హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితిగా అవతరించడం పట్ల బీ(టీ)ఆర్ఎస్ ఎన్ఆర్ఐ కువైట్ శాఖ హర్షం వ్యక్తం చేసింది. 2001లో టీఆర్ఎస్ను స్థాపించిన ఉద్యమనేత కేసీఆర్.. అలుపెరుగని పోరాటంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని టీఆర్ఎస్ కువైట్ శాఖ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల అన్నారు. ఎనిమిదేండ్ల టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ సాధించిన అభివృద్ధి, పేదలకు అందుతున్న సంక్షేమ పథకాలతో దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలిచేలా సీఎం కేసీఆర్ చేశారని వెల్లడించారు.
ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులు దృష్ట్యా పక్కా విజన్, గట్టి పట్టుదల, దృఢ సంకల్పం ఉన్న కేసీఆర్ నాయకత్వం దేశానికి ఎంతో అవసరమని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి చేసినట్లుగానే భారత్ను కూడా ప్రపంచంలోనే తిరుగులేని దేశంగా తీర్చిదిద్దుతారాన్న విశ్వాసం ఉందని ధీమా వ్యక్తంచేశారు. విజయ దశమి రోజున బీఆర్ఎస్ను ప్రారంభించారు కాబట్టి విజయం తథ్యమని, టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కువైట్ కమిటీ తరపున తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు.