జనవరి 25న అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ నివేదిక వెలువడి అదానీ కంపెనీల షేర్లు కుప్పకూలిన తర్వాత పలు రకాలైన స్పందనలు వెలువడ్డాయి. కోపోద్రిక్తులైన జాతీయవాదులు దీనిని భారత్పై దాడిగా అభివర్ణించారు. ప్రధాన స్రవంతి మీడియా ఎడిటర్లు, రిపోర్టర్ల నుంచి కూడా అదానీని సమర్థిస్తూ వ్యాసాలు వెలువడ్డాయి. సుప్రీంకోర్టులో కొన్ని వ్యాజ్యాలు సైతం దాఖలయ్యాయి. అయితే, ఈ మొత్తం వ్యవహారంలో ప్రధానాంశం ఏమిటంటే, అదానీ సంస్థల షేర్ల ధరలు ఎటువంటి దర్యాప్తుగానీ, నియంత్రణ సంస్థల జోక్యంగానీ లేకుండా ఉన్నపళంగా అలా ఎలా పెరిగిపోయాయన్నది.
అదానీ వ్యాపారాలు ఎంత సమర్థవంతంగా ఉన్నాయి? ఆయనకు ప్రభుత్వ మద్దతు ఉందా? సాధారణ నేపథ్యం నుంచి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద సంపన్నుడిగా ఆయన ఎలా ఎదిగారు?’ ఇటువంటి ప్రశ్నలన్నీ అసలు విషయం నుంచి దృష్టి మళ్లించటానికి ముందుకు తెస్తున్నవే. ఎవ్వరైనా మొదట అడగాల్సింది.. అసలు ఈ ధరల రిగ్గింగ్ ఈ స్థాయిలో, ఎటువంటి నియంత్రణ అన్నది లేకుండా ఎలా జరిగింది అన్నది. ఏ చర్చ అయినా, ప్రశ్న అయినా ఆ తర్వాతే!
అదానీ టోటల్ గ్యాస్తోపాటు మరిన్ని ఆ గ్రూపు కంపెనీల షేర్ల ధరలు కొనుగోలుదారులే లేకుండా పాతాళానికి పడిపోయాయి. అదానీ షేర్ల ధరలను అడ్డూఅదుపు లేకుండా పెంచేశారని హిండెన్బర్గ్ నివేదిక లేవనెత్తిన ముఖ్యమైన అంశాన్ని ఈ పరిణామం రుజువు చేసింది. అంటే, ధరల రిగ్గింగ్ జరిగింది.
అదానీ షేర్ల ధరలను చిత్రవిచిత్రంగా పెంచేయటం వల్ల సంభవించే పరిణామాల్ని చాలామంది అర్థం చేసుకుంటారనయితే నేను భావించటం లేదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవటానికి కొన్ని చిన్న లెక్కలు చేద్దాం. రాజకీయ నాయకులు చెప్పీ చెప్పీ పాపులర్ చేసిన అదానీ, అంబానీల స్టాక్లనే దీనికి ఉదాహరణగా తీసుకుందాం. నిఫ్టీ 50లో భాగంగా ఉన్న అదానీ ఎంటర్ప్రైజెస్ ఉచ్ఛ దశలో ఉన్నప్పుడు ధర/ఆదాయం నిష్పత్తి 427గా ఉంది. రిలయెన్స్ ఇండస్ట్రీస్ ధర/ఆదాయం నిష్పత్తిని 400గా భావిస్తే.. దాని మార్కెట్ వాల్యూ ప్రస్తుతం ఉన్న దానికన్నా 16 రెట్లు అధికంగా ఉంటుంది. అంటే, 1.38 ట్రిలియన్ల డాలర్ల సంపదతో ముఖేష్ అంబానీ ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్ అయి ఉండేవారు. ఇదే రకంగా టీసీఎస్గానీ, ఇన్ఫోసిస్ను గానీ లెక్కిస్తే బీఎస్ఈ సెన్సెక్స్ ఇప్పుడున్న 60 వేల పాయింట్ల వద్ద కాకుండా, ఏకంగా 8-10 రెట్లు అధికంగా 4,80,000-6,00,000 పాయింట్లకు చేరుకునేది.
