భారతదేశం 150 కోట్ల జనాభాతో చైనాను మించి పోయింది. ఈ మొత్తం జనాభాలో 90 శాతం మంది, సాధారణ, మధ్యతరగతి, నిరుపేద వర్గాలకు చెందినవారే. వీరికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వాలు ప్రజా పంపిణీ వ్యవస్థను ఏర్పాటుచేసి రేషన్ షాపులు నెలకొల్పాయి. దేశ ఆహారవ్యవస్థను పటిష్ఠపరిచేందుకు ఎఫ్సీఐ, ఎస్ఎఫ్సీ వంటి సంస్థలను ఏర్పాటు చేసింది. అయితే భారతదేశ ఆహారపంపిణీ వ్యవస్థను రద్దుచేయాలని కేంద్రంపై కార్పొరేట్ శక్తులు ఒత్తిడి తెస్తున్నాయి.
దేశంలో ఉత్పత్తి అయ్యే ఆహార పదార్థాలను రైతులకు గిట్టుబాటు ధర చెల్లించి సేకరించాల్సిన బాధ్యత కేంద్రానిది. వాటిని తక్కువ ధరలకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు సరఫరా చేయాల్సింది కూడా కేంద్రమే. కానీ ఈ వ్యవస్థను రద్దు చేయాలని కేంద్రం ప్రయత్నిస్తున్నది. శివసేన, బీజేపీ అధికారంలో ఉన్న మహారాష్ట్రలో వెనుకబడ్డ జిల్లాలైన మరఠ్వాడ, విదర్భ ప్రాంతాల్లోని 14 జిల్లాలు, పుదుచ్చేరి, ఛండీగఢ్, దాద్రానగర్ హావేలి కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రజాపంపిణీ వ్యవస్థను నిలిపివేశారు. దాని స్థానంలో లబ్ధిదారులకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) పేరుతో రూ.150లు వారి ఖాతాలో జమచేస్తున్నారు. ఇదే విధానాన్ని దేశమంతా అమలుచేయాలని కేంద్రం ప్రయత్నిస్తున్నది. దీనివల్ల పేదలకు ఆహారపదార్థాలు అందక వారు ఆకలితో అలమటించాల్సి వస్తున్నది. ఇప్పటికే గృహావసరాల వంటగ్యాస్ సిలిండర్పై సబ్సిడీ ని రద్దు చేసిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల ద్రవ్యోల్బణం పెరిగి సామాన్యు ప్రజలు బతుకలేకపోతున్నారు.
కాబట్టి, కేంద్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్ఠపరిచి అన్నిరకాల ఆహార పదార్థాలు తక్కువ ధరకు అందించాలి. ఆహార, వ్యవసాయరంగాలను బలహీనపరిచేందుకు మోదీ సర్కార్ మూడు వ్యవసాయ నల్ల చట్టాలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఆ చట్టాలను రద్దుచేయాలని రైతులు పెద్ద ఎత్తున పోరాటాలు చేయడంతో ప్రభుత్వం వెనుకకు తగ్గి చట్టాలను రద్దు చేసింది. ఇప్పుడు కూడా అదే తరహాలో ప్రజలు ఉద్యమిస్తే తప్ప కేంద్ర ప్రభుత్వం దిగిరాని పరిస్థితి నెలకొన్నది.
-ఆళవందార్ వేణు మాధవ్
86860 51752