అమెరికా ప్రపంచంలోకెల్లా సంపన్న దేశం. ఎక్కువ అప్పులు ఉన్నది అమెరికాకే. అప్పులు చేయడం తప్పు కాదు. అయితే అప్పులు దేని కోసం చేశారనేది ముఖ్యం. దేశాలకైనా, సంస్థలకైనా, వ్యక్తులకైనా అప్పులు సహజం. దేశంలోనైనా, రాష్ర్టాల్లోనైనా ప్రభుత్వాలు మారగానే ఆర్థిక పరిస్థితిపై తప్పనిసరిగా చర్చ జరుగుతుంది. ఒక్క మన రాష్ట్రమనే కాదు.. అనేక రాష్ర్టాల్లో ఇదే పరిస్థితి. ఏపీలో టీడీపీ ఓడిపోయి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ఖజానాలో కేవలం రూ.వంద కోట్లు మాత్రమే ఉంచి వెళ్లారనేది విమర్శ.
ప్రభుత్వం అనేది రిజర్వ్ బ్యాంకు కాదు, అక్కడేమీ కరెన్సీ ప్రింట్ చేయరు. నోట్ల కట్టలుండవు. పన్ను లు, ఇతర రూపాల్లో ఒకవైపు ఆదాయం వస్తుంటుంది. మరో వైపు వాటిని వ్యయం చేస్తుంటారు. అంతే తప్ప ఏ ప్రభుత్వం వద్ద కూడా వేల కోట్ల నిధులు ఉండవు. అప్పటివరకు ఉన్న ప్రభుత్వం తప్పు చేసింది, మేం వాటిని సరిదిద్దుతాము అని చెప్పుకోవడానికి కొత్తగా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆర్థిక వ్యవహారాలు, అప్పులు వెల్లడించడం సహజం. అప్పట్లో పీవీ నరసింహారావు, మన్మోహన్సింగ్ చేసిన ఆర్థిక సంస్కరణల కారణంగా ఈ రోజు మన దేశం ఆర్థికంగా నిలదొక్కుకొని ప్రపంచంలో తలెత్తుకొని నిల్చున్నది.
అయినా గత పాలకులు దేశాన్ని ఆర్థికంగా నిర్వీర్యం చేస్తే తాను గట్టెక్కించినట్టు ప్రధాని మోదీ ఇప్పటికీ చెప్పుకొంటారు. బంగారాన్ని విమానంలో తరలించి అప్పు పొందిన దశ నుంచి మూడున్నర దశాబ్దాల్లో దేశం ఆర్థికంగా ఇంత బలోపేతం అవుతుంది అని ఎవరూ ఊహించలేదు. చాలామంది మేధావులు సైతం ఆ రోజుల్లో ఆర్థిక సంస్కరణలను వ్యతిరేకించారు. ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మన దేశం ఎదగడానికి ఆనాటి సంస్కరణలు దోహదం చేశాయి. అయితే నాటి పాలకుల కృషిని నేటి ప్రభుత్వాలు గుర్తించడానికి ఇష్టపడవు. అది సహజం. అదే రాజకీయం.
ఉమ్మడి రాష్ట్రంలో రోశయ్య ఆర్థికమంత్రి అయిన అనంతర రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి శాసనసభలో తేటతెల్లం చేశారు. అంతకుముందు ఆర్థిక వ్యవహారాలు బయటకు వచ్చేవి కావు. ‘ఇలాంటి ఆర్థికస్థితిలో రాష్ర్టాన్ని అప్పగించారు. మా తలపై ఎంతటి భారం ఉందో చూడండి’ అని ప్రజలకు చెప్పాలనే రాజకీయ వ్యూహంలో భాగంగానే ఆయన అలా చేశారు.
పదేండ్ల టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పాలన తర్వాత ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రాజకీయ వ్యూహంలో భాగంగానే శాసనసభలో ఆర్థిక స్థితిపై చర్చకు శ్రీకారం చుట్టింది. కుటుంబ పెద్ద ఆదాయం ఎంతో తెలిస్తేనే కదా? ఆ కుటుంబం ఏ ఖర్చును ఎంత వరకు భరిస్తుందో అంచనా వేసుకునేది. రాష్ట్ర రుణం రూ.6.71 లక్షల కోట్లకు చేరిందని, రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం తలెత్తిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శాసనసభలో ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కో కుటుంబంపై రూ.7 లక్షల రుణ భారం ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విచారం వ్యక్తం చేశారు.
అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈ అప్పుల గురించి ఇప్పుడే తెలిసిందా? గత పదేండ్ల నుంచి వాళ్లు అసెంబ్లీకి రావడం లేదా? పదేండ్లలో బడ్జెట్ ప్రవేశపెట్టలేదా? కాగ్ రిపోర్టులు ఇవ్వలేదా? ఆర్బీఐ తెలంగాణ వివరాలు ఇవ్వడం లేదా? నిజంగా ఇలా జరిగి ఉంటే ఈ అప్పుల గురించి కాంగ్రెస్ నాయకులకు తెలిసే అవకాశం లేదు. అధికారంలోకి రాగానే ఖజానా తెరిచి చూస్తే అప్పుడే అప్పుల గురించి తెలిసింది అంటే నమ్మవచ్చు. కానీ అలా ఉండదు కదా? అప్పుల గురించి ఏటా బడ్జెట్లో వివరాలుంటాయి. వాటిని సభకు సమర్పిస్తారు. కొత్త ముఖ్యమంత్రి అప్పుల గురించి చెబుతూ ‘ఆర్థిక సంక్షోభం’ అని అన్నారు. ఎన్నికలకు ముందు ఆర్థిక పరిస్థితి గురించి కాంగ్రెస్ నాయకత్వానికి తెలియదా? ఆర్థిక సంక్షోభం నిజమే అనుకుందాం.. మరి ఎన్నికల ముందు బీఆర్ఎస్ను మించిన హామీలు ఎలా ఇచ్చారు?
సంక్షేమ పథకాల అమలుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా రూ.50 వేల కోట్లకు పైగా ఖర్చు చేసింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే అదనంగా మరో లక్షా 20 వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. వీటి అమలు సాధ్యం కాదు అని ఎన్నికలకు ముందే జయప్రకాశ్ నారాయణ హెచ్చరించారు. ఆరు గ్యారంటీలకు తోడు దళితబంధు రూ.12 లక్షలు, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ అమలుకు అదనంగా లక్షా 20 వేల కోట్ల రూపాయలు కావాలి అని జయప్రకాశ్ నారాయణ లెక్కలు చెప్పారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులకు ఈ లెక్కలేవీ గుర్తుకురాలేదు.
కరోనా తర్వాత రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతిన్నది. అది తెలిసి కూడా బీఆర్ఎస్ను మించి కాంగ్రెస్ హామీల వర్షం కురిపించింది. బీఆర్ఎస్ రూ.2 వేల పింఛన్ ఇస్తుంటే తాము అధికారంలోకి వస్తే రూ.4 వేలు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. అలానే రూ.10 లక్షల దళిత బంధును ఎస్సీ, ఎస్టీలకు రూ.12 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇంటర్ చదివే విద్యార్థినులకు స్కూటీ ఇస్తామన్నారు. రైతు భరోసా కింద ఏటా రూ.5 వేలు ఇవ్వడంతో పాటు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉంటే.. అధికారంలోకి రాగానే లక్షల సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు కాంగ్రెస్ నోటిఫికేషన్ల తేదీలు కూడా ప్రకటించింది. అధికారంలో ఉన్న పార్టీ కన్నా రెట్టింపు హామీలు ఇచ్చింది. ఇది ఎలా సాధ్యం అవుతుంది అనే ఆలోచన అప్పుడు రాలేదా? లేక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధికార పక్షం కన్నా తమకే బాగా తెలుసు అనుకున్నారా? లేక ఆదాయం పెంచి చూపిస్తామనే ధీమానా?
