Kotha Paluku | ‘తెలుగు ప్రజల చెవిలో ఉక్కు పూలు’ అంటూ ఆంధ్రజ్యోతి ( ABN Andhra Jyothi ) రాధాకృష్ణ ( Radha krishna ) ‘కొత్తపలుకు’ వ్యాసంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR )పై మరోసారి తన పైత్యాన్ని ప్రదర్శించాడు. వ్యక్తిత్వం పాతదే, విషయం తెలిసిందే కానీ సందర్భం కొత్తది. ఎందుకంటే ఆయన తన వ్యాసంలో కుళ్లిపోయిన సంకుచిత మనస్తత్వాన్ని ప్రదర్శించాడు. విశాఖ ఉక్కును ప్రస్తావిస్తూ కేసీఆర్ నాయకత్వ శైలిని విమర్శించాడు. అంబేద్కర్ మహా విగ్రహ ప్రస్తావన చేస్తూ ఇద్దరు జాతిపితల మధ్య అగాధం సృష్టించే ప్రయత్నం చేశాడు. దీనిపై ఎన్ని కేసులు పెట్టినా తక్కువే. ‘ఇద్దరూ ఇద్దరే’ అంటూ పరోక్షంగా తన కుల దేవుడిని ప్రశంసించాడు. ఇంతమాత్రం అర్థం చేసుకోలేమా?
ప్రఖ్యాత జర్నలిస్టు రాజ్దీప్ సర్దేశాయ్ ‘కౌన్ బనేగా చాలెంజర్’ అంటూ జాతీయ స్థాయిలో కేసీఆర్ అవసరాన్ని నొక్కి చెప్పాడు. నిన్నటికి నిన్న హైదరాబాద్ వచ్చిన ప్రకాష్ అంబేద్కర్ జాతీయ స్థాయిలో కేసీఆర్ అవసరం ఉన్నదని, దేశంలో వాజపేయి తర్వాత ఆ లోటు ఏ నాయకుడూ తీర్చలేదని చెప్పారు. నాందేడ్లో కేసీఆర్ ‘రీ ఇన్వెంట్ ఇండియా- రీ ఓరియంట్ ఇండియా’ డిక్లరేషన్ విడుదల చేసి ఈ దేశానికి నూతన దిక్సూచిని చూపాడు. ఇలాంటి అంశాలు రాధాకృష్ణకు కనపడవు. అందుకే ‘కొత్త పలుకు’లో పాత పులుసును జల్లెడ పట్టాలి.
సుమారు 1500 పదాల తన కొత్తపలుకు వ్యాసంలో 50సార్లకు పైగా సీఎం కేసీఆర్ ప్రస్తావన చేశాడంటే రాధాకృష్ణ మనసులో ఎంత అసూయ, ద్వేషం పొంగిపొర్లుతున్నదో పసిగట్టలేమా? ఎంతైనా కపటనీతికి రాధాకృష్ణ మారు పేరే కదా? నిజాయితీగా ఆలోచిస్తే ‘తెలుగు ప్రజల చెవిలో ఉక్కు పూలు’ అంటూ పెట్టిన హెడ్డింగ్కు అనుగుణంగా.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఏ విధంగా దెబ్బతీస్తున్నది, ఆంధ్రులకు ఏ విధంగా అన్యాయం చేస్తున్నదో విశ్లేషించాలి. కానీ, ఆ విషయా న్నే రాధాకృష్ణ మరిచిపోయాడు. ఆ మతిమరుపులో కొంగ జపం, నక్క వినయం ఉన్నట్టే కదా! చాణక్యుడి సూత్రాల్లో ఒకదానిని ఇక్కడ ప్రస్తావిస్తూ రాధాకృష్ణ కొత్త పలుకులోని పాత పులుసును జల్లెడ పడదాం. ‘ఎప్పటి వరకైతే జనం తమ లాభాన్ని ఒక నాయకుడి నుంచి పొందగలరో అప్పటివరకు ఆ నాయకుడు జననేతగా మిగులుతా రు’ అని అంటాడు చాణక్యుడు. ఈ సూత్రాన్ని ఔపోసన పట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ జనరంజక నేతగా వర్ధిల్లుతుంటే రాధాకృష్ణకేం నష్టమో దేవుడికే తెలియా లి. జాతీయ, ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలలో భాగంగా ఏర్పడిన ఒక సంక్లిష్ట చిక్కుముడికి పరిష్కార మార్గమే తెలంగాణ ఏర్పాటు అని చూసే మేధోమథనం ఇంకా ఈయనలో వికసించలేదు. అందుకే ఈయన పక్వం చెందని ఒక కచ్చా రాజకీయవాది. కుహనా మేధావి.
