సింగపూర్ : సింగపూర్ ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ సంస్థ రెండు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా కార్యవర్గ సభ్యులందరూ కలిసి ‘మా రెండేళ్ల ప్రయాణం’ అనే కార్యక్రమం నిర్వహించారు.
సింగపూరు తెలుగు సౌరభాలను విశ్వవ్యాప్తంగా విరజల్లుతూ, సంస్థ స్థాపించిన మొదటి రోజు నుంచి సింగపూర్లో నిక్షిప్తమైన తెలుగు సాహితీ సంపదను, కళాకారులను, సాహితీ వేత్తలనూ వెలుగులోనికి తెస్తూ ఎందరో తెలుగు ప్రముఖులచేత కొనియాడబడుతున్న సంస్థ ‘శ్రీ సాంస్కృతిక కళాసారధి’.
సాంకేతికపథంలో నడుస్తూ ప్రాచీన తెలుగు సంస్కృతి, ఆధ్యాత్మిక, కళారంగాలకు చెందిన విన్నూత్న కార్యక్రమాలను ప్రపంచ నలుమూలలకూ చేరేలా నిర్వహించడం ఈ సంస్థ ప్రత్యేకత. సంస్థ వ్యవస్థాపకుడు కవుటూరు రత్నకుమార్, కార్యవర్గ సభ్యులు రాధిక మంగిపూడి, ఊలపల్లి భాస్కర్, చామిరాజు రామాంజనేయులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అనుభవాలను అందరితో పంచుకున్నారు.
తమ రెండేళ్ల ప్రస్థానంలో తమ సంస్థను కలుపుకొని ప్రోత్సహించిన వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, వంశీ ఇంటర్నేషనల్, తానా, మలేషియా తెలుగు సంఘం, రాష్ట్రేతర తెలుగు సమాఖ్య, వీధి అరుగు నార్వే, దక్షిణాఫ్రికా తెలుగు సంఘం, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ మొదలైన ప్రపంచవ్యాప్త సంస్థలకు, వారి నిర్వాహకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. తమకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
సమన్వయకర్తగా సుబ్బు వి పాలకుర్తి వ్యవహరించగా..గణేశ్న రాధాకృష్ణ, కాత్యాయని నిర్వహణలో ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయబడింది. ఈ కార్యక్రమాన్ని కింది లింక్లో చూడొచ్చని నిర్వాహకులు తెలిపారు.