ఆదాయం పెంచి హామీలు అమలు చేసి చూపిస్తే రాష్ర్టానికి, ప్రజలకు మంచిదే. ఈ పదేండ్లలో అప్పులు పెరిగాయి తప్ప.. అభివృద్ధి లేదనేది కాంగ్రెస్ ఆరోపణ. రాజకీయ పార్టీగా ప్రత్యర్థిపై విమర్శలు, ఆరోపణలు చేయాల్సిందే కానీ పదేండ్లలో అభివృద్ధి జరగలేదా? మార్పు లేదా? అనేది కూడా ఆలోచించాలి. పదేండ్లలో ఏం అభివృద్ధి జరిగిందనేది మన కండ్ల ముందు కనిపిస్తున్నది. దాన్ని కాదనలేం. ముఖ్యమంత్రిగా అప్పుల గురించి శాసనసభలో ఆందోళన వ్యక్తం చేసిన రేవంత్రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ శాసనసభ్యునిగా ఉన్నప్పుడు ఇదే సభలో ఒక సంఘటన వివరించారు. ‘నా తండ్రి చనిపోతే దహన సంస్కారాల తర్వాత స్నానం చేయడానికి చెరువులో నీళ్లు లేవు. బోరు బావి వద్ద స్నానం చేద్దాం అనుకుంటే కరెంట్ లేదు’ అని పాలమూరు జిల్లాలో తాను అనుభవించిన దయనీయ స్థితిని స్వయంగా అప్పట్లో రేవంత్రెడ్డి వివరించారు.
ఇప్పుడు పాలమూరు అలానే ఉందా? పచ్చని పొలాలు నిజం కాదా? వలసల జిల్లాకు పొరుగు రాష్ట్రం నుంచి కూలీలు రావడం నిజం కాదా? ఒక రాజకీయ పార్టీ ఓడిపోవడానికి, విజయం సాధించడానికి అనేక కారణాలు ఉంటాయి. అధికార పక్షం ఓడిపోయినంత మాత్రాన తెలంగాణ పదేండ్లలో ఏం సాధించలేదు అని అనేద్దామా? మహామహా నాయకులు ఉన్న నల్లగొండ జిల్లా ప్రజలు ఫ్లోరోసిస్కు బలైతే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇంటింటికి సురక్షితమైన మంచినీళ్లు రావడం నిజం కాదా?
ఇచ్చిన హామీల నుంచి తప్పించుకోవడానికే ఆర్థిక సంక్షో భం అంటూ సాకు చెప్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. విపక్షాల విమర్శ నిజం కాదని నిరూపించాలంటే హామీలు అమలు చేసి చూపించాలి. ‘ఆర్థిక సంక్షోభంలో ఉన్నాం’ అని హామీల అమలును దాటవేస్తే కాంగ్రెస్ సాకులు వెతుక్కున్నట్టు అవుతుంది. ప్రజల్లో పాలకులు చులకనవుతారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల రాజకీయ ప్రయోజనాల కన్నా తెలంగాణ ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. కాంగ్రెస్ హామీల అమలు మాట ఎలా ఉన్నా.. గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను కొనసాగించడమూ కష్టమే. గత కొంతకాలం నుంచి మోదీ ప్రభుత్వం తెలంగాణపై కక్ష కట్టినట్టు వ్యవహరిస్తున్నది. బీఆర్ఎస్ ఉన్నప్పుడే కేంద్ర తీరు అలా అంటే కాంగ్రెస్ ప్రభు త్వం పట్ల ప్రేమ చూపుతారనుకోవడం అత్యాశే.
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్కు ఆర్థికంగా అండగా నిలువగ ల స్థాయిలో ఉన్న రాష్ర్టాలు కర్ణాటక, తెలంగాణ మాత్రమే. ఇలాంటి పరిస్థితిలో ‘తెలంగాణను ప్రధాని మోదీ పెద్దన్నలా ఆదుకుంటారు’ అని ఆశించడం అత్యాశే. విద్యుత్తు సంస్కరణలకు అంగీకరించి వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెడితే 24 వేల కోట్ల రూపాయల అప్పు తీసుకునేందుకు అవకాశం లభిస్తుందేమో! అంతకు మించి ప్రధాని మోదీపై ఆశలు పెట్టుకోలేం. అప్పుల రాజకీయాలు ఎలా ఉన్నా తెలంగాణలోని రాజకీయపక్షాల లక్ష్యం తెలంగాణ మేలు కోరుకునేట్టుగా ఉండాలి.
బుద్దా మురళి