తన వ్యాసంలో ‘విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం రెండు తెలుగు రాష్ర్టాల్లోని రాజకీయపార్టీల చెవుల్లో పువ్వులు పెట్టింది. కేంద్రం పెట్టిందనడం కంటే మనవాళ్లు పెట్టించుకున్నారనడంలో సమంజసం ఉన్నది’ అని రాశాడు. రాధాకృష్ణ నిజంగానే ప్రజల తరఫున మాట్లాడితే… ఈ అంశానికి కారణమైన బీజేపీని, ఢిల్లీలోని కేంద్రాన్ని నిలదీయాలి. కానీ ఇదేమీ ప్రస్తావించకుండా కేవలం జగన్, కేసీఆర్ ప్రభుత్వాలను విమర్శించడం ఏమి నీతి? ఏ జర్నలిస్టు ప్రమాణం? ఏ నైతికత? కనీసం విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలను కూడా ప్రస్తావించలేదంటే ఆయన ఎంతటి పక్షపాత ధోరణితో ఉన్నాడో అర్థమవుతున్నది.
ఇక వ్యాసంలోని ముగింపు వాక్యాన్ని ప్రస్తావిద్దాం. ‘నవంబర్లో జరగనున్న ఎన్నికల్లో విజయం సాధిస్తే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తూ ఢిల్లీకి పరిమితం కావచ్చు. లేనిపక్షంలో ఫామ్హౌజ్లో విశ్రాంతి తీసుకోవలసి వస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో!’ అని ముగించాడు.
ఇక్కడ రెండు విషయాలు గమనించాలి. టీఆర్ఎస్-బీఆర్ఎస్గా మారిన తర్వాత కేసీఆర్ పాత్ర దేశమంతా ఉంటుంది. ఇది జగమెరిగిన సత్యం. ఇప్పటికే మహారాష్ట్రలో బీఆర్ఎస్ ప్రభంజనం చూస్తున్నాం. అటువంటి కేసీఆర్ను తెలంగాణకే పరిమితం చేయాలని బీజేపీ అనేక కుట్రలు చేస్తున్నది. ఎమ్మెల్యేలకు ఎర, సీబీఐ దాడులు, ఈడీ సోదాలు, విచారణలు.. ఇవన్నీ దీనిలో భాగమే. రాధాకృష్ణ కూడా ఆ కుట్రకు అనుగుణంగానే కేసీఆర్పై ప్రజల్లో వ్యతిరేకత పెంచాలనే కుట్రతో వ్యాసం రాసినట్లు అర్థమవుతున్నది. దీన్ని రాజకీయ భాషలో ఒపీనియన్ బిల్డింగ్గా చెప్తారు. అసలు కేసీఆర్ నాయకత్వాన్ని అర్థం చేసుకోవడంలో రాధాకృష్ణ ఇంకా ఏబీసీడీలు కూడా దాటలేదనిపిస్తున్నది. ఎందుకంటే తెలంగాణ ఒక స్టార్టప్ స్టేట్ నుంచి అభివృద్ధి పథంలో పరుగులు పెడుతున్న ఒక ఆదర్శ రాష్ట్రంగా మారింది. వరిస్తున్న అవార్డుల పరంపరే దీనికి సంకేతం.