రానున్న ఎన్నికల గురించి ఆలోచించేవాడు రాజకీయ నాయకుడు! రాబోయే తరాల గురించి యోచించేవాడు రాజనీతిజ్ఞుడు. ఒక నాయకుడిని, రాజనీతిజ్ఞుడిగా తీర్చదిద్దేవి దేశభక్తి, ప్రజల పట్ల ప్రేమ, ప్రజా సమస్యలను పరిష్కరించడం, సమాజాన్ని ప్రగతిపథాన నడిపించగల అపార పరిజ్ఞానం! నిరంతర పరిశీలన, అధ్యయనం, అన్వేషణలే అలాంటి జ్ఞానాన్ని సమకూర్చుతాయి!
‘పాలకులకు చదివే తీరికుండదు. కానీ, చదువనివారు ఉత్తమ పాలకులు కాలేరు’ అన్నాడు ప్లేటో. వర్తమాన భారతంలో కొందరు కమ్యూనిస్టు నేతలు తప్ప, జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలలో అధ్యయనం బొత్తిగా కొరవడింది! అందుకే నేడు కుల, మత, ప్రాంతీయ విద్వేషాలతో ఓటర్లను సమీకరించుకోవటం, దేశ సంపదను బడా కార్పొరేట్లకు కట్టబెట్టి, వారిచ్చే నిధుల (క్విడ్ ప్రోకో)తో ఓటర్లు, ఎమ్మెల్యేలను కొనుక్కోవటం, అసాధ్యపు హామీల ఎరతో ఓటర్లకు గాలం వేయటం, అధికార పార్టీ నేతల గోరంత లోపాలను కొండంతలుగా ఊదరగొడుతూ ఉపన్యసించటం, అభాండాలతో అన్య పార్టీ నేతల క్యారెక్టర్ను దెబ్బతీసే సోషల్ మీడియాను పోషించటం, తమను భూతద్దంలో చూపే ప్రధాన మీడియాను కొనుక్కోవటం వగైరా ఎత్తుగడల్లో ఆరితేరిన మాయల మరాఠీలే తప్ప, భారతదేశానికి రాజనీతిజ్ఞులు బొత్తిగా కరువయ్యారు!
అపార ఖనిజాలు, జలాలు, సాగు భూములున్నప్పటికీ ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతంలో నేటికీ, కూడు, గూడు, గుడ్డ, విద్య, వైద్యాలకు దూరమవుతున్న పేదలు కోట్లలో ఉన్నారు. మేధావుల్లారా ఆలోచించండి. సర్దుకుపోవటమే మన కర్తవ్యమా? ఈ నేపథ్యంలోనే కదా, దశాబ్ద కాలం కిందట చావుకు తెగించి పోరాడి, ప్రత్యేక తెలంగాణను సాధించి, ప్రగతిపథాన నడిపించి, నాలుగవ భారతాగ్ర రాష్ట్రంగా రూపొందించారు తెలంగాణ పిత కేసీఆర్.
విద్యుత్తు, వ్యవసాయం, పారిశ్రామిక సంక్షోభాలతో తల్లడిల్లుతున్న తెలంగాణలో, పొట్ట చేతబట్టుకొని పొరుగు రాష్ర్టాలకు వలసలెత్తిన లక్షలాది అభాగ్యులను చూశాం కదా! అలాంటి అణగారిన తెలంగాణకు నేడు, పొరుగు రాష్ర్టాల పేదలు, వ్యాపారులు, బహుళజాతి కంపెనీలు వచ్చి వాలుతున్న సౌభాగ్య తెలంగాణగా తీర్చిదిద్దారు గదా కేసీఆర్. ఆరు దశాబ్దాల్లో గత పాలకులు సాధించిన దానికి రెట్టింపు ప్రగతిని ఆయనెలా సాధించగలిగారు?
