కొందరు ఆచార్యులు బోధనలో, పరిశోధనలో, పరిపాలనలో తమ విశేష కృషితో తాము చేపట్టిన పదవులకే వన్నె తెస్తారు. విశ్వ విద్యాలయాల అసలు లక్ష్యాలను చిత్తశుద్ధితో సాధిస్తారు. అలాంటి వారిలో అగ్రగణ్యులు ఆచార్య తంగెడ నవనీతరావు. సాహసోపేత నిర్ణయాలతో ఉస్మానియా వర్సిటీని పరిశోధనల్లో పరుగులు పెట్టించిన కార్యదక్షుడు ఆయన.
తెలంగాణ గర్వించదగ్గ విశ్వవిద్యాలయానికి అంతర్జాతీయ ఖ్యాతి కల్పించిన ఆదర్శ విద్యావేత్త. ఆయన వ్యక్తిగతంగా, వృత్తిగతంగా జీవితాంతం ఉన్నత నైతిక విలువలు పాటించిన ఆయన మార్గం ఆచార్యులకు, పరిశోధకులకు అనుసరణీయం. ఓయూలోనే ఉన్నత విద్యాభ్యాసం చేసిన నవనీతరావు పరిశోధకుడిగా, అధ్యాపకుడిగా, పాలకుడిగా ఓయూతో విడదీయరాని అనుబంధాన్ని ఏర్పరుచకున్నారు. రెండు పర్యాయాలు (1985-88, 1988-91) ఓయూ ఉప కులపతిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన సాహసోపేతమైన నిర్ణయాలకు ఆద్యుడిగా నిలిచారు. విద్య, పరిశోధనా రంగాల్లో ఓయూ పరిధిని విస్తరించి తన తర్వాతి ఉప కులపతులకు ఆదర్శంగా నిలిచారు. ఓయూ భూముల పరిరక్షణ కోసం ప్రహరీ నిర్మించారు. ఓయూ అవసరాలకు తగినట్టు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అధిక సంఖ్యలో బోధన, బోధనేతర సిబ్బందిని నియమించారు. వీసీగా ముగ్గురు ముఖ్యమంత్రులతో చర్చలు జరిపి ఓయూకు కావాల్సిన నిధులను సమకూర్చారు. అనేక మంది పరిశోధకులకు మార్గదర్శకత్వం వహించి వారు ఉన్నత పదవుల్లో స్థిరపడేందుకు దోహదపడ్డారు. ఆయన కృషి వల్లే ఓయూకు అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించిందని చెప్పడం అతిశయోక్తి కాదు.
1980-90ల మధ్య కాలంలో అధిక సంఖ్యలో అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులున్న ఓయూ రసాయన శాస్త్ర విభాగాన్ని మినీ వర్సిటీగా పిలిచేవారు. రసాయన శాస్త్ర ఆచార్యుడైన నవనీతరావు కృషి వల్లే ఇది సాధ్యమైంది. పర్యావరణ రసాయన శాస్త్రం, రసాయన విద్య, గ్రామీణ పాంతాల్లో శాస్త్ర సాంకేతిక అంశాల వినియోగం తదితర అంశాలపై ఆయన అనేక పరిశోధనలు చేశారు. యూరప్, అమెరికా, ఆగ్నేయాసియా దేశాల్లో పర్యటించారు. ఆయన సేవలకు గుర్తింపుగా జేసీ యంగ్ సైంటిస్ట్, ఉత్తమ విశ్వవిద్యాలయ అధ్యాపకుడు, ఏపీ అకాడమీ సైన్సెస్ పురస్కారం లాంటివెన్నో వరించాయి. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు చైర్మన్గా, సలహాదారుగా వ్యవహరించారు. రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ(లండన్) పరిశోధకుడిగా, ఇంటర్-అమెరికన్ ఫొటోకెమికల్ సొసైటీ సభ్యుడిగా, ఐఐసీటీ కార్యవర్గ సభ్యుడిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశోధన, అభివృద్ధి సంస్థ, సీఎస్ఐఆర్, యూజీసీ పరిశోధనా కమిటీల సభ్యుడిగా అత్యున్నత పదవులు అలంకరించారు. ఏపీ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్గా వ్యవహరించారు. ఆయన చేతుల మీదుగా ఉద్యోగ నియామక పత్రం అందుకొన్నవాడిగా నేను గర్విస్తాను. ఓయూ చరిత్రలో ఆయన పరిపాలన సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ కాలం. ఉస్మానియా యూనివర్సిటీకి వన్నె తెచ్చిన కొద్ది మంది వీసీల్లో ఆయన ఒకరు.
ఆచార్య నవనీతరావు నేడు మన మధ్య లేకపోవడం బాధాకరం. కానీ ఆయన చూపిన బాటలో ఉస్మానియన్స్ అందరూ నడిచి యూనివర్సిటీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. ఆయన వేసిన పునాదులపై ఓయూని అంతర్జాతీయ స్థాయి విద్యాకేంద్రంగా తీర్చిదిద్దాలి. అందుకోసం ఓయూలో దేశాభివృద్ధికి పనికి వచ్చే పరిశోధనలు ముమ్మరం చేయాలి. అదే ఆయనకు ఘనమైన, అసలైన నివాళి.
– ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ (వ్యాసకర్త: ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉప కులపతి)