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భా రత్ నేడు బీజేపీ రూపంలో ఫాసిజం ముప్పును ఎదుర్కొంటున్నది. దీనికి వ్యతిరేకంగా పోరాడటం నేడు ప్రజాస్వామ్యవాదుల ముందున్న తక్షణ కర్తవ్యం. ఇటువంటి సంక్లిష్ట సమయంలో దేశానికి ఒక ప్రత్యామ్నాయ ఎజెండాతో కేసీఆర్ ముందుకొచ్చారు. ఇటువంటి సాహసాన్ని దేశంలో ఏ రాజకీయ నాయకుడూ చేయలేదు. దళితులపై దాడులు పెరుగుతున్న నేటి రాజకీయ వాతావరణంతో భారతదేశంలో ఉన్న భావ వైవిధ్యాన్ని కాపాడుకోవటం చారిత్రక అవసరం. కేసీఆర్ ఇప్పుడు ఆ కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నారు. దాంట్లో భా గమే అంబేద్కర్ మహా విగ్రహం. ఆయన 125వ జ యంతి సందర్భంగా గతంలో ప్రకటించిన 125 అడుగుల మ హా విగ్రహాన్ని పూర్తి చేశారు కేసీఆర్. నేడు దేశమంతా అంబేద్కరిజంపై మరోసారి చర్చ జరుగుతున్నది.
అంబేద్కర్ రాజ్యాంగ కోవిదుడిగానే కాకుండా ఆర్థిక రంగ నిపుణుడిగా చేసిన అనేక ఆవిష్కరణలు, రాసిన గ్రంథాలపై ఇప్పటికే చర్చలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 4న హైదరాబాద్లోని రవీంద్రభారతిలో జరిగిన జాతీయ మేధావుల ధన్యవాదాల సభలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటుకు కారణమైన అంబేద్కర్ పరిశోధనాత్మక గ్రంథం ‘ప్రాబ్లం ఆఫ్ రుపీ’ని విశ్వవ్యాప్తం చేసేందుకు నిర్వాహకులు ఒక వినూత్న ప్రయత్నం మొదలుపెట్టారు. విగ్రహావిష్కరణకు ముఖ్యఅతిథిగా హాజరైన ప్రకాశ్ అంబేద్కర్ మాట్లాడుతూ.. ‘ప్రాబ్లం ఆఫ్ రుపీ’ గ్రంథం ప్రాధాన్యాన్ని ప్రస్తావించారు. దీనిపై విస్తృత చర్చ జరుగుతున్నది. అన్ని పత్రికలు, టీవీ ఛానల్లు గుర్తించాయి. ఇంతటి ప్రాధాన్యం గల విషయాలు ఈ కుటిల నీతి రాధాకృష్ణకు కనపడవు. నిజంగా ఆయన దేశభక్తుడైతే అంబేద్కర్ మీద వ్యాసాలు రాయాలి. అంబేద్కర్ ప్రాధాన్యాన్ని దేశం కోసం నొక్కిచెప్పాలి. అవన్నీ పట్టకుండా తెలుగు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ చాలా ప్రమాదకరమైన భావనలను ఈ వ్యాసంలో రాశాడు. విషం కక్కాడు. ‘సంఖ్యాపరంగా వైశ్యులు ఎక్కువగా ఉంటే జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని కూడా కేసీఆర్ 150 అడుగుల ఎత్తులో నిర్మించి ఉండేవాడు. ఓటుబ్యాంకు రాజకీయాల కారణంగా వీరి మనస్సులో మహాత్మాగాంధీ వెనుకబడి డాక్టర్ అంబేద్కర్ ముందుకొచ్చాడు.