గద్దెనెక్కిన దగ్గిరినుంచి ప్రస్తుత కాంగ్రెస్ పాలకుల్లా, గత ప్రభుత్వాల లోపాలనెంచుతూ, గత పాలకులపై అభాండాలు వేస్తూ క్షణాన్ని కూడా వృథా చేయలేదు. నిర్విరామంగా తపస్సు చేశారు. తపస్సంటే… ‘తెలంగాణ ప్రగతి సాధనా మార్గాన్ని దర్శించేదాక మేధో మథనం చేయటం!’ ప్రగతి మార్గాన్ని అన్వేషిస్తూ, ప్రపంచ దేశాలను, నేతలను అధ్యయనం చేశారు కేసీఆర్. తెలంగాణ వ్యవసాయాభివృద్ధికి, విద్యుదుత్పత్తికి భారీగా నిధులను కేటాయించారు. ‘మిషన్ కాకతీయ’ ద్వారా కాకతీయుల నాటి వేలాది చెరువులను పునరుద్ధరించారు. కాళేశ్వరం వంటి బృహత్తర ఎత్తిపోతల పథకాలను చేపట్టారు. తద్వారా తెలంగాణలో భూగర్భ జలాలు పెరిగినయి. నిరంతరం విద్యుత్తు అందటంతో, ఆగి ఉన్న బోరు బావులన్నీ నీళ్లను పరుగెత్తించినయి. సాగునీటితో పంట చేలన్నీ పరవశించినయి. భారీగా ధాన్యం, పశుగ్రాసం పెరగటంతో, పేదలకు సబ్సిడీ, గొర్రెలు, బర్రెలను అందించారు. కోళ్ల పరిశ్రమలకు రాయితీలిచ్చారు. చెరువుల్లో చేప పిల్లల్ని వేయించి పెం చుకోమన్నారు. తద్వారా ధాన్యం, మాంసం, చేపలు, పాల ఉత్పత్తుల్లో తెలంగాణ అగ్రభాగాన నిలిచింది.
‘వృక్షో రక్షతి రక్షితః’ అన్నారు మహర్షులు. ఎందుకంటే? భూ భాగంలో 33 శాతం అడవులుంటేనే, పర్యావరణం, ప్రాణులు క్షేమంగా మనగలుగుతయి. ఈ వాస్తవాన్ని గుర్తించినందుకే 22 శాతానికి పతనమైన అడవులను ‘హరితహారం’ పథకం ద్వారా గ్రామాల్లో నర్సరీల పెంపకం, అడవుల్లోని ఖాళీ ప్రదేశాల్లో పండ్ల చెట్లు నాటించడం ద్వారా 29 శాతానికి పునరుద్ధరించగలిగారు. తద్వారా ఓట్లు పడవని ఆయనకు తెలుసు. తెలంగాణ క్షేమదాయక భవితవ్యం కోసమే చేశారా పని. అందుకే ‘రాజనీతిజ్ఞుడు-కేసీఆర్’ అంటున్నారు విజ్ఞులు. రాజనీతిజ్ఞుడైన కేసీఆర్ తెలంగాణ రాజధాని హైదరాబాద్కు ‘క్లీన్ అండ్ గ్రీన్ సిటీ’ అవార్డును తెచ్చిపెడితే, కేవలం రాజకీయ నాయకుడైన మోదీ భారత రాజధాని ఢిల్లీకి, ప్రపంచాగ్ర కాలుష్యనగరంగా అపఖ్యాతిని తెచ్చిపెట్టారు.
‘విజన్ కలిగిన రాజనీతిజ్ఞుడు కేసీఆర్ దేశాభివృద్ధికి తన విధానాలను స్పష్టీకరించారు. వ్యవసాయాభివృద్ధి ద్వారా భారత పారిశ్రామిక ప్రగతికి దృఢమైన పునాది వేస్తాననన్నారు. ప్రభుత్వ, ప్రైవేటురంగాల మధ్య పోటీని కొనసాగించటం ద్వారా దేశాన్ని ప్రగతి పథాన పరుగెత్తిస్తానన్నారు. భారతదేశ రాష్ర్టాల సమాఖ్యను రాజ్యాంగబద్ధంగా కొనసాగిస్తాననీ ప్రకటించారు. అందుకు సంకేతంగా తన పార్టీని బీఆర్ఎస్గా మార్చుకున్నారాయన. ‘దేశ్ కీ నేతా కేసీఆర్!’ అంటూ భారతదేశమే స్వాగతిస్తున్న తరుణంలో తెలంగాణాభివృద్ధికి ప్రణాళికాబద్ధమైన రహదారిని నిర్మించిన అరుదైన విజినరీ నేత అయిన ఆయనను తెలంగాణ జారవిడుచుకోవటం నిజంగా దురదృష్టకరం.
పాతూరి వేంకటేశ్వరరావు
98490 81889