సింగపూర్ : కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ముఖానికి మాస్క్ ధరించడం అత్యంత కీలకం. పౌరుల ప్రాణాలను నిలబెట్టే మాస్క్ ధరించడంలో ఇప్పటికీ పలువురు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. కరోనా నిబంధనలను కఠినంగా పాటించే సింగపూర్లో ఓ వ్యక్తి మాస్క్ ధరించకుండా రైలు ప్రయాణం సాగించాడు. కేవలం గంటలోపే అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు న్యాయస్ధానం ఆదేశాల మేరకు అతడిని మానసిక వైద్యశాలకు తరలించారు.
బ్రిటిష్ జాతీయుడైన బెంజమిన్ గ్లెయిన్ మాస్క్లు కొవిడ్-19 సోకకుండా మనల్ని కాపాడలేవని నమ్ముతూ మాస్క్ ధరించకుండానే సింగపూర్లోని తన కార్యాలయానికి ఈ ఏడాది మేలో రైలులో బయలుదేరాడు. ప్రయాణం సాగిన కొద్దిగంటల్లోనే గ్లెయిన్ (40)ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.
మాస్క్ ధరించకపోవడం సహా ఆయనపై పలు అభియోగాలు నమోదు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు గ్లెయిన్ను మానసిక వైద్యశాలకు తరలించి చికిత్స అందించాలని సూచించింది. కాగా తనపై తప్పుడు అభియోగాలు నమోదు చేశారని కోర్టు దర్యాప్తు సరైన తీరులో లేదని గ్లెయిన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.