Stalin | తమిళనాడు రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత, ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంపై డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. ప్రస్తుత ప్రభుత్వం ఎక్కువ కాలం అధికారంలో కొనసాగుతుందా లేదా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. తమిళనాడులో దాదాపు ఆరు దశాబ్దాలుగా డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలే రాజకీయాలను శాసించాయి. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమిళగ వెట్రి కజగం విజయం సాధించి అధికారంలోకి రావడం రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక మలుపుగా భావించబడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పడి కొద్దికాలమే అయినప్పటికీ, దాని పనితీరుపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల వీసీకే మాజీ ఎమ్మెల్యే పనైయూర్ బాబు తన అనుచరులతో కలిసి డీఎంకే పార్టీలో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్టాలిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి పరిస్థితుల్లో పనిచేస్తోందో ప్రజలందరికీ తెలుసు. ప్రభుత్వం ఏర్పడిన సమయంలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. కనీసం ఆరు నెలల పాటు ప్రభుత్వంపై బహిరంగ విమర్శలు చేయకూడదని భావించాను. కొత్త ప్రభుత్వం పనిచేసే అవకాశం ఇవ్వాలని అనుకున్నాను. కానీ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే ఆరు నెలలు పూర్తయ్యే వరకు వేచి ఉండగలనో లేదో అనుమానం కలుగుతోంది అని స్టాలిన్ అన్నారు.
అంతేకాకుండా ప్రభుత్వం భవిష్యత్తుపై కూడా ఆయన సందేహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ ప్రభుత్వంపై అనేక విమర్శలు వస్తున్నాయి. ప్రజల్లోనూ అసంతృప్తి పెరుగుతోందని వినిపిస్తోంది. ఇప్పుడు చర్చ ఆరు నెలలు, ఐదు నెలలు లేదా నాలుగు నెలల గురించి కాదు. అసలు ఈ ప్రభుత్వం మరో మూడు నెలలైనా నిలబడుతుందా లేదా అన్నదే ప్రధాన ప్రశ్న అంటూ స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యల ద్వారా ప్రభుత్వం అంతర్గతంగా సమస్యలను ఎదుర్కొంటోందని స్టాలిన్ పరోక్షంగా సూచించినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే దీనిపై టీవీకే నేతలు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే కార్యక్రమంలో డీఎంకేలో కొత్తగా చేరిన నేతలు, కార్యకర్తలకు స్టాలిన్ కీలక సూచనలు చేశారు. తాము గతంలో పనిచేసిన పార్టీలపై అనవసర విమర్శలు చేయవద్దని ఆయన సూచించారు. రాజకీయాల్లో ప్రత్యర్థులను గౌరవించే సంస్కృతి ఉండాలని పేర్కొన్నారు.