‘ఆరోగ్యకరమైన రాజకీయ వ్యవస్థ హింసను ప్రోత్సహించదు. అలాంటి సమాజం హింసను సహించదు. కానీ నేడు భారతీయ సమాజంలో హింసాత్మక అల్లర్లు సంస్థాగత వ్యవస్థగా రూపొందినయ్’ అన్నారు రాజనీతి శాస్త్రవేత్త పాల్ ఆర్ బ్రాస్- ఆ మాటలు నిజమేనని బీజేపీ డబులింజన్ సర్కారు పాలనలో జరుగుతున్న సంఘటనలు నిరూపిస్తున్నాయి.
ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురుచూడకండి. లేవండి, చేయీ చేయీ కలిపి నడుద్దాం! కర్ణాటకలో కుల, మత, పార్టీలకతీతంగా, వివిధ ప్రజాసంఘాలు సామాజిక శ్రేయోభిలాషులంతా కలిసినడిచారు. మత విద్వేష రాజకీయాలను నిరసించండని ప్రబోధిస్తూ కర్ణాటకను కాపాడుకున్నారు! వారి మార్గాన ఆసేతు హిమాచల పర్యంతం, మతవిద్వేష రాజకీయాలను నిరసిస్తూ మన దేశాన్ని మనమే కాపాడుకుందాం.
భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు ముందు ఉద్దేశపూర్వకంగానే హింసాత్మక ఎత్తుగడలను చేపడుతున్నది. దేశభక్తి మేలి ముసుగులో, మత ఘర్షణలు సృష్టించి తద్వారా వచ్చే సానుభూతితో, మెజారిటీ మతస్థుల పోలరైజేషన్తో ఎన్నికల్లో లబ్ధి పొందటాన్ని ఆనవాయితీగా మార్చుకున్నది. ఇంటర్నెట్ నిలిపివేశాం గనుక తమ అల్లర్లను దేశం, ప్రపంచం చూడలేదనుకుంటున్నది మోదీ ప్రభుత్వం. ‘అందరి అంతరంగాలను సర్వాంతర్యామి సదా చూస్తూనే ఉంటాడు’ అన్న గీతా ప్రబోధాన్ని ‘అంతరంగమందు అపరాధములు చేసి, మంచివాని వలెను మనుజుడుండ, ఇతరు లెరుగకున్న, ఈశ్వరుడెరుగడా?’ అంటూ విశదీకరించాడు ప్రజాకవి వేమన.
ఉదాహరణకు.. 1.ఇంటర్నెట్ను ఆపేయడంలో భారత నెం-1 స్థానంలో ఉన్నదన్న విమర్శను, జీ-20 సమావేశాల్లోనే ఎదుర్కొన్నారు మోదీ. 2. మోదీ ప్యారిస్లో అడుగుపెట్టబోయే ముందుగానే ‘మణిపూర్ హింసాకాండ పట్ల ఆందోళన వెలిబుచ్చుతూ, అందుకు కారకులైన కొందరు బీజేపీ నేతల వ్యవహారాన్ని తీవ్రంగా తప్పుబడుతూ యురోపియన్ యూనియన్ (ఈయూ) తీర్మానం చేసింది. 3. అమెరికన్ సెనేటర్లు కొందరు, ఆ విషయంపై భారత ప్రధానిని నిలదీయాలని బైడెన్కు సంయుక్తంగా లేఖ రాశారు. 4.మణిపూర్ అత్యాచార సంఘటనలను ‘వాషింగ్టన్ పోస్ట్ ’ మొదలైన అమెరికా, బ్రిటన్ పత్రికలు పతాక శీర్షికన ప్రచురించాయి. 5. మణిపూర్ హింసాకాండ పూర్వాపరాలను పరిశీలించిన ‘అశోక్ స్వైన్’ అనే స్వీడన్ ప్రొఫెసర్ ‘మణిపూర్ సీఎం బిరేన్సింగ్, 2002 నాటి మోదీ గుజరాత్ మాడల్ను అనుసరిస్తున్నాడు. అందులో భాగంగానే.. మణిపూర్ మైనారిటీ కుకీ ఆదివాసీ క్రైస్తవులపై మెజారిటీ మెయితీ మూక దాడులకు గేట్లు తెరిచాడు. తత్ఫలితంగా వేలాది గ్రామాలు, వందలాది చర్చీలు భస్మమయ్యాయి. 148 మంది చనిపోయారు, వేలాది మంది క్షతగాత్రులయ్యారు. నిరాశ్రయులైన 60 వేలమంది కొండ, కోనల్లో తలదాచుకుంటున్నారు. మైనారిటీలపై జుగుప్సాకరమైన సామూహిక అత్యాచారం మెజారిటేరియన్ల ఆయుధంగా రూపొందింది. బీజేపీ పాలనలో’ అంటూ విశ్లేషించారు.
