తెలంగాణ రాష్ట్రం యావత్తూ ఎన్నికల హడావుడిలో మునిగిపోవడాన్ని అదనుగా చూసుకుని ఏపీ ప్రభుత్వం సాయుధపటాలంతో వచ్చి నవంబర్ 29న అర్ధరాత్రి వేళ నాగార్జునసాగర్ డ్యామ్ ఆక్రమణకు పూనుకున్నది. అక్కడి సీసీ కెమెరాలను ధ్వంసం చేసి ముళ్లకంచెను వేసింది. అంతేగాకుండా 5,7 గేట్ల వద్ద ఉన్న హెడ్ రెగ్యులేటర్లను తెరిచి దౌర్జన్యపూరితంగా దాదాపు 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసుకుంటున్నది.
సత్వరమే అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం విషయాన్ని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) దృష్టికి తీసుకెళ్లడం, అటు తరువాత కేంద్ర హోంశాఖ, జలవనరుల శాఖ రంగంలోకి దిగడం, యథాతథస్థితిని కొనసాగించాలని ఆదేశించడం తెలిసిందే. అయితే ఇక్కడ అసలు విషయం ఏమిటంటే ఏపీ ఇంత అప్రజాస్వామికంగా ఎందుకు వ్యవహరించింది? ఎవరు దీనంతటికీ ప్రధాన కారకులు? ఏపీ చర్యల పర్యవసానం ఎలా ఉండబోతున్నది? ఎవరికి నష్టం వాటిల్లనుంది? అనేవి ఇప్పుడు చర్చించుకోవాల్సిన అంశాలు. లోతుగా విశ్లేషించుకోవాల్సిన విషయాలు.
ఆంధ్రపదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని సెక్షన్ 85లోని సబ్సెక్షన్ (1) ప్రకారం ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ, నియంత్రణ, నిర్వహణకు నాటి కేంద్ర ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును ఏర్పాటు చేసింది. చట్టంలోని సబ్-సెక్షన్ 85(8) ప్రకారం బోర్డు విధివిధానాల ప్రకారం గతంలో జరిగిన ఒప్పందాలు, ట్రిబ్యునళ్లు కేటాయించిన అవార్డుల మేరకు ఇరు రాష్ర్టాలు నీటిని వినియోగించుకోవాల్సి ఉన్నది. గతంలో అలాంటివేవీ లేకపోవడం నేపథ్యంలో ఉమ్మడి ప్రాజెక్టుల నీటి వినియోగం అంశంపై కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో కేవలం ఏడాది కాల పరిమితితో ఇరురాష్ర్టాలు తాత్కాలిక ఒప్పందాన్ని చేసుకున్నాయి. ఏపీ 512 టీఎంసీలు, తెలంగాణకు 298.98 టీఎంసీలు వినియోగించుకోవాలని అంగీకారానికి వచ్చాయి. ఈ ఒప్పందం అమలును రెండు రాష్ర్టాల ఈఎన్సీలు, కేఆర్ఎంబీ మెంబర్సెక్రటరీతో ఏర్పాటైన త్రిసభ్య కమిటీ పర్యవేక్షిస్తుంది. ప్రాజెక్టులవారీగా నీటి అవసరాలకు సంబంధించి ఇరురాష్ర్టాలు ప్రతిపాదనలు పంపించాలి. అటు తరువాత ఆయా ప్రాజెక్టుల్లో నీటి లభ్యత ఆధారంగా త్రిసభ్య కమిటీ నీటి వినియోగానికి అమోదం తెలుపుతుంది. ఆ మేరకు ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేస్తారు. రాష్ర్టాల పునర్విభజన నాటి నుంచి ఇదే పద్ధతి కొనసాగుతున్నది.
