చెన్నై : కరోనా వ్యాక్సినేషన్ పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు చెన్నైకి చెందిన ప్రకటనల ఫిల్మ్ మేకర్, విజువల్ కమ్యూనికేషన్ ప్రొఫెసర్ ఇమ్మానుయేల్ రాబిన్సన్ ఓ పాటను రూపొందించాడు. కరోనా మహమ్మారితో తాను ప్రేమించే పలువురు వ్యక్తులు, స్నేహితులను కోల్పోయిన ఇమ్మానుయేల్ కొవిడ్-19పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు పాటను విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడు. లాక్డౌన్ సమయంలో ప్రజలకు ఆహారం అందించడం వంటి పలు సేవలతో ఔదార్యం చాటిన ఐదుగురు కొవిడ్ యోధులను కొనియాడుతూ ఆయన ఈ పాటను ప్రజల ముందుకు తీసుకువచ్చాడు.
కరోనా విజృంభించిన సమయంలో ధైర్యంగా సేవలందించిన వారిని హైలైట్ చేయడంతోపాటు మరింత మంది ప్రజలు సాయం చేసేందుకు ముందుకొచ్చేలా పాటను రూపొందించామని ఆయన చెప్పుకొచ్చారు. మహమ్మారి కోరలుచాచిన సమయంలో తాము 4000 మందికి ఆహారం సమకూర్చామని, కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో 1200 మందికి పైగా వ్యాక్సిన్లు వేయించామని, పలు కొవిడ్ కేంద్రాల్లో అవసరమైన వారికి 50కిపైగా ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేశామని చెప్పారు. ప్రజలు మాస్క్లు ధరించడంతో పాటు వ్యాక్సిన్ వేసుకునేలా, తోటివారికి సాయపడేలా ఈ పాట వారిలో స్ఫూర్తి నింపుతుందని ఇమ్మానుయేల్ చెప్పారు.