చెన్నై : కస్టమర్ కోరిన విధంగా హెయిర్ కట్ చేయకపోవడం చెన్నైకి చెందిన ఐటీసీ మౌర్య హోటల్కు చుక్కలు చూపింది. ఫైవ్స్టార్ హోటల్ సెలూన్లో హెయిర్ ప్రొఫెషనల్ నిర్లక్ష్యంతో మహిళ తీవ్ర మానసిక వేదనకు లోనైందని అంటూ ఆమెకు రూ 2 కోట్ల పరిహారం చెల్లించాలని జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ (ఎన్సీడీఆర్సీ) హోటల్ను ఆదేశించింది. ఫిర్యాదిదారు, 42 ఏండ్ల మహిళ ఓ కీలక ఇంటర్వ్యూకు ముందు హెయిర్ కట్ కోసం 2018 ఏప్రిల్ 18న హోటల్ సెలూన్కు వెళ్లింది. వెనుక నాలుగు ఇంచ్లు కట్ చేయాలని హెయిర్ డ్రెస్సర్ను ఆమె కోరగా మొత్తం జుట్టు కత్తిరించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.
తాను ధరించిన కళ్లజోడును తీసివేశారని, తల వంచమని హెయిర్ డ్రెస్సర్ కోరడంతో అద్దంలో తనకేమీ కనిపించలేదని, మొత్తం జుట్టును ట్రిమ్ చేసిన తర్వాతే తాను గమనించలేకపోయాయనని ఆమె వాపోయారు. ఆపై తల భాగం నుంచి కేవలం నాలుగు ఇంచ్ల హెయిర్ను మాత్రమే మిగల్చడంతో మహిళ కంగుతిన్నారు. ఆపై సెలూన్ తనకు క్షమాపణ చెప్పినా నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెయిర్ డ్రెస్సర్పై ఎలాంటి చర్య తీసుకోలేదని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై తాను సెలూన్ జనరల్ మేనేజర్ను సంప్రదించగా అతడు తన పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపించారు. గతంలో వీఎల్సీసీ, ప్యాంటిన్ వంటి బ్రాండ్లకు ప్రచారకర్తగా చేసిన ఫిర్యాదుదారు టాప్ మోడల్ కావాలనుకున్నారని, కానీ ఆమె పొడవాటి జుట్టును కత్తిరించడంతో ఆమె తన కలను నెరవేర్చుకోలేకపోయారని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.
సెలూన్ నిర్లక్ష్యంతో ఆమె తీరని మనోవ్యధకు లోనవడమే కాకుండా, పని ప్రదేశంలో మెరుగైన సామర్ధ్యం కనబరచలేకపోయిందని తెలిపింది. సెలూన్ నిర్వాకంతో సీనియర్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ ఉద్యోగాన్ని కోల్పోయిందని కోర్టు పేర్కొంది. ఆమె సూచనలకు భిన్నంగా హెయిర్ కట్ చేయడంతో ఫిర్యాదుదారు తన అసైన్మెంట్లను కోల్పోయి భారీ నష్టం చవిచూడటంతో పాటు టాప్ మోడల్ కావాలన్న ఆమె ఆకాంక్ష నెరవేరలేదని కోర్టు స్పష్టం చేసింది. ఆమెను తీవ్ర మానసిక క్షోభకు గురిచేసినందుకు మహిళకు రూ 2 కోట్ల పరిహారం చెల్లించాలని ఐటీసీ మౌర్యను కోర్టు ఆదేశించింది.