బుడి బుడి అడుగుల వయసులోనే మారథాన్ గెలిచారన్న వార్త ఎప్పుడైనా విన్నామా? కానీ తెలంగాణ విషయంలో మాత్రం ఇది నూటికి నూరుపాళ్లు అక్షర సత్యం. కేవలం తొమ్మిదేండ్లలోనే తెలంగాణ సాధించిన ఘనతలు అమోఘం, సాధించిన కీర్తి అనిర్వచనీయం. కారణం ఉద్యమ నాయకుడైన పరిపాలకుడికి రాష్ర్టాభివృద్ధిపై ఉన్న చిత్తశుద్ధి, లక్ష్య సాధనకు అవసరమైన సమగ్ర ప్రణాళిక. గత పాలకుల్లో లోపించింది ఇదే.
తెలంగాణ సాధించిన ప్రగతిని ప్రపంచం వేనోళ్లా పొగడుతున్నది. పెట్టుబడుల స్వర్గధామంగా తెలంగాణను కీర్తిస్తున్నారు. భౌగోళిక అనుకూలతలకు తోడు అత్యద్భుతమైన మౌలిక వసతులు కల్పిస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం. పారిశ్రామిక రంగం పరుగులు పెడుతున్నది. పల్లెలు, పట్టణాలు బాగుపడ్డాయి. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరంతో విశ్వ ఖ్యాతి సాధించాం. వలసలతో విలవిలలాడిన పాలమూరు నేడు కృష్ణమ్మ పరవళ్లతో పులకించిపోతున్నది. సంక్షేమంలో తెలంగాణను మించిన మనసున్న సర్కారు ఈ భూ ప్రపంచంలోనే ఎక్కడా లేదు! ప్రతీ రంగంలో తెలంగాణ సర్కారు పథకాలు ఓ మైలురాయిలా దేశానికి ఓ దిక్సూచిలా నిలుస్తున్నాయి. ఇదంతా కేవలం 9 ఏండ్లలో సాధించిన ఘనత మాత్రమే.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లవుతున్నా.. ఏనాడూ తెలంగాణలో ఇంతటి వృద్ధి, ఆర్థిక సమృద్ధి కనిపించలేదు. తెలంగాణలో చెరువులు, రిజర్వాయర్లు, డ్యామ్లు పడావుబడ్డ దుస్థితిని మనం కళ్లారా చూశాం. ఉరికొయ్యకు వేలాడిన అన్నదాతల కన్నీటి గాథలను చూశాం. బతుకు నడవక.. తాను నేసిన దారాలను తాడుగా పేని ఉరితాడుగా మార్చుకున్న నేతన్నల గోసను చూశాం. అలాగని ఈ ప్రాంతానికి పాలకులు లేరా, బడ్జెట్ కేటాయింపులు లేవా అంటే.. అన్నీ ఉన్నాయి. అయినా 2014కు ముందు వరకు అవే కష్టాలు. కానీ 2014 తర్వాత అకస్మాత్తుగా పరిస్థితులు మారిపోయాయి. బీడుబారిన చెరువులు, రిజర్వాయర్లు, డ్యాములు జలకళతో తొణికిసలాడటం మొదలుపెట్టాయి. బీడువారిన నేలల్లో బంగారం పండుతున్నది. ఈ ప్రాంతాన్ని గతంలో, ప్రస్తుతం పరిశీలించిన మేధావులు, సెలబ్రిటీలు, పెట్టుబడిదారులు చెప్తున్న మాట ఇది.
మరి ఇదంతా ఎలా సాధ్యమైంది? తెలంగాణ అంటే ఇప్పుడో బ్రాండ్గా ఎందుకు మారింది? గతంలో ఈ ప్రాంతాన్ని చాలా పార్టీలు దశాబ్దాల పాటు పాలించాయి. ఇప్పుడు ఉన్నట్టుగానే అప్పుడూ ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. ఉద్యోగులు అప్పటివాళ్లే.. రాజకీయ నాయకులు అప్పటివాళ్లే. అప్పుడూ ఇప్పుడూ ఒకే రకమైన పాలనా వ్యవస్థ ఉంది. మరి ఈనాడు ఈ అభివృద్ధి ఎలా సాధ్యపడింది? అనే ప్రశ్న చాలాసార్లు నా మదిని తొలిచింది. బాగా ఆలోచిస్తే తట్టిన విషయం ఏంటంటే.. కేవలం మారిందల్లా పాలించే నాయకుడు. త్రికరణ శుద్ధితో పనిచేసే ఓ కార్యసాధకుడు ఇప్పుడు మన ముందుకు వచ్చారు. రాష్ర్టాన్ని బాగు చేసుకోవాలనే తపన, ప్రజల జీవితాలు మార్చాలనే సంకల్పం, నా ప్రాంతం గురించి విశ్వమంతా చర్చించుకునే స్థాయికి ఎదగాలనే ఆకాంక్షతో చిత్తశుద్ధితో ప్రభుత్వ వ్యవస్థను కేసీఆర్ సరైన దారిలో నడిపించారు.
