రాష్ర్టాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. ముఖ్యంగా మహిళా శిశు సంక్షేమానికి పెద్ద పీట వేసింది. కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లతోపాటు, ప్రభుత్వ దవాఖానల్లో పలు సదుపాయాల కారణంగా సురక్షిత సహజ ప్రసవాలు గణనీయంగా పెరిగాయి. మహిళల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం మరో గొప్ప పథకాన్ని తీసుకొస్తున్నది. మహిళల ఆరోగ్యానికి ఇది మరొక వరం అవుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు.
రాష్ట్రంలో మహిళల ఆరోగ్య రక్షణకు ఇప్పటికే పలు చర్యలు, పథకాలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం మరో గొప్ప కార్యక్రమం ‘ఆరోగ్య మహిళ’ను ప్రపంచ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రారంభించనున్నది. గ్రామాలలో నివసించే మహిళలు, నిరుపేద కార్మిక మహిళలు తమ ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎవరికీ చెప్పుకోలేక అనారోగ్యంతోనే బాధపడుతూ ఉంటారు. ఇటువంటి అనేక మందికి ఉద్దేశించినదే ఆరోగ్య మహిళ కార్యక్రమం. తెలంగాణ రాష్ట్రంలోని 100 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మార్చి 8వ తేదీన ఇది ప్రారంభం కానున్నది. ప్రతీ మంగళవారం ప్రాథమిక వైద్య కేంద్రాల్లో మహిళలకు ప్రత్యేకంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అక్కడికక్కడే తగు మందులు ఇవ్వడంతోపాటు అవసరమైన వారిని రెఫరల్ దవాఖానలకు పంపిస్తారు.
57 ఆరోగ్య పరీక్షల నిర్వహణ: ‘ఆరోగ్య మహిళ’లో భాగంగా రాష్ట్రంలోని 33 జిల్లాల్లో అన్ని వయస్సుల మహిళలకు 57 రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. వీటిని ప్రధానంగా ఎనిమిది ప్యాకేజీలుగా విభజించారు. వీటిలో డయాగ్నస్టిక్స్, క్యాన్సర్ స్క్రీనింగ్, సరైన ఆహారం లేకుం డా వచ్చే సమస్యలు, మూత్ర సంబంధిత సమస్యలు, మెనోపాజ్, కుటుంబ నియంత్రణ, సంతానలేమి, రుతుక్రమం సమస్యలు, సుఖవ్యాధులు, తక్కువ బరువు వంటి పలు రకాల రుగ్మతలపై ఆరోగ్య పరీక్షలను జరుపుతారు. దీని కోసం 20 పాథలాజికల్ ల్యాబ్లను రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. పైన పేర్కొన్న వాటితోపాటు బీపీ, షుగర్, అనీమియా పరీక్షలను అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహిస్తారు. ఈ పరీక్షల రిపోర్టులను 24 గంటలలోపే ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
మహిళలలో క్యాన్సర్: మహిళలలో 20 శాతం మందికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని పలు సర్వేలలో తేలింది. క్యాన్సర్ను ముందుగానే గుర్తించటం వల్ల చికిత్సను అందించి ప్రాణాలు కాపాడవచ్చు. ఈ నేపథ్యంలోనే, ‘ఆరోగ్య మహిళ’ కింద రాష్ట్రంలోని మహిళలలో క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు పెద్ద ఎత్తున చేపడుతున్నారు. మన దేశంలో గర్భాశయ ముఖ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ మహిళలలో ఎక్కువగా ఉంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం తెలంగాణలో సగటున 3.3 శాతం మంది గర్భాశయ ముఖ క్యాన్సర్, 0.3 శాతం మంది రొమ్ము క్యాన్సర్, 2.5 శాతం మంది నోటి క్యాన్సర్ పరీక్షలు చేయించుకుంటున్నారు. ‘ఆరోగ్య మహిళ’ ద్వారా ఈ పరిస్థితిలో మార్పు రానున్నది. పరీక్షలు జరుపుకొన్న మహిళల సంఖ్య గణనీయంగా పెరుగనున్నది. ఆరోగ్య మహిళ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానలలో 30 ఏండ్ల పైబడిన మహిళలకు రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేపడుతారు. జిల్లా కేంద్రాలు, ప్రాంతీయ దవాఖానల్లో మామోగ్రామ్, కాల్పోస్కొపీ, క్రియోథెరపి, బయాప్సీ, పాప్స్మియర్ పరీక్షలను నిర్వహిస్తారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని నిమ్స్, ఎంఎన్జే క్యాన్సర్ దవాఖానల్లో మహిళలకు క్యాన్సర్ చికిత్స అందిస్తారు.
దేశంలో 17 శాతం మంది మహిళలకు అయోడిన్ లోపం, 37 శాతం మందికి ఫోలిక్ ఆసిడ్ లోపం, 54 శాతం మందికి ఐరన్ లోపం, 53 శాతం మందికి బీ-12 లోపం, 19 శాతం మందికి ఏ-విటమిన్, 61 శాతం మందికి డీ-విటమిన్ లోపం ఉన్నట్టు పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని మహిళలకు అయోడిన్ లోపం (థైరాయిడ్)తోపాటు ఇతర వ్యయభరిత పరీక్షలైన విటమిన్ డీ, బీ-12 తదితర పరీక్షలను నిర్వహిస్తారు. చికిత్స అవసరమున్న వారిని రెఫరల్ దవాఖానలకు పంపిస్తారు.
దేశంలో 50 శాతం మంది మహిళలు మూత్రాశయ సంబంధిత వ్యాధులతో సతమతమవుతున్నారు. దాదాపు 30 శాతం మంది మహిళలు ముఖ్యంగా 15 నుంచి 25 ఏండ్ల వయసున్న వారు పెల్విక్ ఇన్ఫ్లమేటరీ సమస్యల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘ఆరోగ్య మహిళ’ కింద రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానలలో ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తారు. మెనోపాజ్, బహిష్టు, కుటుంబ నియంత్రణ, సంతానలేమి తదితర అంశాలపై పరీక్షలతోపాటు కౌన్సెలింగ్ చేపడుతారు. అవసరం ఉన్నవారిని అల్ట్రాసౌండ్ పరీక్షలకు జిల్లా కేంద్రాలకు రెఫర్ చేస్తారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రజాప్రతినిధులను అందరినీ భాగస్వాములను చేస్తున్నారు. ‘ఆరోగ్య మహిళ’ హెల్ప్డెస్కులను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఏ.ఎన్.ఎం, ఆశా వర్కర్లతో పాటు పేషెంట్ కేర్ కార్యకర్తలను నియమిస్తున్నారు. ఈ సదుపాయాన్ని మహిళలు అందరూ వినియోగించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
(వ్యాసకర్త: జాయింట్ డైరెక్టర్, రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ)
కన్నెకంటి వెంకటరమణ