హైదరాబాద్ : సింగపూర్ ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ సంస్థ ప్రధాన కార్యనిర్వాహకవర్గ సభ్యురాలు, రచయిత్రి రాధిక మంగిపూడి రచించిన నూతన కవితా సంపుటి ‘నవ కవితా కదంబం’ సంపుటిని హైదరాబాద్ రవీంద్రభారతి వేదికపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు.
ఈ సభలో గౌరవ అతిథులుగా పాల్గొన్న అలనాటి సినీనటి డా జమున రమణారావు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కెవి రమణచారి, మాజీ కేంద్ర మంత్రి టి సుబ్బరామిరెడ్డి, దర్శకులు రేలంగి నరసింహారావు, మండలి బుద్ధప్రసాద్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, డా. ఎ గురవారెడ్డి, పలు విదేశీ తెలుగు సంస్థల ప్రతినిధులు రాధికను అభినందించి ఆశీస్సులు అందించారు.
వచన కవితలు, ఛందోబద్ధ పద్యాలు, నానీలు, హైకూలు, మణిపూసలు, సమ్మోహనాలు, గేయకవితలు మొదలైన 9 ప్రక్రియలు పొందుపరచబడిన ఈ కవితా సంపుటి వంశీ ఆర్ట్ థియేటర్స్ వారు ప్రచురించగా.. శుభోదయం గ్రూప్స్ చైర్మన్ డా. కలపటపు శ్రీలక్ష్మీప్రసాద్ తొలి ప్రతి అందుకున్నారు.
ప్రముఖ సినీ కవులు సుద్దాల అశోక్ తేజ, భువనచంద్ర, ఆచార్య ఎన్ గోపి, డా. తెన్నేటి సుధా దేవి ఈ పుస్తకానికి ముందుమాట అందించగా.. ప్రచురణకర్తగా డా. వంశీ రామరాజు రాధికను అభినందించారు. ఈ పుస్తకాన్ని రాధిక తన పుట్టిల్లు కొటికలపూడి కుటుంబ రచయితలకు అంకితం ఇచ్చారు.
శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్, ఇతర కార్యవర్గ సభ్యులు, సింగపూర్ స్నేహితులు రాధికకు అభినందనలు తెలిపారు. ‘ఎందరో సినీ దిగ్గజాలు, ప్రముఖ రచయితల సమక్షంలో వెంకయ్యనాయుడు తన పుస్తకం ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందని,’ రాధిక నిర్వాహకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.