ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ ప్రజలను ఆలోచింపజేసి, ప్రేరణ కలిగించిన వ్యక్తులు ఇద్దరే ఇద్దరు. ఒకరు కార్ల్మార్క్స్ అయితే, మరొకరు డాక్టర్ బీఆర్ అంబేద్కర్. వీళ్లను ప్రభావితం చేసిన మహోన్నతమైన వ్యక్తి గౌతమ బుద్ధుడు. మార్క్స్ జర్మనీలో జన్మించగా, మన దేశంలో నిచ్చెనమెట్ల వ్యవస్థలో చిట్టచివరకు విసిరేయబడిన నిమ్నకులంలో అంబేద్కర్ జన్మించారు. వీరిద్దరూ దేశ, కాలమాన పరిస్థితులకు అనుగుణంగా అక్కడి అసమానతలకు వ్యతిరేకంగా జీవితాంతం పోరాటం చేశారు.
BR Ambedkar | దేశంలో నెలకొన్న అసమానతలు, అవమానాలు ఎదురైనా అంబేద్క్ర్ నిరంతరం ఎదురొడ్డి పోరాడి నిలిచాడు. ప్రస్తుతం కుల సమస్య తగ్గినట్టుగా కనపడుతున్నా మౌలికంగా తన అసలు స్వరూపాన్ని మాత్రం మార్చుకోలేదనే విషయాన్ని గ్రహించాలి. కుల వ్యతిరేక పోరాటాలు ఎన్ని వచ్చినా భారత సామాజిక జీవనంలో కులతత్వం లోతుగా పాతుకుపోయింది. చదువును, సంస్కృతిని ఆయుధంగా మలుచుకొని ఎదిగిన జ్ఞాన సైనికుల ద్వారానే రాజ్యాధికార కాంక్షతో కులరహిత సమాజం, ఆ తర్వాత సమసమాజం సాధ్యమవుతుంది. ప్రపంచ మేధావిగా, జ్ఞానయోధులుగా పేరొందిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని ఏప్రిల్ 14న విశ్వవ్యాప్తంగా జరుపుకొంటారు. కులం, మతం, జాతి, ప్రాంతం, వివక్షలతో సంబంధం లేకుండా అతిపెద్ద ఉత్సవంగా అంబేద్కర్ జయంతి జరగడం సంతోషం.
రాజ్యాంగం ద్వారానే హక్కులు: అడగందే అమ్మ అయినా అన్నం పెట్టదంటారు. మన దేశంలో అంబేద్కర్ పుట్టకుంటే, గొప్ప రాజ్యాంగాన్ని అందించకుంటే పేదల బతుకుల్లో ఈ మాత్రమైనా వెలుగులు ఉండేవి కావు. బ్రిటిష్ కంటే ముందు మనువాదమే రాజ్యాంగంగా చలామణి అయ్యింది. బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియులకు తప్ప.. మిగిలిన కులాల, జాతుల ప్రజలకు ఎలాంటి హక్కులు ఉండేవి కావు. మనిషిని మనిషిగా కూడా గుర్తించలేదు. మహిళలు అయితే బానిసలకే బానిసలుగా బతికారు. స్త్రీలకు నేడు ఆస్తి, విద్య, రిజర్వేషన్లు లభించాయంటే అవి పెరియార్, పూలే, అంబేద్కర్ వంటి మహనీయుల త్యాగాల ఫలితమే. భారతీయ మూలవాసులకు జీవించే హక్కుతో పాటు విద్య, వైద్యం, ఉపాధి, అస్తిత్వం, ఆత్మగౌరవాలు దక్కాయంటే అది రాజ్యాంగం కల్పించిన వరం. 1950 కంటే పూర్వం భూమ్మీద ఎవరికీ చట్టబద్ధమైన హక్కుల్లేవు. అలాంటిది రాజ్యాంగాన్ని అంబేద్కర్ రచించడం కారణంగానే భారతీయ మూలవాసులకు భూమిపై హక్కు పత్రాలు వచ్చాయి.