పునర్విభజన చట్టం ప్రకారం శ్రీశైలం డ్యామ్ ఏపీ ఆధీనంలో, నాగార్జునసాగర్ డ్యామ్ తెలంగాణ పరిధిలో ఉన్నాయి. కానీ అందుకు విరుద్ధంగా, చట్టాన్ని, చేసుకున్న ఒప్పందాలను ఏపీ బేఖాతరు చేసింది. బరితెగింపుగా వచ్చి సాగర్ డ్యామ్ను ఆక్రమించింది. ఎందుకు? తెలంగాణ ఏపీ కోరినన్ని నీళ్లు ఏమైనా ఇవ్వలేదా? అంటే, అలాంటిదేమీ లేదు. వాస్తవంగా నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్ల నుంచి 2023-24 నీటి సంవత్సరానికి (జూన్ 1, 2023-మే 31, 2024) నీటి వినియోగానికి సంబంధించి అక్టోబర్ 6న నిర్వహించిన త్రిసభ్య కమిటీ సమావేశంలోనే పలు నిర్ణయాలు చేశారు. అందులోభాగంగా నాగార్జునసాగర్ జలాశయం నుంచి 15 టీఎంసీల నీటిని ఏపీకి మూడు విడతలుగా ఇవ్వాల్సి ఉంది. అందులో భాగంగా అక్టోబర్లో ఒక విడత 5 టీఎంసీలను విడుదల చేశారు. మిగతా 10 టీఎంసీలను వచ్చే జనవరి, ఏప్రిల్ నెలల్లో 5 టీఎంసీల చొప్పున విడుదల చేయాల్సి ఉంది. నవంబర్, డిసెంబర్ నెలలకు సంబంధించి నీటి విడుదలకు ఎలాంటి ఇండెంట్ను ఏపీ పెట్టలేదు. విడుదల చేయాలనే నిర్ణయాలు కూడా లేవు. అయినప్పటికీ ఏపీ జులుం ప్రదర్శిస్తూ రాత్రికి రాత్రికి వచ్చి డ్యామ్ను ఆక్రమించి, కుడివైపు గేట్లను తెరిచి దౌర్జన్యంగా నీటి విడుదలను చేపట్టడం గమనార్హం.
ఏపీ ప్రభుత్వం దౌర్జన్యపూరిత వైఖరిపై లోతుగా చర్చించుకోవాల్సిన అవసరమున్నది. ఎందుకంటే ఏపీ నీటిని తరలించుకుపోవాలంటే డ్యామ్ గేట్లనే తెరవాల్సిన పనిలేదు. కుడివైపు పవర్హౌజ్ ద్వారా కూడా తీసుకుపోయే అవకాశముంది. గత పదేండ్లుగా అనేకసార్లు అక్రమంగా నీటిని మళ్లిస్తూనే ఉన్నది. అయినప్పటికీ ఇప్పుడు అదేమీ చేయకుండా ఏకంగా సాయుధబలాలతో వచ్చి, బరితెగించి డ్యామ్ను ఆక్రమించి, నీళ్లను తీసుకుపోవడమే తీవ్రంగా పరిగణించాల్సిన విషయం.
దీనికి కారణాలు కూడా సుస్పష్టం. ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం కాకుండా, అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం 1956 సెక్షన్ 3 ప్రకారం కొత్త ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసైనా, లేదంటే ప్రస్తుత బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్కే న్యాయమైన వాటాల పంపిణీ కోసం కావాల్సిన అధికారాలను కల్పించాలని రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ నాటి నుంచి తెలంగాణ డిమాండ్ చేస్తున్నది. పదేండ్లుగా తెలంగాణ సర్కారు, సీఎం కేసీఆర్ చేసిన అలుపెరగని పోరాటంతో కేంద్రం ఎట్టకేలకు ఇటీవలనే దిగొచ్చింది. న్యాయమైన వాటాల పంపిణీ చేపట్టాలని ప్రస్తుత బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్కు నూతన మార్గదర్శకాలను జారీ చేయించడంలో తెలంగాణ విజయవంతమైంది. నాటి నుంచి ఏపీ సర్కారు జీర్ణించుకోలేకపోతున్నది. కేంద్రం జారీచేసిన ఆదేశాలను నిలిపేయాలని కోరుతూ సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించింది. విచారణను వాయిదా వేయాలని బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్లోనూ వాదనలు వినిపించింది.
అయినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. అంతేకాదు, తెలంగాణ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి కీలకమైన అనుమతులను కూడా సాధించింది. ఎత్తిపోతలను కూడా ఇటీవలనే ప్రారంభించింది. అదికూడా కంటగింపుగా మారింది. సాగర్ డెల్టా రైతాంగం, సీమ కూడా ఇదే విషయమై ఏపీ సర్కారుపై గుడ్లురుముతున్నది. ఈ నేపథ్యంలోనే వారిని శాంతపరచడానికంటూ, ఆరోపణలను తప్పించుకునేందుకు ఏపీ ఇంతటి దౌర్జన్యానికి పూనుకున్నదని అర్థమవుతున్నది. అదీగాక ఏపీ ఆది నుంచీ కృష్ణా జలాల విషయాల్లో తెలంగాణతో కయ్యానికి కాలు దువ్వుతున్నది. తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులకు అడుగడుగునా అడ్డం పడుతూ వస్తున్నది. మరోవైపు కృష్ణాజలాలను దౌర్జన్యపూరితంగా బేసిన్ అవతలికి అక్రమంగా తరలిస్తూనే ఉన్నది. ఇప్పుడు కూడా అదే రీతిన వ్యవహరించింది. అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. కాకపోతే అప్రజాస్వామికంగా తెగబడటమే అభ్యంతరకరం.