ఈ హింసకు మూలమేమిటో తెలియని అమాయకులు నిరుపేద మెయితీ, కుకీ, నాగాలు స్త్రీ, బాల, వృద్ధులు. శరణార్థుల శిబిరాలలో ఆకలి తీర్చుకుంటున్నారేమో గాని, సానిటరీ, మందులు, పౌష్టికాహారలేమితో, అరకొర వసతులతో అల్లాడుతున్నారు. ఈనేపథ్యంలో జుగుప్సాకరమైన అశ్లీల వీడియో వైరలయ్యాక, ఆసేతుహిమాచల పర్యంతం భారతీయులు, ముఖ్యంగా భారతదేశ, హైందవ పరిరక్షకునిగా మోదీని ఆరాధిస్తున్నవారే సిగ్గుతో తలవంచుకొని ఇలా వాపోతున్నారు.
శ్రీరాముడు మాకు ఆదర్శమంటున్న బీజేపీ పాలనలో ‘రామరాజ్యం’ కాకున్నా ఫర్వాలేదు, కానీ రావణ, దుర్యోధన, దుశ్శాసన రాజ్యం కన్నా, అవమానకరంగా రూపొందింది భారత్! రావణుడు స్త్రీని అపహరించాడు కానీ తాకలేదు. దుర్యోధన, దుశ్శాసనులు స్త్రీని వివస్త్రను చేశారు కానీ, అత్యాచారం చేయలేదు. ‘బేటీ బచావో! బేటీ పడావో’ అంటూ గొప్పగా నినదించిన నరేంద్ర మోదీ, బీరేన్సింగ్ వగైరాల డబులింజన్ సర్కారు పాలనలో కఠువా, ఉన్నావ్, హత్రాస్, మణిపూర్లలో మృగాలు కూడా సిగ్గుపడేలా స్త్రీలపై సామూహిక అత్యాచారం చేసి హతమార్చారు. బిల్కిస్ బానో వంటి గర్భిణీ స్త్రీని కూడా పైశాచికంగా అత్యాచారం చేసి, ఆమె కూతురిని రాక్షసంగా హతమార్చారు! అట్టి నికృష్టులను, క్షమాభిక్ష పేరిట విడుదల చేసి, హారతులతో స్వాగతించి, దండలతో సన్మానిస్తుంటే చూస్తుండిపోయారు భారత ప్రధాని. ‘ప్రజాస్వామ్య దేవాలయ’మని మోదీ చెప్తున్న పార్లమెంటు భవనం ముందుకొచ్చి ‘మోదీజీ, మీ బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ మమ్మల్ని లైంగికంగా వేధిస్తున్నాడు. దయచేసి అతన్ని శిక్షించి, మమ్ము రక్షించ’మని వేడుకున్నారు దేశానికి అంతర్జాతీయ ‘కీర్తి పతకాల’ను సాధించిన మహిళా రెజ్లర్లు. వారిని పోలీసులు ఈడ్చుకెళ్తుంటే, కనీసం ప్రపంచం కోసమైనా ఖండించలేదు మోదీ.
ఇక మణిపూర్లో రక్షకభటుల ముందే మహిళలను నగ్నంగా ఊరేగించారు, అడ్డుకున్నవాళ్ల తండ్రిని, తమ్మున్ని హతమార్చారు. సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారు మెయితీలు. వాళ్ల క్రూరత్వానికి బలైన వారిలో, భారత మాజీ సైనికుని భార్య కూడా ఉన్నది. ‘కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి శత్రుమూకల బారినుంచి నా దేశాన్ని కాపాడుకోగలిగాను, నేడు నా భార్యతో సహా మరో ఇద్దరు మహిళలను లాక్కెళ్తున్న మెయితీ హిందూ మూకల బారినుంచి కాపాడుకోలేకపోయా’నంటూ కన్నీళ్లు కార్చాడు ఆ సైనికుడు. మెయితీలు, కుకీలు, నాగాలు మేమంతా దేశం కోసం ‘అసోం రెజిమెంట్లో’ కలిసి పోరాడిన వీర సైనికులం. నేడు తగులబడుతున్న నా మణిపూర్లో నా ప్రజలంతా కాలిపోతున్నారు. అయినా సరే, నా రాష్ట్రంతో సహా నా దేశ రక్షకుడైన ప్రధాని నరేంద్ర మోదీ కనీసం నోరెత్తటం లేదంటూ’ ధారాపాతంగా కన్నీరు కార్చాడు ఓ మాజీ కల్నల్.