ముందు ముందు వీరు జ్యోతిరావు పూలే విగ్రహాన్ని కూడా రూపొందించవచ్చు’ అని రాశాడు. ఇది ఎంతటి అసంబద్ధమైన మూర్ఖపు వాదన. రాధాకృష్ణ మనసులో ఏముందో ఈ వాక్యాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మహాత్మాగాంధీ వెనుకబడ్డాడంటే మన దేశంలోని ఏ వర్గం ప్రజలైనా ఒప్పుకొంటారా? జాతిపితగా ఆయన స్థానం భారతీయుల హృదయాల్లో ఎన్నటికీ సుస్థిరం. దానిని ఎవరూ తొలగించలేరు. దేశంలో ఎవరూ సాహసించని విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్కు ఒక మహావిగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ఈయనకు ఎందుకింత కుళ్ళు పుట్టిందో ఆ భగవంతుడికే తెలియాలి! అంతేకాకుండా, ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కవిత అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకై చేసిన అలుపెరుగని పోరా టం ఆయన మర్చిపోయాడు. స్వయంగా కేసీఆర్ తన రాజకీయ జీవితం తొలినాళ్లలో, ఎమ్మెల్యే అయిన తర్వాత 1985లో దళితుల ఉద్ధరణకు ‘దళితజ్యోతి’ పథకాన్ని ప్రారంభించింది వాస్తవం కాదా? ఇదంతా మరిచి, దళితుల సంఖ్య గణనీయంగా ఉంది కాబట్టి, ఇప్పుడు అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని నోరు పారేసుకోవటం ఏమి నీతి?
భారతజాతి మనుగడ ఉన్నంత వరకు గాంధీ, అంబేద్కర్ అనే ఇద్దరు మహనీయుల అస్తిత్వం అవసరం లేదని ఎవరైనా చెప్పగలరా? అహింసకు మారుపేరైన గాంధీవాదం ప్రపంచశాంతికి ఉపయోగపడలేదా? సామాజిక సమానతకు ఆర్థిక సూత్రాలను అన్వయించుకున్న ఏషియన్ టైగర్స్ దేశాల అభివృద్ధికి అంబేద్కర్ కారణం కాదని ఎవరైనా చెప్పగలరా? ఇంతటి ప్రపంచ దార్శనికులను కుల నేపథ్యంతో విశ్లేషించటం ఎంత దారుణం. గురువింద నీతి మాట్లాడుతూ, సమాజానికి నూతన విచ్ఛిన్నకర భావజాలాన్ని రాధాకృష్ణ తన విష పత్రికలో వ్యాప్తి చేయడం క్షమించరాని నేరం. అతడిపై ఎన్ని కేసులు పెట్టినా తక్కువే.
విశాఖ ఉక్కు కంపెనీ నేటి స్థితికి అసలు కారణమైన మోదీ కార్పొరేట్ వాదాన్ని ఈయన విమర్శించే సాహసం చేయడు. అంతేకాదు, ఆంధ్రుల ఓట్ల కోసం అంగలార్చుతున్న చంద్రబాబు, లక్షలాది కుటుంబాలతో ముడివడిన వైజాగ్ స్టీల్ప్లాంట్ గురించి మోదీని ఎందుకు నిలదీయడని ప్రశ్నించడు. ఆంధ్రలో అటు అధికార వైసీపీ, ఇటు ప్రతిపక్ష టీడీపీ చేతగాక వైజాగ్ స్టీల్ప్లాంట్ను మోదీ కబంధ హస్తాలకు అప్పగిస్తుంటే, ఆ కంపెనీని కాపాడటం కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ శతవిధాల చేస్తున్న ప్రయత్నాలను మాత్రం విమర్శిస్తాడు. విశాఖ ఉక్కును కొనేంత ఆర్థికబలం తెలంగాణకు లేదని కొత్త జోస్యం చెప్తున్నాడు. గతంలో తెలంగాణ డిమాండ్పై ఇటువంటి కుట్రలే జరిగాయి. తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కుకోలేదని రాధాకృష్ణ సహా ఎందరోకుహనా మేధావులు నాడు ఇలాగే అరిచారు. పరిశ్రమలు తరలిపోతాయన్నారు. హైదరాబాద్ ఖాళీ అవుతుందన్నారు. తెలంగాణలో మత హింస, నక్సల్స్ విధ్వంసం జరుగుతాయనారు. కానీ వారి కపటనీతికి విరుద్ధంగా చాణక్య నీతిని చూపిన దార్శనికుడు కేసీఆర్. ఎందుకంటే ఈ తొమ్మిదేండ్లలో ఆయన పనితీరు యావత్ దేశానికే ఆశా కిరణమైంది. ‘దేశ్ కీ నేత కేసీఆర్’ అనే డిమాండ్ వినిపిస్తోంది. నేడు తెలంగాణ భారతదేశానికి దిక్సూచి. దానిని గుర్తించే పెద్ద మనసు రాధాకృష్ణకు లేదు. ఎందుకంటే ఆయన చరిత్ర అలాంటిది. ఇలాంటి వ్యక్తికి సూర్యుడిలా వెలుగుతున్న కేసీఆర్ వ్యక్తిత్వం అర్థం కావడానికి మరో జన్మ కూడా చాలదేమో.