ఇదిలా ఉంటే ఏపీ దుందుడుకుతనానికి, ఇరు రాష్ర్టాల మధ్య కృష్ణా జలాల వివాదాల పాపానికి పూర్తిగా కేంద్రసర్కారుదే బాధ్యత. కృష్ణా జలాలను న్యాయపరంగా పంపిణీ చేసేందుకు ట్రిబ్యునల్కు ఏర్పాటు చేయకుండా, ఆ మేరకు కావాల్సిన అధికారాలను కల్పించడకుండా న్యాయసలహాలు తీసుకోవాలనే సాకుతో పదేండ్లుగా కేంద్రంలోని మోదీ సర్కారు నిర్లక్ష్యం చేసింది. ఏడాది కాలపరిమితితో ఏర్పాటు చేసిన తాత్కాలిక ఒప్పందాన్ని 2015 నుంచి కొనసాగిస్తూ వస్తున్నది. గతేడాది ఆ తాత్కాలిక ఒప్పందానికి ఇక ఎంతమాత్రం ఒప్పుకునేది లేదని తెలంగాణ తేల్చిచెప్పింది. ట్రిబ్యునల్ అవార్డు వచ్చేంతవరకూ 50:50 నిష్పత్తిలోనే కృష్ణా జలాలను వినియోగించుకుంటామని కుండబద్దలు కొట్టి చెప్పింది. ఒకవైపు ఇరు రాష్ర్టాల మధ్య జలాల పంపిణీ పూర్తిగా చేపట్టకుండానే, మరోవైపు రివర్ బోర్డుల అధికార పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం గెజిట్ విడుదల చేసింది. ప్రాజెక్టులను రివర్ బోర్డులకు అప్పగించాలని ఆదేశించింది. ఇప్పటికి రెండేండ్లు గడిచినా ప్రాజెక్టులకు సంబంధించిన ఆపరేషన్ ప్రొటోకాల్నూ రూపొందించలేదు. మధ్యలో ఆ ప్రయత్నం చేసినా అది కొసెల్లలేదు. తప్పులతడకగా, అవార్డులకు భిన్నంగా ఉందని, అంగీకరించేది లేదని తెలంగాణ స్పష్టం చేసింది.
అంతేకాదు ఏపీ అక్రమంగా కృష్ణా జలాలను బేసిన్ అవతలికి తరలించుకుపోతున్నదని అనేక మార్లు ఫిర్యాదులు చేసినా, లెక్కకు మించి లేఖలు రాసినా అటు కేంద్రం, ఇటు కేఆర్ఎంబీ తీసుకున్న చర్యలు మాత్రం శూన్యం. వాటన్నింటి చర్యల ఫలితంగానే ఏపీ తాజా బరితెగింపు. ఇదిలా ఉంటే ఏపీ చర్యల ఫలితంగా తెలంగాణలో ప్రజానీకం తీవ్రంగా ప్రభావితం కానున్నది. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో కృష్ణాలో నీళ్లు రాలేదు. ఇప్పటికే డ్యామ్లో నిల్వలు కూడా అడుగంటుతున్నాయి. మరో 6 నెలల వరకు నీటి అవసరాలు తీర్చుకోవాల్సి ఉన్నది. ఏపీ అక్రమంగా నీటిని మళ్లించుకుపోతే డ్యామ్లో నీటినిల్వలు అడుగంటి హైదరాబాద్ నీటి సరఫరా వ్యవస్థ దెబ్బతింటుంది. ఫలితంగా కృష్ణా బేసిన్లో ఉన్న రెండు కోట్ల మందికి పైగా జనాభా తాగునీటి అవసరాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని కేంద్రం వెంటనే జోక్యం చేసుకుని డ్యామ్ నిర్వహణను ఏపీ నుంచి తప్పించి వెంటనే తెలంగాణకు అప్పగించాలి.
మ్యాకం రవికుమార్
91827 77621