సామాజిక మాధ్యమాల ద్వారా కొత్తపుంతలు తొక్కుతున్న సాంకేతికతను అనేకమంది సద్వినియోగం చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా వ్యాపారాభివృద్ధికి, నైపుణ్యాల పెంపునకు కృషి చేస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు. కానీ, అసహనపు అంచులు దాటి, క్రూరత్వపు కోరలు చాచి నచ్చని వ్యక్తులను వేధించే సాధనంగా అదే సోషల్మీడియాను కొంతమంది మార్చుకుంటున్నారు. తత్ఫలితంగా సామాజిక మాధ్యమాలు వ్యక్తిగత హననానికి వేదికగా మారుతుండటం ఆక్షేపణీయం.
తమ సందేశాన్ని ప్రజలకు చేరవేసేందుకు రాజకీయ పార్టీలు, నాయకులు సామాజిక మాధ్యమాలపైనే ఆధారపడటం నయా ట్రెండ్గా మారింది. శుష్క వాగ్దానాలు, శూన్య హస్తాలతో ప్రజలను మభ్యపెడుతూ సద్విమర్శలను సైతం సహించలేని స్థితికి పాలక, ప్రతిపక్షాలు చేరుకున్నాయి. అలాంటి వారి క్రియా శూన్యతతో నోటికి వచ్చిందల్లా మాట్లాడే వేదికగా సోషల్ మీడియా మారింది. వ్యక్తిగత కక్షలకు దేశ, రాష్ట్ర సార్వభౌమత్వాలకు ముడిపెట్టి.. వాటికి సామాజిక సమస్యల రంగు పులిమే విధ్వంసకర క‘ధన’ రంగంగా కొందరు సోషల్మీడియాను మార్చేశారు. నచ్చని వ్యక్తి మానసిక ైస్థెర్యాన్ని, ధైర్యాన్ని, వారి సచ్ఛీలతను, నైతిక విలువలను దిగజార్చే వినాశనకరమైన ఈ ఆలోచనలు అణుబాంబుల కంటే ప్రమాదకరం.
ఏదో ఒక పార్టీకి వత్తాసు పలుకుతూ ప్రశ్నించే జర్నలిస్టులు, సమాధానం చెప్పలేక దాడి చేసే పలు పార్టీల కార్యకర్తలు గుర్తింపు కోసం తహతహలాడుతున్నారు. వారంతా భావప్రకటనా స్వేచ్ఛ పేరిట అసభ్య పదజాలంతో విరుచుకుపడుతూ పైశాచికానందం పొందుతున్నారు. అలాంటి వ్యక్తులను, వ్యవస్థలను కట్టడి చేసే పటిష్ఠమైన పాలనా యంత్రాంగంతో పాటు ధైర్యంగా ఎదిరించే సమాజం లేకపోవడం మన దురదృష్టం.
సమాజంలో గౌరవంగా బతికే హక్కు ప్రతీ పౌరునికి ఉన్నది. కులమతాలు, పార్టీలకతీతంగా ఈ హక్కులు వర్తిస్తాయి. ఇతరులను, సంస్థలను, పార్టీలను కించపరిచే హక్కు ఎవరికీ లేదు. అయితే సోషల్ మీడియా వేదికగా తమ మాటలు, పాటలు, రచనల ద్వారా ఇతరులను హింసిస్తున్నవారు పెచ్చరిల్లుతున్నారు. కొంతమంది విషయాల ముసుగులో విషం చిమ్ముతున్నారు. ఆశయాల ముసుగులో అశ్లీలతను పెంచిపోషిస్తున్నారు. ఆధిపత్యం ముసుగులో అహంకారం ప్రదర్శిస్తున్నారు. భావప్రకటనా స్వేచ్ఛ ముసుగు వేసుకుని హననకాండ సాగిస్తున్నవారు ఇకనైనా ఆ పద్ధతి మానుకోవాలి. అలాంటివారిని, అటువంటి వ్యక్తులను ప్రోత్సహిస్తున్న వారిని ఈ సమాజం దూరంగా పెట్టినరోజే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది.
– జోస్యుల వేణుగోపాల్, 94404 36806