తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. రాష్ట్ర అవతరణ తర్వాత రెండు మార్లు అధికారం చేజిక్కించుకున్న బీఆర్ఎస్ను ఓడించటం కోసం రాష్ట్రంలోని విపక్ష శక్తులన్నీ ఏకమవుతున్నాయి. ఆ క్రమంలో జరుగుతున్న పునరేకీకరణను కేవలం రాజకీయంగా చూడటం అవగాహనా రాహిత్యమే కాదు, అవివేకం కూడా.
తాజా ఎన్నికల నేపథ్యంలో ఈ మధ్య కొంతమంది రాస్తున్న రాతులు, చేస్తున్న రాజకీయ విశ్లేషణలు చూ స్తే ఆశ్చర్యం వేస్తున్నది. ఎన్నికలన్న తర్వాత పార్టీల ఏకీకరణ, పునరేకీకరణ కూడా సహజమే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ప్రజల్లో అధికార పార్టీ పట్ల వ్యతిరేకత అనేది సహజమన్నట్టుగా మాట్లాడటం కూడా సహేతుకమైనది కాదు. ప్రజల ఆశలను, ఆ కాంక్షలను నెరవేర్చనప్పుడు మాత్రమే వ్యతిరేకత అన్నదానికి తావుంటుంది. ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలు అమలు చేయనప్పుడు అధికార పక్షంపై వ్యతిరేకత ఏర్పడటం సహజం. కానీ బీఆర్ఎస్ విషయం దీనికి పూర్తి భిన్నమైన స్థితి.
సీమాంధ్ర వలస పాలన వివక్ష అణచివేతల్లోంచి తెలంగాణను విముక్తి చేసే క్రమంలో నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ప్రజలు పోరాడారు. ఉద్యమ పార్టీగా నాడు టీఆర్ఎస్ రాష్ట్ర అవతరణ తర్వాత నీళ్లు, నిధులు, నియామకాల కోసం నిబద్ధతతో కృషిచేసింది, చేస్తున్నది. సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి కరువు కాటకాలకు నెలవుగా మారిన తెలంగాణను సస్యశ్యామలంగా మార్చింది. కోటి ఎకరాలకు సాగునీరు అందించటం ద్వారా తెలంగాణను దేశానికే అన్నపూర్ణగా మార్చింది. పంజాబ్, హర్యానా కన్నా ఎక్కువ వరి ఉత్పత్తి సాధించి దేశంలోనే నెంబర్ వన్గా నిలిచింది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి పథకాలతో గ్రామీణ ప్రజల జీవనంలో సమూల మార్పులు తీసుకొచ్చింది. ఇక ఉద్యోగ నియామకాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కోసం వెచ్చిస్తున్న నిధుల గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. వృద్దాప్య పింఛన్లు, ఆసరా పథకం మొదలు కల్యాణ లక్ష్మి, రైతుబంధు దాకా అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ ప్రజల జీవన ప్రమాణాలను పెంచేవిగా ఉన్నాయి, పెంచాయి కూడా. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ పల్లె సీమలన్నీ సుఖ శాంతులతో ధాన్యపు రాసులతో అలరారుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అధికార పక్షంపై ఎవరికైనా ఎందుకు వ్యతిరేకత ఉండాలో తెలంగాణ అస్తిత్వ పార్టీని విమర్శిస్తున్న మేధావులు చెప్పాలె.
ఇక రాజకీయ కూటముల గురించి చూస్తే… వాటి ఏకీకరణలకు, స్నేహ హస్తాలకు ఏ సూత్రబద్ధత ఉండటం లేదు. ఐక్యతకు సిద్ధాంతాలు పునాది కావటం లేదు. ఆయా వ్యక్తుల, పార్టీల రాజకీయ నేపథ్యం, ఆచరణ ప్రామాణికం అవటం లేదు. ఈ నేపథ్యంలోనే..వామపక్షాలు కూడా నాకెంత, నీ కెంత అన్న ధోరణిలోకి దిగజారిపోవటం పెద్ద విషాదం. కాంగ్రెస్ పంచన చేరి సీట్ల పంపకాల విషయంలో కాంగ్రెస్తో పెనుగులాడుతున్నాయి.
మరో వైపు తాజా ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ వ్యతిరేక శక్తులన్నీ ఏకమవుతున్నాయి. సందర్భం వచ్చినప్పుడల్లా తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ విషం గక్కుతున్న మోదీ అడుగుజాడల్లో రాష్ట్ర బీజేపీ నడుస్తున్నది. తెలంగాణ ఏర్పడినప్పుడు నిరసనగా రెండుపూటలు తిండి మానేశానని చెప్పుకున్న పవన్ కళ్యాణ్తో బీజేపీ ఎన్నికల్లో జతకడుతున్నది. మరో వైపు తెలంగాణకు ఆగర్భ శతృవుగా ప్రకటించుకొని తన ప్రాణం ఉండగా తెలంగాణ ఏర్పాటు కానీయనని ప్రకటించుకొన్న వైఎస్ రాజశేఖర్రెడ్డి తన య వైఎస్ షర్మిల బీఆర్ఎస్ను ఓడించటమే లక్ష్యంగా కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. అంటే… తెలంగాణ వ్యతిరేకులు, ద్రోహులంతా ఒక్కటవుతున్నారన్నమాట!
ఈ దుష్ట పన్నాగాన్ని తెలంగాణ ప్రజలు పసిగట్టి ఓడించాలి. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛగా అస్తిత్వ చైతన్యంతో ప్రజా సంక్షేమ ప్రభుత్వాన్ని అందిస్తున్న బీఆర్ఎస్ను ముచ్చటగా మూ డోసారి గెలిపించి తెలంగాణ చైతన్యాన్ని చాటాల్సిన చారిత్రక సందర్భం ఇది. ఈ ఎరుకతో తెలంగాణ ప్రజలు వ్యవహరించాలి. తమ ఓటుతో తెలంగాణ వ్యతిరేక శక్తులకు గుణపాఠం చెప్పాలి.
-మఠం భిక్షపతి
95424 23242