ప్రభుత్వాల మార్పునకు, జనాభిప్రాయం కాసింత అటూ ఇటూ ఒరిగేందుకు దోహదపడే అంశాలెన్నో ఉంటాయనేది బుద్ధి జీవులందరికీ తెలిసిన వాస్తవమే. పొరపాట్లు, ఏమరుపాట్లే కాదు, క్షేత్రస్థాయిలో ప్రజా నాడిని ప్రభావితం చేసే కారకాలు కూడా అనేకం.
Telangana | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 2 శాతం ఓట్ల తేడా, రాజకీయ చైతన్యశీలురందరిలో భిన్న భావాలను కలిగించింది. ఆలోచనపరుల పొలిటికల్ పోస్ట్మార్టంలు కొనసాగుతుండగానే, ‘కొత్త సర్కార్ కొలువుదీరింది. అది కుదురుకోవడానికి ఆరు నెలల సమయం ఇవ్వాలి కదా?, అప్పుడే విమర్శలు విడ్డూరం’ అని కొందరు, ‘నడక మొదలుపెట్టగానే తప్పటడుగులు వేస్తుంటే ప్రశ్నించకుండా ఆరు నెలలు అభ్యుదయవాదులు మౌనవ్రతం పాటిస్తే అర్థం ఉంటుందా?’ అని మరికొందరు అంటున్నారు. ఎవరి నాయకత్వంలోని ప్రభుత్వమైనా ఏం వాగ్దానం చేసి పగ్గాలను చేతుల్లోకి తీసుకుంది, ఎటువైపు నడిపేందుకు సమాయత్తమై కదులుతున్నదనేదే మనందరం జాగ్రత్తగా గమనించాల్సింది. నిలదీయడానికి అమృత గడియల కోసం ప్రగతి కాముకులు ఎదురుచూస్తే ఎలా? లేచిందే లేడికి పరుగు అన్నట్టుగా రేవంత్ రెడ్డి సర్కార్ పరుగులు పెడుతున్నా, దాని ప్రతి చర్యా మనకొక సందేశాన్ని, కోడికూతలా మేలుకొలుపు శబ్దాన్ని అందిస్తున్నది. నిజానికి ఆరున్నర దశాబ్దాల తండ్లాట నుంచి బయటపడి, తెలంగాణ ఎంతోదూరం అడుగులు వేసింది.
రిజర్వ్ బ్యాంక్ హ్యాండ్బుక్తో పాటు నీతి ఆయోగ్, నేషనల్ క్రైం బ్యూరో రికార్డ్స్ ఇలా ఏ జాతీయ ప్రామాణిక గణాంకాలు గమనించినా దశాబ్దంలోనే రాష్ట్రం సాధించిన వాస్తవాలు మనకందరికీ అర్థమవుతాయి. తలసరి ఆదాయమైనా, జీఎస్డీపీ అయినా, జీవన ప్రమాణాలు, మౌలిక వసతులతో పాటు తాగు, సాగునీటి రంగాల్లో, సాగు, పారిశ్రామిక వ్యవస్థల్లో ఎంత పురోగతిని తెలంగాణ రాష్ట్రం సాధించిందనేది కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాలే తేటతెల్లం చేశాయి. అది మరిచి ఎన్నికల ప్రచారంలో అనుసరించే మొరటుతనాన్ని పీఠమెక్కిన తర్వాత పాలనలోనూ నాయకులు ప్రదర్శిస్తే ప్రజల మనసు చివుక్కుమనదా? ప్రభుత్వాలు మారినా అవి ప్రజాస్వామ్యానికి కొనసాగింపు మాత్రమే కదా? ప్రజాభిప్రాయానికి తలవంపులు తేని దారిలో కొత్త సర్కార్ అడుగులు పడితేనే మార్పునకు అర్థం ఉంటుంది. అలాంటి దిశలో రేవంత్రెడ్డి ప్రభుత్వం నడక మొదలుపెట్టిందా అంటే ప్రశ్నార్థకమే..?
