నమస్తే తెలంగాణ నెట్వర్క్: రాష్ట్రాన్ని ముసురు కమ్మేసింది. రాష్ట్రవ్యాప్తంగా రెండ్రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. మంగళవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. బుధ, గురువారాల్లో కూడా రాష్ట్రంలో భారీనుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం బలహీనపడింది. దీనికి అనుబంధంగా ఉన్న ద్రోణి దక్షిణ ఒడిశా నుంచి ఉత్తర కోస్తాంధ్ర మీదుగా కొనసాగుతూ మధ్యస్థ ట్రోపోస్పియర్ స్థాయివరకు వ్యాపించింది. దీని ప్రభావంతో బుధవారం ఉదయం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ కేంద్రం తెలిపింది. మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, జనగామ, యాదాద్రి భువనగిరి, నారాయణపేట, మహబూబ్నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురువొచ్చని పేర్కొన్నది. గురువారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అతి భారీ, పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని అంచనావేసింది. రాష్ట్రంలో వాగులు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల తాత్కాలికంగా రాకపోకలకు అంతరాయం కలిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టులోకి భారీగా వరద చేరుతుండటంతో నాలుగు గేట్లను అడుగు మేర ఎత్తి 2,695 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. భద్రాచలం వద్ద గోదావరి లో వరద నీరు పెరుగుతున్నది. గోదావరి నీటిమట్టం.. మంగళవారం సాయంత్రం 7 గంటలకు 16.1 అడుగులకు చేరింది.
అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో హైదరాబాద్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం రాత్రి నుంచి మంగళవారం రాత్రి వరకు ఎడతెరపి లేకుండా పడుతున్నాయి. మంగళవారం కంచన్బాగ్లో అత్యధికంగా 2.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మూడ్రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురువొచ్చని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 13 : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలకళ సంతరించుకొంటున్నది. మహారాష్ట్రలో సీజన్ ప్రారంభం నుంచి కురుస్తున్న వానలతో విష్ణుపురి, బాలేగావ్, బాబ్లీ ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. విష్ణుపురి నుంచి వస్తున్న వరదకు తోడు స్థానికంగా కురుస్తున్న వర్షాలతో ఎస్సారెస్పీకి 50 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతున్నది. 24 గంటల్లోనే ప్రాజెక్టులోకి 10 టీఎంసీల నీరు చేరినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 1078.50 అడుగుల వద్ద 48.449 టీఎంసీల నీరున్నట్టు వెల్లడించారు. కాళేశ్వరం భాగంగా నిర్మించిన లక్ష్మీబరాజ్కు 63,740 క్యూసెక్కుల ఇన్ఫ్లో.. 44,730 క్యూసెక్కుల ఔట్ఫ్లో నమోదయ్యింది. సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టులోకి మూడు టీఎంసీల వరద వచ్చింది. ప్రాజెక్టు పూర్తినీటి సామర్థ్యం 523.600 మీటర్లకు ప్రస్తుతం ప్రాజెక్టులో 520.934 మీటర్ల వద్ద 17.982 టీఎంసీల నీరున్నది. మరోవైపు, కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు 945 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతున్నది. జలాశయం పూర్తి సామర్థ్యం 100.855 టీఎంసీలకుగాను 36.312 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. ఆర్డీఎస్ ఆనకట్టకు ఎగువనుంచి 350 క్యూసెక్కుల వరద చేరుతుండగా సుంకేసుల బరాజ్కు 685 క్యూసెక్కులు చేరుతున్నట్టు కర్ణాటక జేఈ శ్రీనివాస్ తెలిపారు.