ప్రభాకర్రెడ్డి దుబ్బాక నియోజకవర్గ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారంలో ఉండగా ఆయనపై కత్తితో ఒక దుండగుడు తీవ్రంగా గాయపరిచిండు. ఆయన ప్రాణాపాయ స్థితిలో యశోదాలో చికిత్స పొందుతున్నారు. ప్రజాస్వామ్యవాదులంతా ఈ ఘటనను ఖండిస్తున్నారు. విలువలు గల రాజకీయాలు కోరుకునే మేధావులంతా ఈ సంఘటన పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తపరుస్తున్నారు.
తెలంగాణలో ఎప్పుడూ ఎన్నికలు హింసాత్మకంగా జరగలేదు. బహుశా ఇదే మొదటిసారి. ఈ హింసాత్మక ఘటనను పరిశీలిస్తే.. కొన్ని స్వీయ ప్రయోజనాల కోసం పనిచేసే తెలంగాణ వ్యతిరేక శక్తుల ప్రేరేపణ దీనివెనుక ఉన్నట్టు తెలుస్తున్నది. తెలంగాణవాదాన్ని వమ్ము చేయాలకునేవారి చిరకాల లక్ష్యపు ఆయుధానికి పదును పెట్టినట్టు, కుట్ర చేసినట్టు కనపడుతుంది. ఈ హత్యాయత్నంపై తెలంగాణ జాతిపిత, ప్రభుత్వాధినేత కేసీఆర్ సహజంగనే చాలా బాధతో స్పందించారు. ఎన్నికల్లో ప్రత్యర్థులను రాజకీయంగానే ఎదుర్కోవాలి గానీ, ఈ విధంగా హత్యారాజకీయాలు చేయటం సరికాదని గర్హించారు.
ఈ హింసాత్మక శక్తులకు, ఆ శక్తులను వెనుక నుంచి నడిపిస్తున్నవారిని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. మాకు తిక్కరేగితే తడాఖా చూపిస్తం అని గర్జించారు. అది తెలంగాణ ప్రజల పార్టీ క్యాడర్, దాడిలో తీవ్రంగా గాయపడ్డ నేత కుటుంబసభ్యుల్లో మనోధైర్యాన్ని నింపటం కోసం. అది అవసరం కూడా. ఈ దాడి వెనుక కాంగ్రెస్ ఉన్నదని తేలినందున, కాంగ్రెస్ను ప్రతిగా ఓటుతోనే తిప్పికొట్టాలన్నారు. రెచ్చగొట్టకుండా చాలా సంస్కారవంతంగా ప్రజలకు ముఖ్యమంత్రి ఇచ్చిన సందేశం అది. ఇందులో ఎవరికీ అభ్యంతరం ఉండవలసిన అవసరం లేదు. కానీ, రాధాకృష్ణ తన ఆంధ్రజ్యోతిలో ఈ దుర్ఘటనను గురించి రాసిన రాతలు రోత పుట్టిస్తున్నాయి.
ఆ విషాద, దురదృష్టకర సంఘటనపై ఏ మాత్రం విచారం వ్యక్తం చేయకపోగా కత్తిపోట్ల అంశం కూడా భావోద్వేగ ప్రసంగాలకు వేదికైందని అంటూ సంఘటన తీవ్రతను చాలా తేలికగా కొట్టిపారేసే విధంగా రాసిండు. ఒక సీనియర్ నేతపై హత్యాప్రయత్నం జరిగితే దానిపై పార్టీ అధినేత స్పందన నీకు భావోద్వేగ ప్రకటన అనిపించిందా బాధాకృష్ణ? కేసీఆర్ ప్రతిదాడులు చేయమని ఎక్కడా పిలుపునివ్వలేదే? ఈ దాడితో మనోైస్థెర్యం కోల్పోకుండా ప్రజలు తమ ఓటు ఆయుధంతోనే తిప్పికొట్టమన్నరు. అక్కడ భావోద్వేగాలు రెచ్చగొట్టడమెక్కడుంది? అసలు ఓట్ల కోసం భావోద్వేగాలు రెచ్చగొట్టవలసిన అవసరం తెలంగాణ తెచ్చిన పార్టీకి ఏమున్నది బాధాకృష్ణా?