కేసీఆర్ ఏ మంత్రం వేయలేదు.. ఏ మాయాజాలం చేయలేదు. కానీ రాష్ర్టాభివృద్ధికి స్పష్టమైన ప్రణాళికను రూపొందించుకున్నారు. రాష్ట్రం ఏర్పడితే ఏం చేయాలనే దానిపై 2014కు ముందే అనేకమంది మేధావులతో చర్చించి.. ఓ స్పష్టమైన అవగాహనకు వచ్చారు. చేయాల్సిన పనులపై బ్లూ ప్రింట్ తయారు చేసి పెట్టుకున్నారు. రాష్ట్రం గురించి స్పష్టమైన అవగాహన సాధించారు. ఎక్కడ ఏ సమస్య ఉంది? ఎక్కడ లోపం ఉంది? దేన్ని సరిచేస్తే రాష్ట్రం బాగుపడుతుంది? ఇలా ప్రతీ అంశంపై సూక్ష్మస్థాయిలో అవగాహనతో రాష్ట్ర శ్రేయస్సు, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తొమ్మిదిన్నరేండ్లుగా అహర్నిశలు పనిచేస్తూనే ఉన్నారు. మన లక్ష్యంలో, ఆలోచనలో చిత్తశుద్ధి ఉంటే.. ఆ దేవుడు కూడా మన వెంటే ఉంటాడని అన్ని మత గ్రంథాలు చెప్తున్నాయి. కేసీఆర్ ఆలోచనంతా రాష్ట్ర ప్రజల బాగోగుల గురించే కాబట్టి దేవుడు కూడా ఆయన వెంటే ఉన్నారు. ఫలితంగా నేడు తెలంగాణ పచ్చబడింది. పల్లే కన్నీరు పెడుతుందో, నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకి అనే పాటలు పోయి.. పల్లె మురుస్తున్నదనే పాటలు వినిపిస్తున్నాయి. అభివృద్ధిలో రాష్ట్రం పరుగులు పెడుతున్నది. పొరుగు రాష్ర్టాలకు రోల్ మాడల్ అయ్యింది. ప్రపంచ దేశాల పెట్టుబడులకు కేరాఫ్ అయ్యింది.కానీ ఆనాడు దశాబ్దాల పాటు పాలించిన పార్టీలకు, ఆ పార్టీల నాయకులకు గానీ ఈ చిత్తశుద్ధి లేదు.
ప్రియములేని విందు పిండివంటల చేటు
భక్తిలేని పూజ పత్రి చేటు
పాత్ర మెఱుగనీవి బంగారు చేటురా
విశ్వదాభిరామ! వినుర వేమ!
ఈ పద్యంలో చెప్పినట్టుగా ఈ ప్రాంతంపై ఆనాటి పాలకులకు ప్రేమ లేదు. ఈ ప్రాంతాన్ని బాగు చేయాలనే శ్రద్ధ లేదు. మొత్తంగా ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి లేదు. ఎంతసేపూ తమ బొక్కసాలు నింపుకోవడం తప్పితే.. బుక్కెడు బువ్వ దొరక్క అల్లాడుతున్న బిడ్డలను పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ పరిస్థితులను కేసీఆర్ స్వయంగా చూశారు. అనుభవించారు. అందుకే నడుం బిగించి ఉద్యమాన్ని నడిపించారు. నేడు నాయకుడై రాష్ర్టాన్ని ప్రగతి పథంలోనూ పరుగులు పెట్టిస్తున్నారు. రాష్ట్రం సిద్ధించగానే సంబరపడిపోలేదు. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో కేసీఆర్ తరుచూ ఓ మాట చెప్తూ ఉండేవారు. ‘రాష్ట్ర ఏర్పాటుతోనే అంతా అయిపోలేదు. లక్ష్య సాధనలో ఒక మెట్టు మాత్రమే ఎక్కాం. మనం చేయాల్సిన పని ఇప్పుడే మొదలవుతున్నది. తెలంగాణ అభివృద్ధే మన ముందున్న అసలు సవాల్’ అని. ఒక పోటీలో గెలవాలంటే.. లక్ష్యాన్ని స్పష్టంగా నిర్దేశించుకుని పనిచేయాలి. అప్పుడే అందులో విజయం సాధిస్తాం. కేసీఆర్ అదే పని చేశారు. పల్లేర్లు మొలిచిన నేలను బంగారుమయం చేశారు. ఆయనే ఒక్కరే కాదు.. యావత్ రాష్ట్రం ఆనందంగా ఉండేలా చేశారు. అత్యున్నత శిఖరాలను చేరుకోవడమే లక్ష్యంగా నేడు రాష్ర్టాన్ని అడుగులు వేయిస్తున్నారు. పొగడ్తలకు పొంగిపోయి, సాధించిన దానికి సంతృప్తి చెంది ఊరుకునే వ్యక్తి కాదు కేసీఆర్. ఆయన నిత్య కృషీవలుడు. మనం చేసే పనిలో మంచి కనిపించాలి కానీ మనం కనిపించకూడదు అని కోరుకునే వ్యక్తి ఆయన. అందుకే నేడు రాష్ట్రం ఇంత సుభిక్షంగా ఉన్నది.
(వ్యాసకర్త: చైర్మన్, తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ)
-వై.సతీష్ రెడ్డి
96414 66666