రాజ్యాంగం ద్వారానే కాస్రా పహణి చట్టబద్ధంగా వచ్చింది. భూమి ఆధారంగా జీవిస్తున్న శూద్రులకు (కమ్మ, రెడ్డి, వెలమ, కాపు తదితరులతో పాటు, బీసీ, ఎస్సీ, ఎస్టీ) భూమిపైన హక్కులు వచ్చాయంటే అందుకు అంబేద్కర్ కృషే కారణం. సమస్త భారతీయులకు సామాజిక న్యాయం దక్కాలని జీవితాంతం పోరాడిన గొప్ప వ్యక్తి అంబేద్కర్. ఎందుకంటే తాను అనుభవించిన అసమానతలతో దేశ ప్రజలు భవిష్యత్తులో ఇబ్బందులు పడకూడదని భావించాడు. వాస్తవానికి ఆయన్ను మనమేం అడగలేదు. ఆయనకు మనం ఎలాంటి వినతిపత్రాలు ఇవ్వలేదు. కానీ, అంబేద్కర్ మాత్రం మనకు సమస్త సమస్యలకు పరిష్కారం చూపించే రాజ్యాంగాన్ని అందించాడు. కోరితే వరాలు ఇస్తారనే వారి ఫొటోలు ప్రతి ఇంట్లో ఉంటాయి. మనం అడగకుండానే వరాలు ఇచ్చిన అంబేద్కర్ను విస్మరించడం వివక్ష కాదా? అందరివాడిని కొందరివాడిగా చిత్రించారు. ఇదే నయా వివక్ష.
రష్యా, అమెరికాలో విఫలమైన రాజ్యాంగం: భారత రాజ్యాంగంలో అభాగ్యులకు, అనాథలకు, పరాజితులకు అవకాశాలతో పాటు అస్తిత్వం, ఆత్మగౌరవం పెంపొందేలా అంబేద్కర్ కృషిచేశారు. సమస్త ప్రజానీకానికి జనాభా దామాషా ప్రకారం సామాజిక న్యాయాన్ని పొందుపర్చారు. ఇది కచ్చితంగా రాజ్యాంగం గొప్పతనమే. ప్రపంచంలోని అనేక దేశాల్లో విఫలమైన రాజ్యాంగాలున్నాయి. సోవియెట్ యూనియన్లో సోషలిస్టు రాజ్యాంగం అనతికాలంలోనే విఫలమైంది.
ఫలితంగానే సోవియట్ యూనియన్ ముక్కచెక్కలైంది. ఆయా దేశాల రాజ్యాంగం.. ఆ దేశాలను ఐక్యంగా ఉంచలేకపోయింది. భారత్లో విభిన్నమైన కులాలు, మతాలు, జాతులు ఉన్నప్పటికీ అనేక సంస్థానాలు కలిసి భారతీయ సమాజంగా ఏర్పడినా భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపడానికి కారణం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగస్ఫూర్తి మాత్రమేనని బలంగా చెప్పగలం. ఇంతటి మహత్తరమైన రాజ్యాంగాన్ని మార్చే కుట్రకు ఆర్ఎస్ఎస్, బీజేపీ, దాని మిత్రపక్షాలు చాపకింద నీరులా ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. ఈ విషయంలో సెక్యులరిస్టులు, అంబేద్కరిస్టులు, ప్రజాస్వామిక వాదులు, అణగారిన సమస్త వర్గాలు ఐక్యంగా మతోన్మాద పార్టీలకు వ్యతిరేకంగా నిలబడాల్సిన చారిత్రక ఆవశ్యకత ఉన్నది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అందుకు ప్రతిజ్ఞ చేద్దాం.
(వ్యాసకర్త: ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకులు)
పీసీ వీరస్వామి
94944 46262