జనవరి 24న అదానీ టోటల్ గ్యాస్ షేరు ధర రూ.3,892. ఇది దాని గరిష్ఠ ధరకు దరిదాపుల్లో ఉంది. కానీ, ఈ నెల 20 నాటికి ఆ ధర రూ.752కు పడిపోయింది. నెల రోజుల్లో 81 శాతం పతనం. అనేక మందిని దిగ్భ్రాంతికి గురి చేస్తూ అదానీ కంపెనీల షేర్లు రోజుల తరబడి కనిష్ఠ ఐదు శాతం పరిధిలో నమోదవుతున్నాయి. వరుసగా 21 ట్రేడింగ్ రోజుల పాటు అదానీ షేర్లను అమ్మేవాళ్లే తప్ప కొనేవాళ్లు
లేకుండా పోయారు. ఈ నెల 24న 1,41,000 షేర్లు ట్రేడ్ అయ్యాయి. అన్నీ కూడా లోయర్ సర్క్యూట్ (కనిష్ఠ పరిధి)లోనే. కొనుగోలుదార్లకు అనేక రెట్ల సంఖ్యలో అమ్మకందార్లు ఉన్నారు. ఎంతగానంటే ఓపెన్, హై, లో, క్లోజ్ ధరలన్నీ కూడా ఒకే విధంగా లోయర్ సర్య్యూట్లోనే ఉండిపోయాయి. అయితే, చాలా మంది అడుగుతున్న ప్రశ్న.. ఇంత ఆదుర్దాతో షేర్లను అమ్ముతున్న వారెవరు, ఇంతకు ఎవరు?..
అదానీ కంపెనీల్లో అదానీలకే 74.8 శాతం వాటా ఉంది. మరో 17.25 వాటాలను ‘విదేశీ సంస్థాగత పెట్టుబడుదారులు’ కలిగి ఉన్నారు. వారంతా అదానీకి సంబంధించిన వారేనన్న వార్తలున్నాయి. ఇక 6.09 శాతం వాటాలను దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు కలిగి ఉన్నారు. అంటే నికరంగా జనం వద్ద ఉన్న వాటాలు 1.85 శాతం మాత్రమే. మరి, అమ్ముతున్నది ఎవరు?
అదానీ టోటల్ గ్యాస్ కంపెనీకి మొత్తం 110 కోట్ల షేర్లున్నాయి. దీంట్లో జనం వద్ద 1.85 శాతం షేర్లు అంటే, రెండు కోట్ల షేర్లు ఉన్నాయని అనుకుందాం. కానీ, ఈ నెల 24న 1,41,000 షేర్లు మాత్రమే ట్రేడ్ అయ్యాయి. అవి కూడా లోయర్ సర్క్యూట్లో. జనం ఆందోళనతో అమ్మటాన్ని కొనసాగించినా కూడా ఈ లెక్కన రెండు కోట్ల షేర్లు అమ్ముడుపోవటానికి చాలా కాలం పడుతుంది. భారీ సంఖ్యలో షేర్లను కలిగి ఉన్న విదేశీ పెట్టుబడిదారులు కూడా తమ షేర్లను అమ్మవచ్చు. కాబట్టి, ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే.. ఎవరు అమ్ముతున్నారు అని కాదు, నెల రోజుల్లో 81 శాతం ధరలు పతనమైన తర్వాత కూడా సదరు షేర్లను కొనుగోలుదార్లు వేలంవెర్రిగా ఎందుకు కొనటం లేదు? ఇక్కడే అసలు విషయం దాగి ఉంది. అదానీ టోటల్ షేరు ధరను ఇప్పటికీ చాలా ఎక్కువగానే వెల కట్టారు. ఇదే మొత్తం అదానీ వ్యవహారంలో అంతస్సారం.
హిండెన్బర్గ్ ప్రకారం అదానీ టోటల్ వాస్తవ ధర (పరిశ్రమలో ఉన్న ధర/ఆదాయం నిష్పత్తి ప్రకారం) తమ నివేదిక వెలువడిన రోజున ఉన్న ధర కన్నా 97.6 శాతం తక్కువ ఉండాలి. అంటే దాదాపు రూ.100. కానీ, ఇప్పటికీ ఆ షేరు ధర రూ.752. రూ.3,892 నుంచి 81 శాతం పతనమైన తర్వాత కూడా ఇంత ధరలో ఆ స్టాకు కొనసాగుతున్నది. అంటే, హిండెన్బర్గ్ అంచనా వేసిన స్థాయికి అదానీ గ్రూపు స్టాక్స్ నేటికీ దిగి రాలేదు. మరోవైపు 18 శాతమే అధికంగా లెక్క గట్టారని హిండెన్బర్గ్ పేర్కొన్న అదానీ పవర్ షేరు ధర మాత్రం దాదాపు 50 శాతం పతనమైంది.
అదానీ షేర్ల ధరలు పడిపోతున్న కొద్దీ వాటిని కొనే వారు కూడా అదే స్థాయిలో ఉంటే ఇంత ఆశ్చర్యం ఉండేది కాదు. కానీ, అలా జరగటం లేదు. దీనిని బట్టి అదానీ వ్యవహారానికి ఉన్న ఏకైక కోణం ఏమిటంటే.. హాస్యాస్పదమైన స్థాయిలో ఆ కంపెనీల షేర్ల ధరలను పెంచేశారు.
(వ్యాసకర్త: మనీలైఫ్ వెబ్సైట్ ఎడిటర్) (బిజినెస్ స్టాండర్డ్ సౌజన్యంతో..)
దేబాశీష్ బసు