్ అప్పటి యూపీఏ ప్రభుత్వం వల్ల ఇబ్బందులు పడింది. ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు చక్కబడకపోగా కష్టాలు ఇంకా ఎక్కువయ్యాయి. కేజ్రీవాల్ సర్కార్ నిర్ణయాలను ఏదో ఒక వంకతో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్లు అడ్డుకోవడం పరిపాటిగా మారింది. ప్రాంతీయ పార్టీగా మొదలైన ఆప్ జాతీయ పార్టీగా రూపాంతరం చెంది బీజేపీ, కాంగ్రెస్లకు ప్రత్యామ్నాయంగా మారుతుండటంతోనే కమలం సర్కార్ ఇలా చేస్తున్నదనే వాదనలు ఉన్నాయి.
మొదటి నుంచి విపక్ష నేతలను అరెస్టులతో భయపెడుతున్న బీజేపీ.. పార్లమెంట్ ఎన్నికల వేళ కేజ్రీవాల్పైనా అదే అస్ర్తాన్ని ప్రయోగించింది. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చూస్తున్న ఆ పార్టీ కాంగ్రెస్ ఖాతాలను ఇప్పటికే స్తంభింపజేసింది. ఢిల్లీతో పాటు హర్యానా, పంజాబ్, గుజరాత్, గోవా తదితర రాష్ర్టాల్లో కీలకపాత్ర పోషించనున్న కేజ్రీవాల్ను అరెస్టు చేయడం ద్వారా ఇండియా కూటమిని దెబ్బకొట్టాలనేది బీజేపీ వ్యూహం. దాని వల్ల విపక్షాల విజయావకాశాలు దెబ్బతింటాయి.
దర్యాప్తు సంస్థలను భ్రష్టుపట్టించిన బీజేపీ సర్కార్.. తన రాజకీయ ప్రయోజనాల కోసం వాటిని విపరీతంగా వాడుకుంటున్నది. అందుకు తాజా ఉదాహరణ లిక్కర్ కేసు. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, ఆప్ ఎంపీ సంజయ్సింగ్ జైల్లో మగ్గుతున్నారు. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. కస్టడీ పేరిట కాలయాపన చేస్తున్న ఈడీ.. కవిత బంధువులు, మిత్రులను విచారించినప్పటికీ ఎటువంటి ఆధారాలను సేకరించలేకపోయింది. ఇంతవరకు వారి వద్ద నుంచి నయాపైసా కూడా రాబట్టలేదు. ఈ కేసు నిందితుల్లో ఒకరైన ప్రముఖ వ్యాపారవేత్తను ఈడీ అధికారులు బెదిరించి అప్రూవర్గా మార్చినట్టు ఆరోపణలు వస్తున్నాయి. అతను అప్రూవర్గా మారేముందు ఎన్నికల బాండ్ల ద్వారా బీజేపికి భారీగా నిధులను సమకూర్చారు. ఈ విషయం ఎస్బీఐ వెల్లడించిన ఎలక్టోరల్ బాండ్ల వివరాల ద్వారా స్పష్టమైంది. అందుకే ఆయనకు బెయిల్ లభించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ బెయిల్ అప్లికేషన్పై ఈడీ అభ్యంతరం కూడా చెప్పకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. అందుకే ఈ వ్యవహారం క్విడ్ ప్రోకో కిందికే వస్తుందని విపక్షాలు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జరిగిన ఈ అరెస్టుల వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయనే అనుమానాలు బలపడుతున్నాయి.
-డాక్టర్ కోలాహలం రామ్కిశోర్
98493 28496