‘దేశం కోసం, ధర్మం కోసం..’ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గొప్పగా చెప్తుంటారు. కానీ, మోదీ సహా బీజేపీ నాయకులంతా అదానీ కోసం, అధర్మం కోసమే పనిచేస్తున్నారు. ఇదే బీజేపీ రహస్య ఎజెండా. ఇటీవల ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం విడుదల చేసిన నివేదిక చూస్తే.. విస్తుపోయే నిజాలెన్నో తెలుస్తాయి.
ఎంతో ఘనకీర్తి గడించినట్లు చెప్పుకొంటున్న మోదీ ఆధ్వర్యంలో ఎన్నికైన తొలి లోక్సభలోని ఎంపీల్లో ఎక్కువమంది అవినీతిపరులు బీజేపీ వాళ్లేనట. 33 శాతం మంది లోక్సభ సభ్యులపై క్రిమినల్ కేసులున్నాయట. మరి మోదీ ఏం చేస్తున్నారు? ఏడపాయె ఆయన దేశ పరిరక్షణ కర్తవ్యం, ఏడపాయె ఆయన ధర్మ పరిరక్షణ కర్తవ్యం? లోక్సభకు ఎన్నికైన మొత్తం 521 మంది సభ్యుల్లో 430 మంది అవినీతిపరులుంటే, అందులో 227 మంది బీజేపీ వాళ్లున్నప్పటికీ, మాది స్వచ్ఛమైన పార్టీ, సచ్ఛీలురున్న పార్టీ అని ప్రధాని మోదీ ఎట్లా చెప్పుకోగలుగుతున్నారో అర్థం కావడం లేదు.
కేంద్రంలో గత తొమ్మిదేండ్లుగా ప్రధానిగా నరేంద్ర మోదీ అధికారంలో ఉన్నారు. ఈ కాలవ్యవధిలో తెలంగాణకు ఏం చేశారో చెప్పవచ్చు. ఏ ప్రాజెక్టులు ఇచ్చారో చెప్పవచ్చు. లేదా తమకు ఓటేస్తే వచ్చే ఐదేండ్లలో ఏం చేస్తారో, ఏమిస్తారో కూడా హామీలు ఇవ్వవచ్చు. కానీ అదేం లేదు. యథావిధిగా బీజేపీ నేతలు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే. ఎందుకంటే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ప్రత్యేకంగా ఇచ్చిందేమీ లేదు, తెచ్చిందేమీ లేదు కాబట్టి. అధికారంలోకి వచ్చీ, రావటంతోనే ఏడు మండలాలను గుంజుకున్నారు. ఇవ్వాల్సిన ఐటీఐఆర్ను ఇవ్వకుండా ఆపివేశారు. అంతటితో ఆగకుండా, రాష్ర్టాన్ని తలెత్తుకొనేలా చేసిన కేసీఆర్ ప్రభుత్వంపై అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో లబ్ధి కోసమే రాష్ట్ర ప్రభుత్వం 80 వేల ఉద్యోగాలంటూ ఇప్పుడు హడావుడి చేస్తున్నదట? మరి, ఈ తొమ్మిదేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం భర్తీచేసిన దాదాపు లక్షా 32 వేల పోస్టుల మాటేమిటి? అవి ఎవరి లబ్ధి కోసమో అమిత్ షా చెప్పగలరా? ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామంటూ ఈ దేశ యువతకు మోదీ 2014 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ బీజేపీ నేతలకు గుర్తున్నదా? కేంద్రంలో ఇప్పటివరకు 18 కోట్ల ఉద్యోగాలు యువతకు లభించాయా? కొత్త ఉద్యోగాల సంఖ్య అర కోటి కూడా దాటలేదని మీ కేంద్ర గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి.
ఈడీ దాడులకు వందలాది మంది విపక్ష నాయకులతోపాటు, విపక్ష పార్టీలు కూడా అల్లాడుతున్నయి. మొత్తంగా దేశవ్యాప్తంగా బీజేపీ నాయకుల అవినీతి, అక్రమాలు, ఘోరాలు, నేరాలు మితిమీరి పోయాయి. మీ ప్రచార హోరులో బీజేపీ వారంతా సత్యవంతులయ్యారు. మధ్యప్రదేశ్, కర్నాటక, అరుణాచల్ప్రదేశ్, బీహార్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ర్టాలలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలన్నీ కుప్పకూలిపోయి బీజేపీ సామ్రాజ్యాలు వెలిశాయి. ప్రజాస్వామ్యం పరిహసించబడింది. కానీ, ఎన్నటికైనా అధర్మానికి ఓటమి తప్పదు.
ఇరువై మూడేండ్ల కిందట జలదృశ్యంలో పురు డు పోసుకున్నది తెలంగాణ గులాబీ జెండా. ఆరు దశాబ్దాల బానిస, అవమాన, దోపిడీ పాలనను అంతం చేసేవరకూ ఆ జెండా అవిశ్రాంతంగా పోరాడింది. నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయ కత్వంలోనూ ఆ జెండానే తెలంగాణ సమాజానికి గుండె బలమై నిలుస్తున్నది. ఆ గులాబీ జెం డా తెలంగాణ ప్రజల పేగు బంధమై పెనవేసుకున్నది. కులం పేరిట, మతం పేరిట ఆ గులాబీ జెండా ను తెలంగాణ ప్రజల గుండెల నుంచి, ఎవ్వరూ, ఏనాడూ విడదీయలేరు. ఇది అక్షరాలా నిజం.
ధర్మస్య విజయోస్తు…
అధర్మస్య వినాశోస్తు…
ప్రాణిషు సద్భావనాస్తు…
విశ్వస్య కళ్యాణమస్తు…
-కర్నాటి విద్యాసాగర్
94913 93999