విపక్షంలో ఉన్నప్పుడు ప్రగతిభవన్ నిర్మాణంపై ఆరోపణలు చేశారని, సీఎం నివాస భవంతిగా ఉపయోగించుకోవడం లేదు సరే మరి నూతన సచివాలయ నిర్మాణాన్నీ తప్పుబట్టారు కదా? తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవ ప్రతీకలుగా నిలిచేందుకు నిర్మించిన ప్రగతిభవన్, సచివాలయం, అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్థూపాలను కూడా, ఎన్నికల ముందటి రాజకీయ ప్రకటనల దృష్టికోణంతోనే చూడటంలో వివేకం కనపడుతుందా అనేది అందరూ ఆలోచించాలి. ప్రమాణ స్వీకారం తర్వాత అమరుల స్థూపాన్ని, అంబేద్కర్ స్మారక స్థూపాన్ని సందర్శించి నివాళులు అర్పించేందుకు మనసు రాకపోవడం ఆవేదన కలిగించేదే కదా! అంతెందుకు ప్రమాణ స్వీకార సభలో ‘జై తెలంగాణ’ నినాదమే బంగారమైపోయింది. తొలి అడుగుల్లోనే తెలంగాణ ఆశించేది ఉక్రోషాన్ని కాదు, ఉన్నతమైన ధోరణిని అనేది ప్రస్తుత పాలకులు అర్థం చేసుకోవాలి. ‘ప్రగతిభవన్’ పేరు ‘పూలే ప్రజాభవన్’గా మార్చి అందులో ప్రభుత్వాధినేత ఉండటానికి ఇష్టపడకపోతే ఆ చర్య ఇస్తున్న సందేశమేమిటి? అంబేద్కర్ సచివాలయాన్ని కూడా కేసీఆర్ ప్రభుత్వం ఆధునిక దేవాలయంలా నిర్మిస్తుంటే తప్పుపట్టారు, మరి అందులో కొలువుదీరారెందుకు? పూలే ప్రజాభవన్ పేరు మార్పు హడావుడి పక్కనపెడితే నిజానికి ప్రగతి అనే పేరులోనే సామాజిక పురోగతి కోసం అమరులైన పూలే, అంబేద్కర్తో సహా అందరి పేర్లు, ఆశయాలు ఇమిడి ఉన్నాయి. ప్రగతి భవన్ గేట్ల తొలగింపు దగ్గరి నుంచి, పాతవి చెరిపెయ్యాలనే తొందరలో అభాసుపాలయ్యే పనులు అవసరమా అనే కోణంలో కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి. అధికారంలోకి రావడానికి ఏ మార్గంలోనైనా నడిచి వచ్చి ఉండవచ్చు. కానీ, పాలనా పీఠాన్ని అలంకరించిన తర్వాత నిర్మాణాత్మక దృక్పథం ఉంటే రేపటితరాలు కూడా కీర్తిస్తాయనే సత్యం అవగాహనలో ఉండాలి కదా!
ముందుచూపున్న ఏ సర్కార్ అయినా పది తరాలకు పనికొచ్చేలా నిర్మాణాలు చేస్తుంది. ఆ నిర్మాణాలకు ప్రాంత వైభవం అద్దుతుందే కానీ, దరిద్రాన్ని కాదు. ఆ మాటకొస్తే వందల ఏండ్ల కిందటే అత్యద్భుత నిర్మాణాలు చేసిన నిజాం నవాబులు, నేటికీ మనకు ఉపయోగపడే భవనాలు నిర్మించి తప్పులు చేశారా? పాలకుల దృష్టికోణం రేపటి వైపుంటేనే చరిత్రకు దారి పడుతుంది. ఒకటో, రెండో పొరపాట్లు దొర్లని ప్రభుత్వాలు చరిత్రలో ఉండనే ఉండవు. వాటినే గెలకాలనుకునే నూతన సర్కార్ల ఆలోచన తీరే హాస్యాస్పదమవుతుంది. ఏ కొరత లేనివిధంగా కేసీఆర్ ప్రభుత్వమే అన్నీ సమకూర్చిన తర్వాత కొత్త వాహనాల కొనుగోలు, నూతన నిర్మాణాలు చేపట్టి దుబారా చెయ్య మనే సీఎం రేవంత్రెడ్డి ప్రకటనకు అర్థం ఉంటుందా? వర్తమానం, భవిష్యత్తు అవసరాల మేళవింపుతోనే బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనా విధానాలు అమలు జరిగాయి. ఆ దిశలోనే ప్రగతిభవన్, అంబేద్కర్ సచివాలయం, జిల్లా కలెక్టరేట్లు నిర్మించబడ్డాయి.