కేసీఆర్ ప్రయత్నాలను మెచ్చుకున్న మాజీ ఐపీఎస్, ప్రముఖ సామాజికవేత్త జేడీ లక్ష్మీనారాయణకు చురకలంటించడం రాధాకృష్ణ విజ్ఞతకే వదిలేయాలి. కరోనా వ్యాధి విజృంభించిన సందర్భంలో జరిగిన ఒక చిన్న విషయాన్ని రెచ్చగొడుతూ కేసీఆర్పై బురద చల్లాడు. ఆంధ్రా నుంచి కరోనా రోగులు హైదరాబాద్కు చికిత్స కోసం వస్తుంటే సరిహద్దులో తెలంగాణ ప్రభుత్వం అడ్డుకున్నదని నింద మోపాడు.
ఆ సంక్షోభ సమయంలో హైదరాబాద్లోని దవాఖానల్లో ఇక్కడి వారికే సరిపోయినన్ని బెడ్లు లేవనే సంగతి కావాలని మర్చిపోయాడు. ఆ క్షణాన హైదరాబాద్లో ఉన్నవారిలో అనేక మంది ఆంధ్రు లూ ఉన్నారు. వారు ప్రభుత్వాసుపత్రుల్లో సైతం ఉచితంగా చికిత్స చేయించుకున్నారు. ఒకట్రెండు రోజులపాటు జరిగిన సంఘటనను భూతద్దంలో చూపిస్తున్నాడు. ఇంతకీ ఇటువంటి ఆపత్కాల సమయంలో ఈయనగారి కులదేవుడు (చంద్రబాబు) ఎక్కడున్నాడు? ప్రజలకు మేలు చేయటానికి ఏమైనా ప్రయత్నాలు చేశాడా? అన్నది ఎక్కడా పేర్కొనలేదు. 75 ఏండ్లలో దక్షిణ భారతదేశానికి జరిగిన అన్యాయాన్ని చర్చిస్తూ ప్రఖ్యాత మహారాష్ట్ర రైతు నాయకుడు రాజు శెట్టి ఈ దేశానికి కేసీఆర్ ప్రధాని కావాలని, ఆయనకు ఆ అర్హతలు ఉన్నాయని విడమర్చి చెప్పాడు.
జాతీయ స్థాయిలో చంద్రబాబుతో సాధ్యం కాని పని కేసీఆర్తో సాధ్యమవుతుందేమోనని రాధాకృష్ణ భయపడుతున్నాడు. ఇది సుస్పష్టం. అందుకే ఆంధ్రా ప్రజలను రెచ్చగొడుతున్నాడు. ఆంధ్రా ప్రజలే మాకు కేసీఆర్ కావాలని, లేఖలు, ఫోన్లు చేస్తుంటే వద్దనడానికి ఎవరికి హక్కున్నది? అందుకే ఇలాంటి వారికి ఆదిలోనే అడ్డుకట్ట వేయాలి. ‘జై కేసీఆర్’ అంటూ నడుం బిగించాలి. మరోసారి తెలంగాణ సత్తా దేశవ్యాప్తం చేయాలి. జై కేసీఆర్! జై బీఆర్ఎస్!!
(వ్యాసకర్త: మఠం బిక్షపతి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, 95424 23242 )