మణిపూర్ వెళ్లిన నిజ నిర్ధారణ కమిటీ, కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, స్థానికులు, జాతీయ, అంతర్జాతీయ పరిశీలకుల మాటల సారాంశం ఇదీ.. ‘మణిపూర్కు విద్వేషపు నిప్పంటించి, ఆ మంటలు ఆరకుండా ఆజ్యం పోస్తున్నది బీజేపీ డబులింజన్ సర్కారే. తద్వారా వాళ్లు నెరవేర్చుకోదల్చుకున్న లక్ష్యాలివీ…
1. బీజేపీ పాలనలో కొందరు కార్పొరేట్ల సిరులు అంబరాన్నంటినా, కోట్లాది ప్రజల ఆదాయాలు పాతాళానికి, అన్నింటి ధరలు ఆకాశానికి చేరటం దేశ మెరిగిన సత్యం. అందుకు దేశంతో పాటు మెయితీలతో సహా, మణిపూర్ ప్రజలందరిలోనూ బీజేపీ పట్ల ఆగ్రహం పెల్లుబుకింది. మెయితీ మహిళలు బీజేపీ పీడబ్ల్యూడీ మంత్రి ఇంటిని తగలబెట్టటం వాళ్ల ఆగ్రహానికి పరాకాష్ఠ. రానున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా, వాళ్ల ఆగ్రహాన్ని, బీజేపీపై నుంచి దారి మళ్లించటం. 2.కుకీలను టార్గెట్ చేసి, మత విద్వేషాన్ని రెచ్చగొట్టి 55 శాతం మెజారిటీ మెయితీ ఓటర్ల పోలరైజేషన్తో తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవటం బీరేన్సింగ్ లక్ష్యం. 3.మణులు, వజ్రాలతో సహా 42 రకాల విలువైన ఖనిజాలున్న మణిపూర్ పర్వత భూములపై బీజేపీ ఆత్మీయ కార్పొరేట్ల కన్నుపడింది. వాళ్ల దురాశను నెరవేర్చేందుకు అక్కణ్నుంచి కుకీ ఆదివాసులను వెళ్లగొట్టాలి. కార్పొరేట్లకు ఖనిజ భూములను అప్పగించేందుకు అక్కడి గిరిజనులపై దాడులు చేయించటం బీజేపీ-ఆర్ఎస్ఎస్ల నైజం. మోదీ హయాంలో ఛత్తీస్గఢ్, ఒడిశా, నేడు మణిపూర్ గిరిజనులపై జరుగుతున్న దాడులే అందుకు నిదర్శనాలంటున్నారు పరిశీలకులు.
మెయితీలకు ఎస్టీ హోదా రాకపోవటమే వాళ్ల బాధలకు కారణం అన్న బీజాన్ని నాటి వాళ్ల ఆగ్రహాన్ని బీజేపీ నుంచి, కుకీల మీదికి మళ్లించారు. ఎస్టీ హోదా కోసం మెయితీలను కోర్టుకెక్కించారు. ఆ దిశగా పరిశీలించమని హైకోర్టు బీరేన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్ర ఆదివాసీ మంత్రిత్వశాఖ తక్షణం సానుకూలంగా స్పందించింది. అదే సమయాన కుకీలు మయన్మార్ నుంచి వలస వచ్చిన సంచారజాతులవారే కానీ, భారతీయ ఆదివాసీలు కారన్న దుష్ప్రచారాన్ని బీజేపీ హోరెత్తించింది. నాడు బ్రిటిష్ వారు పర్వత ప్రాంత కుకీలకు ఎస్టీ హోదానిచ్చి, మైదాన మెయితీలకివ్వకుండా, పరస్పర ద్వేషాన్ని రగిలించారని, అందుకే ఇప్పుడైనా మెయితీలకు ఎస్టీ హోదా ఇవ్వాలంటూ తమ ఆర్గనైజర్ పత్రిక ద్వారా ఆర్ఎస్ఎస్ విస్తృతంగా ప్రచారం చేసింది.
వీహెచ్పీ కూడా ‘హిందూ విశ్వ’ పత్రికలో అలాగే రాసి, దానికి కుకీ క్రైస్తవులు పలు హైందవ దేవాలయాలను కూల్చారన్న అభాండాన్ని జోడించి, మెయితీ హిందువుల్లో మతవిద్వేష జ్వాలలను రేపాడు మిళింద పాండే. ఇవన్నీ ప్రణాళికాబద్ధంగా చకచకా జరిగాయంటున్నారు పరిశీలకులు.
