లండన్ : తాను చెత్తబుట్టలో పడవేద్దామనుకున్న ఉంగరం రూ 20 కోట్ల విలువైన 34 క్యారెట్ల డైమండ్ రింగ్ అని గుర్తించిన ఓ బ్రిటన్ మహిళ కంగుతింది. కొన్నేండ్ల కిందట ఈ రింగ్ను కొనుగోలు చేసిన మహిళ (70)కు అప్పట్లో దీని విలువ గురించి అవగాహన లేదు. కాస్ట్యూమ్ జ్యూవెలరీతో కలిసిఉన్న ఈ రింగ్ను చెత్తబుట్టలో పడేయాలని మహిళ అనుకోగా పొరుగింటి వ్యక్తి సూచనతో దీని విలువను కనుగొనాలని నిర్ణయించుకుంది. ఇతర సాధారణ జ్యూవెలరీతో కలిపి ఓ బాక్స్లో ఈ ఉంగరాన్ని మహిళ తీసుకువచ్చారని నార్త్ షీల్డ్స్లోని పిటోంబీ ఆక్షనీర్స్కు చెందిన మార్క్ లేన్ వివరించారు.
పౌండ్ కాయిన్ కంటే పెద్దదైన భారీ స్టోన్ ఈ రింగ్లో ఉందని ఇది సీజడ్ అనుకున్నానని, డైమండ్ టెస్టర్ మెషీన్తో పరీక్షించేవరకూ మూడు రోజుల పాటు ఈ రింగ్ తన టేబుల్పై ఉందని ఆయన చెప్పుకొచ్చారు. బెల్జియంకు చెందిన నిపుణులు ఇది 34 క్యారెట్ డైమండ్ అని తెలపడంతో దాన్ని లండన్లోని తమ భాగస్వాములకు పంపామని తెలిపారు. ఈ ఆభరణాన్ని మహిళ ఎప్పుడు, ఎక్కడ కొన్నారో స్పష్టంగా చెప్పలేకపోయారని అన్నారు. అత్యంత ఖరీదైన, విలువ కలిగిన ఈ రింగ్ను నవంబర్ 30న వేలం వేస్తామని తెలిపారు. అప్పటివరకూ దీన్ని లండన్ డైమండ్ క్వార్టర్ హాటన్ గార్డెన్స్లో అత్యంత భద్రత నడుమ ఉంచుతామని చెప్పారు.