Women’s Reservation bill | దాదాపు 27 ఏండ్ల ఎదురుచూపుల తర్వాత ఆమోదానికి నోచుకున్న మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ బిల్లు విషయంలో బీజేపీ తీసుకున్న నిర్ణయాలు, వేసిన ప్రతి అడుగును నిశితంగా పరిశీలిస్తే అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. బిల్లు అమలుపై బీజేపీ చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తున్నది. గడిచిన తొమ్మిదేండ్లుగా ఈ అంశంపై ఏనాడూ చర్చించని కమలం పార్టీ ఇంత హఠాత్తుగా బిల్లును తీసుకురావడం.. అదీ ఎన్నికల ముందు చేయడం వంటివి చూస్తే.. నిత్యావసరాల ధరలపై వెల్లువెత్తుతున్న నారీ లోకం ఆగ్రహం నుంచి తప్పించుకోవడానికే బీజేపీ ఈ బిల్లును తీసుకొచ్చిందన్న విమర్శలు వస్తున్నాయి.
మహిళా రిజర్వేషన్ల బిల్లుకు అన్ని పార్టీల మద్దతు సంపూర్ణంగా ఉంది. వెంటనే ఈ బిల్లుకు సంబంధించిన చట్టాన్ని అమలు చేయమని అన్ని పార్టీలు కోరుతున్నాయి. కానీ 2029 నుంచి అమలు చేస్తామని బీజేపీ చెప్తున్నది. అంటే ఈ బిల్లును తాయిలంగా చూపి రాబోయే లోక్సభ ఎన్నికల్లో మహిళల ఓట్లు కొల్లగొట్టాలన్న ఆకాంక్ష బీజేపీ పెద్దల్లో కనిపిస్తున్నది. నిజానికి పెరిగిన నిత్యావసరాలు, గ్యాస్ సిలిండర్ ధరలు వంటివి సగటు కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీటిని మహిళలు నిశితంగా గమనిస్తున్నారు. ఈ ప్రభావం నుంచి బయటపడి మహిళలకు ఒక ఆశ చూపించాలన్న ఉద్దేశంతోనే ఈ బిల్లు ఇప్పటికిప్పుడు పాస్ చేసినట్లుగా పరిశీలకులు భావిస్తున్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో మహిళల ఓట్లు చాలా కీలకం కానున్నాయి. గత ఎన్నికల ఓటింగ్ సరళిని క్షుణ్ణంగా పరిశీలిస్తే.. మహిళల ఓటింగ్ క్రమేపీ పెరుగుతూ వస్తున్నది. రానున్న ఎన్నికల్లో పురుషులకు మించి మహిళల ఓటింగ్ శాతం పెరిగినా ఆశ్చర్యపోనక్కరలేదని నిపుణులు పేర్కొంటున్నారు. మహిళల్లో అక్షరాస్యత, ఆదాయం పెరుగుతున్న కొద్దీ రాజకీయ చైతన్యం హెచ్చుమీరుతున్నదని వివిధ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. రాజకీయాల్లో పాలు పంచుకోవాలనే ఆసక్తిని స్వయం సహాయక సంఘాలు స్త్రీలల్లో పెంచుతున్నాయి. ఈ విషయాన్ని గమనించిన బీజేపీ.. వారి ఓట్లు కొల్లగొట్టేందుకే ఈ ఎత్తుగడ వేసిందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
ప్రస్తుతం పార్లమెంట్ సభ్యుల్లో 14 శాతం మాత్రమే మహిళలున్నారు. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం రూపొందించిన మహిళా రిజర్వేషన్ల బిల్లులోనూ లోపాలున్నాయని, వాటిని సవరిస్తేనే మహిళలకు న్యాయం జరుగుతుందని, ఇది మహిళల పట్ల చిత్తశుద్దితో ప్రవేశపెట్టిన బిల్లులా కనిపించడం లేదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్కుమార్ ఇప్పటికే విమర్శించారు. ఈ బిల్లు అమలుకు జనాభా లెక్కలు, డీలిమిటేషన్లు అడ్డుకాదని అన్ని పార్టీలు పేర్కొంటున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థల్లో మహిళలకు అమలవుతున్న 33 శాతం రిజర్వేషన్ పొందేందుకు అన్ని స్థానిక సంస్థల్లో ఆ లెక్కలున్నాయి. చట్ట సభల్లోనూ ఇప్పటికిప్పుడు ఈ రిజర్వేషన్ అమలు చేయాలంటే… స్థానిక సంస్థల ప్రస్తుతం ఉన్న లెక్కలను ఆధారంగా చేసుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు. కేంద్రం అనుకుంటే.. వచ్చే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్ల రిజర్వేషన్ అమలు చేయడానికి పుష్కలమైన అవకాశాలున్నాయి. విపక్షాలు వ్యతిరేకించిన వ్యవసాయ నల్ల చట్టాలకు బలవంతంగా ఆమోద ముద్ర వేసి అమల్లోకి తేవాలని ప్రయత్నించిన కేంద్రం, మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలు విషయంలో ఆ ఉత్సాహం, చొరవ చూపకపోవడంలో ఆంతర్యమేమిటన్న ప్రశ్నలు తలెత్తాయి.
నింగినంటిన నిత్యావసరాలు, గ్యాస్ సిలిండర్ ధరలతో మహిళా లోకం ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ల బిల్లును ఒక తాయిలంగా చూపి వారి ఓట్లు కొల్లగొట్టడమే బీజేపీ లక్ష్యంగా కనిపిస్తుందన్న విమర్శలు వస్తున్నాయి. నిజానికి బీజేపీ హయాంలో మహిళల కోసం ఏ ఒక్క కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి అమలు చేయలేదు.ఈ పరిస్థితుల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం కోసం పోరు సల్పిన బీఆర్ఎస్.. దాని అమలు కోసం సైతం ఉద్యమ బాట పట్టక తప్పదేమో అన్న పరిస్థితులే కనిపిస్తున్నాయి.
(వ్యాసకర్త: నమస్తే తెలంగాణ ప్రతినిధి, కరీంనగర్)
-కడపత్రి ప్రకాశ్రావు
80966 77022