కొచ్చి : కేరళ వ్యాపారి తన వద్ద 22 ఏండ్లుగా పనిచేస్తున్న ఓ ఉద్యోగికి ఏకంగా రూ 45 లక్షల విలువ చేసే బ్రాండ్ న్యూ మెర్సిడెస్ బెంజ్ను బహుమతిగా అందించాడు. కేరళలో కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, హోం అప్లయన్సెస్ రిటైలింగ్ సంస్ధ మైజీ యజమాని ఏకే షాజి తనవద్ద రెండున్నర దశాబ్ధాలకు పైగా పనిచేస్తున్న సీఆర్ అనీష్కు ఈ మెగా ఎస్యూవీని ప్రెజెంట్ చేసి ఉద్యోగిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. మైజీని స్ధాపించక ముందే దీర్ధకాలంగా అనిష్..షాజీ వెన్నంటి నిలిచాడు.
కంపెనీలో మార్కెటింగ్, బిజినెస్ డెవలప్మెంట్ వంటి పలు విభాగాల్లో అనిష్ పనిచేశారు. అనిష్ ప్రస్తుతం మైజీ చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. తాను మైజీ ప్రారంభించకుముందు నుంచే గత 22 ఏండ్లుగా అనిష్ తనతో ఉన్నాడని, ఆయన తన కుడిభుజంలా ఉంటూ నిరంతరం చేదోడు వాదోడుగా నిలిచాడని షాజీ చెప్పుకొచ్చారు. తను ఎన్నడూ తనను నిరుత్సాహపరచలేదని, పనిపట్ల అతడు కనబరిచే శ్రద్ధ, అంకితభావం తనను ఆకట్టుకుంటాయని అన్నారు.
అనిష్ను ఉద్యోగిలా కాకుండా భాగస్వామిలా చూస్తానని షాజీ ఇన్స్టాగ్రాంలో రాసుకొచ్చారు. ఉద్యోగి హార్డ్వర్క్ను గుర్తించి ప్రోత్సహించిన తీరు బాగుందని షాజీని పలువురు నెటిజన్లు ప్రశంసించారు. సరైన లీడర్ అంటే ఇలాగే వ్యవహరిస్తాడని ఓ యూజర్ కామెంట్ చేయగా, ఉద్యోగి సేవలు, విశ్వసనీయతను గుర్తించే ఇలాంటి వ్యక్తి దగ్గర పనిచేయడం సంతోషకరమని మరో యూజర్ కామెంట్ చేశాడు. యజమానులు ఎలా ఉండాలనే దానికి ఇతరులకు మీరు ఆదర్శంగా నిలిచారని మరో నెటిజన్ షాజీపై ప్రశంసలు గుప్పించాడు. రెండేండ్ల కిందట షాజీ ఆరుగురు ఉద్యోగులకు కార్లు బహుకరించాడు. తన ఉద్యోగులు కొందరిని ఆయన ఉచిత విదేశీ టూర్లకూ పంపించారు.