భూమి పుత్రులది ఎప్పుడూ భావోద్వేగమే బాధాకృష్ణా. తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందని తెలంగాణలో ఒక సామెత. మా అమాయకత్వాన్ని, సహృదయతను, ఆసరాగా తీసుకొని తెలంగాణలో దశాబ్దాలుగా ఆస్తులు కూడబెట్టుకొని, వనరులను చెరబట్టి, హైదరాబాద్లో అక్కడక్కడ తెలంగాణలో ఆర్థిక వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించిన మీకు తెలంగాణ సాధన ఎప్పుడూ కంటగింపే. ఆ సాధించిన తెలంగాణను విచ్ఛిన్నం చేయటానికి బాలసారె నుంచే కుట్రలు ప్రారంభించింది మీరే కదా బాధకృష్ణా. అందుకు వేదికైంది అంధజ్యోతే కదా బాధాకృష్ణా?
మీ ఏజెంటు అయిన రేవంత్రెడ్డితో ఓటుకు నోటు కుట్ర చేయించలేదా? ఇప్పుడు ఆ మీ అనుంగు శిష్యుడికి పట్టం గట్టడానికి, పరోక్షంగా మీ ఏజెంటుతో పాలించటానికే కదా మీరు తెలంగాణను కించపరుస్తున్నరు. మీ ఏజెంటుకు, ఆయన ప్రస్తుతం అధినేతగా ఉన్న ఆ కాంగ్రెస్ పార్టీకి విపరీత పబ్లిసిటీ ఇస్తూ, ఆఖరికి ఆ పార్టీకి చెందిన దుండగుడు బీఆర్ఎస్ నేతపై హత్యాప్రయత్నం చేస్తే కూడా అంధజ్యోతికి అదొక భావోద్వేగ అంశంగానే కనపడటం, అంతకంటే శోచనీయమైన విషయం ఏముంటది బాధాకృష్ణా? మీదైనా, మీ ఏజెంటుదైనా ఒక్కతీరు ఆలోచనే కదా?
2014లో తెలంగాణ సాధకుడికి తెలంగాణను తెలంగాణవాదులే పాలించమని ఇచ్చిన తీర్పు గురించి తెలియదా బాధాకృష్ణా? 2018లో తెలంగాణ సాధన తర్వాత రాష్ట్ర అభివృద్ధి, కాళేశ్వర నిర్మాణం, రైతుబంధు, పింఛన్లు, కల్యాణలక్ష్మీ వగైరా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు మెచ్చి ఇచ్చిన తీర్పు కాదా బాధాకృష్ణా. భావోద్వేగాలు రెచ్చగొట్టి ఎన్నికలు గెలవాల్సిన అవసరం ఎప్పుడూ లేదు, ఎప్పుడూ రాదు కూడా. అభివృద్ధ్ది, సంక్షేమం, సుపరిపాలనే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపునకు శ్రీరామరక్ష. కొంతకాలంగా మీ ఆంధజ్యోతి ఇటువంటి తప్పుడు విద్వేషరాతలు రాసి తెలంగాణలో కలసిమెలసి ఉంటున్న ప్రజలను రెచ్చగొడుతున్నది. మేం సహనశీలురం. పరుల పట్ల, పొరుగుల పట్ల సహజ ప్రేమతో ఉండేవాళ్లం. ఆ సుహృద్భావ వాతావరణాన్ని విషపురాతలతో కలుషితం చేయకు బాధాకృష్ణా. నీకేమాత్రం మానవత్వం, పాత్రికేయ విలువలుంటే ప్రభాకరరెడ్డి త్వరగా కోలుకోవాలని కోరుకో.
వేంకటయ్య బొబ్బిశెట్టి