ఇక బీరేన్సింగ్ ఏకపక్షంగా కుకీల గ్రామాలతో సహా పలు పర్వత భూములను రిజర్వు ఫారెస్టుగా ప్రకటించటం, ఆక్రమణలన్న నెపంతో వాళ్ల గ్రామాలను ఖాళీ చేయిస్తాననటం, మణిపూర్లో ఎన్ఆర్సీని అమలుచేస్తాననటం ఆదివాసీలను తీవ్ర అభద్రతాభావానికి గురిచేశాయి.
సీఎం బీరేన్సింగ్, రాజ్యసభ సభ్యుడు లెక్షింబసంజో రహస్య సమాలోచనల ద్వారా రెండు మెయితీ తీవ్రవాద గ్రూపులను రెచ్చగొట్టి, మే నెలలో జరగబోయే విధ్వంసకాండకు ముందస్తు ప్రణాళికను సిద్ధం చేశారన్నది స్థానికుల ఆరోపణ. అందుకు నిదర్శనాలు.. 1. ఆ తీవ్రవాద గ్రూపులు, పోలీస్ స్టేషన్ల నుంచి ఆయుధాలను సమకూర్చుకోవటం, 2. పోలీసుల కనుసన్నల్లోనే వాళ్లకు శిక్షణ ఇప్పించటం, 3. కుకీ తెగకు చెందిన డైరెక్టర్ జనరల్ (సీనియర్ ఐపీఎస్)ను బదిలీ చేయించటం, 4. ఆ తర్వాత సీనియరైన అతని తమ్మున్ని కాదని త్రిపురలోని ఐపీఎస్ను నియమించటం, 5. అమిత్ షా వచ్చి దయచేసి మీరు కొల్లగొట్టిన ఆయుధాలను తిరిగివ్వండని అభ్యర్థించి మిన్నకుండటం, 6.ఆయుధాలను కొల్లగొట్టిన మెయితీల గ్రామాలనొదిలేసి కుకీ ఆదివాసీల గ్రామాల్లో ఆయుధాలున్నవంటూ వారి ఇండ్లల్లో సోదాలు చేయించటం ఇవన్నీ బీరేన్సింగ్ మీది ఆరోపణలను రుజువు చేస్తున్నాయి. అంతేగాదు పోలీసుల మద్దతుతోనే హింసాకాండ విజృంభించిందని బీజేపీ ఎమ్మెల్యేలే బహిరంగంగా ఆరోపించారు. ఇంఫాల్లో 9 మంది ఎమ్మెల్యేల ఇండ్లపై జరిగిన దాడులకు భీతిల్లిన వాళ్లు ‘ఈ బీరేన్సింగ్ సీఎంగా ఉన్నంతకాలం ఈ దాడులు ఆగవు బాబోయ్’ అంటూ వాపోయారు. 2 నెలల్లోనే 375 చర్చీలు, పలువురు పాస్టర్ల ఇండ్లు, కార్యాలయాలను ధ్వంసం చేశారు. అయినా ఏమీ చేయలేక నిరసిస్తూ తన పదవికి రాజీనామా చేశాడు బీజేపీ ఉపాధ్యక్షుడు వన్మ్ చుంగ. ‘మణిపూర్లో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. నా ఇల్లే తగలబడిందంటే, ఇక సామాన్యుల గతేంటి?’ అని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ‘రాజ్కుమార్ రంజన్సింగ్ వాపోయాడు. సీఎం బీరేన్సింగ్ వత్తాసుతో పోలీస్ కనుసన్నల్లోనే మణిపూర్ మండుతుంటే, ఇక ఈ మంటలు ఆర్పగలిగేవారు ఎవరంటూ పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు ఆక్రోశించారు.
కాబట్టి భారతీయ సహోదరులారా! ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురుచూడకండి. లేవండి, చేయీ చేయీ కలిపి నడుద్దాం! కర్ణాటకలో కుల, మత, పార్టీలకతీతంగా, వివిధ ప్రజాసంఘాలు సామాజిక శ్రేయోభిలాషులంతా కలిసినడిచారు. మత విద్వేష రాజకీయాలను నిరసించండని ప్రబోధిస్తూ కర్ణాటకను కాపాడుకున్నారు! వారి మార్గాన ఆసేతు హిమాచల పర్యంతం, మతవిద్వేష రాజకీయాలను నిరసిస్తూ మన దేశాన్ని మనమే కాపాడుకుందాం. మేలుకోండి భారతీయులారా, మేలుకో భారత్.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
పాతూరి వేంకటేశ్వరరావు
98490 81889