పాలన ప్రజల ముంగిట సాగిలపడటానికే నూతన జిల్లాలు, మండలాలు, గ్రామ పంచాయతీలు ఏర్పాటుచేయబడ్డాయి. విపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంపై మోపిన నిందలను నిజం చేయడానికి రేవంత్రెడ్డి సర్కార్ శ్రమిస్తున్న తీరు బుద్ధిజీవుల్లో ఆవేదన కలిగిస్తున్నది. చివరికి శాసనసభలో గవర్నర్ ప్రసంగాన్ని నిందల చుట్టూ తిప్పడం విడ్డూరమే కదా! ఏం చేయబోతున్నారో చెప్పింది గోరంతైతే, బీఆర్ఎస్ ప్రభుత్వంపై చల్లిన బురద కొండంత. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేసిన రైతు, బడుగువర్గాల అభివృద్ధి పథకాల కొనసాగింపు, కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు చట్టబద్ధతతో పాటు ప్రజల అనుభవంలోకి తెచ్చే నిర్దిష్ట కార్యాచరణను శాసనసభ సాక్షిగా గవర్నర్ ప్రసంగంలో ఆశించినవారికి నిరాశను, నిందలనే వడ్డించారు. నిన్నటి దారిలో నడవడం ఇష్టం లేకపోతే మరో దివ్యమైన దారిని పరుచుకొని నడవాలే కానీ, వేసిన దారిని ఎగతాళి చేయడానికే సర్వశక్తులు వెచ్చిస్తే ఎలా? కాలం ఎంత విలువైనదో కాంగ్రెస్ పాలకులకు తెలియనిదేం కాదు. వారి చేతుల్లో ఉన్న వర్తమానాన్ని వెలుగుల కోసం వాడకపోతే మళ్లీ చీకటి గుహలోకే దుంకుతారు.
ప్రగతిభవన్ అంశం దగ్గరినుంచి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల భద్రత చర్యల ఉపసంహరణ వరకూ చివరికి ఎంతోమంది మహామహులకు ఎదురునిలిచి రాష్ట్రం సాధించడంతోపాటు, పదేండ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్కు అధికారంలోకి వచ్చి 10 రోజులు గడవకముందే భద్రతాచర్యలు నామమాత్రం చేయడం పగతనానికి ప్రతీకగా నిలుస్తుందే కానీ, పేరు తెచ్చిపెడుతుందా?
పాత ప్రభుత్వంలో సేవలందించిన కాంట్రాక్టు,ఔట్సోర్సింగ్ ఉద్యోగులనూ తొలగిస్తూ జీవో ఇవ్వడం ఎన్ని కుటుంబాలను ఇబ్బందుల పాలు చేస్తుందో ఆలోచించరా? పగ ధోరణి అనేక మంది ప్రభువులను చరిత్రలో దోషులుగా నిలబెట్టింది. ప్రగతిపథంలో సాగిన పాలకులకు ప్రజల గుండెల్లో కొలువుదీరే ఉన్నతస్థానం కల్పించింది. ఏది ఆశించి అడుగులు వేస్తున్నామనే వివక్ష కరువైతే వ్యవస్థకు ఉరితాడు పేనడమే అవుతుంది.
గత ప్రభుత్వంపై నెట్టే ఏ నిందకైనా బాధ్యత ఆ పదేండ్ల మంత్రిమండలిది అవుతుందే కానీ, వ్యక్తిగతంగా కేసీఆర్ది కాదు కదా? గత సర్కార్లో మంత్రులుగా పనిచేసిన తుమ్మల, జూపల్లిలు నేటి రేవంత్రెడ్డి మంత్రి వర్గంలోనూ కొలువై ఉన్నారు. చేతిలో అధికారాన్ని నిన్నటికి మసిపూయడానికి కాకుండా రేపటికి దారులెయ్యడానికి ఉపయోగిస్తే కాంగ్రెస్ సర్కార్ కూడా మంచి ప్రభుత్వాల సరసన నిలుస్తుంది. ఆ దారి తప్పి భిన్నంగా ప్రవర్తిస్తే పాత పేరునే హస్తం పార్టీ సార్థకం చేసుకుంటుంది. ఏ దిశలో నడవాలనుకుంటున్నారో ఈ పది రోజుల చర్యలు చెప్పకనే చెప్తున్నాయి.
-డాక్టర్ ఆంజనేయ గౌడ్
(రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్)