Bathukamma Celebrations | లండన్: తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్ డమ్(టాక్) ఆధ్వర్యంలో లండన్లో చేనేత బతుకమ్మ – దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాలకు యూకే నలుమూలల నుండి రెండు వేలకుపైగా ప్రవాస భారతీయ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక హౌంస్లౌ నగర మేయర్ అమీ క్రాఫ్ట్ , తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ , టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం పాల్గొన్నారు.
గత కేసిఆర్ నాయకత్వంలో చేనేతకు చేయూతనిస్తూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన విషయం మనందరికీ తెలిసిందే. అదే స్పూర్తితో రాష్ట్ర మాజీ మంత్రి కేటీఆర్ కృషికి మా వంతు బాధ్యతగా చేనేతకు చేయూతనిస్తూ ప్రతీ సంవత్సరం లాగా నేడు కూడా వేడుకలను ‘చేనేత బతుకమ్మ, దసరా’గా జరుపుకున్నామని టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల తెలిపారు.
తెలంగాణ ఎన్నారైలంతా సమాజ సేవలో..
హౌంస్లౌ నగర మేయర్ అమీ క్రాఫ్ట్ మాట్లాడుతూ …యూకేలో నివసిస్తున్న తెలంగాణ ఎన్నారైలంతా సమాజ సేవలో ఎంతో క్రియాశీలకంగా పాల్గొంటారని, వీరి స్ఫూర్తి చాలా గొప్పదని తెలిపారు. విదేశాల్లో ఉన్నప్పటికీ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్తున్న తీరు చాలా గొప్పగా ఉందని టాక్ సంస్థను చూసి గర్వపడుతున్నామని తెలిపారు.
టాక్ సంస్థ చేస్తున్న కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తినిస్తున్నాయని ప్రశంసించారు. స్థానికంగా ఎటువంటి సహాయం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చని, లండన్ నగరం భిన్న సంస్కృతుల ప్రజలు నివసించే నగరమని, మనమంతా ఐకమత్యంగా ఉండి పరస్పర సంప్రదాయాలని సంస్కృతిని గౌరవించుకుంటూ ముందుకు వెళ్లాలని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ఎఫ్డీసీ మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. నేడు ఈ వేడుకలకు టాక్ సంస్థ కార్యకర్తగా మన తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చెయ్యాలనే సంకల్పంతో పాల్గొనడం జరిగిందని, ముందుగా తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. లండన్ గడ్డపై ఎత్తిన జెండాను దించకుండా అది రాజకీయ వేదికలైనా, సామాజిక సంస్థలకు సంబంధించిన వేదికలైనా ప్రపంచానికే స్ఫూర్తిగా, ఆదర్శంగా టాక్ కార్యవర్గం నిలిచిందని వారందరిని ప్రత్యేకంగా అభినందించారు.
విజయవంతం చేసిన అతిథులకు, ప్రవాస బిడ్డలకు, సహకరించే ప్రతీ ఒక్కరికి అనిల్ కూర్మాచలం కృతఙ్ఞతలు తెలిపారు.టాక్ తలపెట్టిన ప్రతీ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేసి ప్రవాస సమాజంలో టాక్ ప్రత్యేక గుర్తింపుని పొందిందని టాక్ ఉపాధ్యక్షురాలు శుష్మున తెలిపారు. మా పిలుపు మేరకు హాజరైన ప్రవాసులు చేనేత బట్టలు ధరించి పాల్గొనడం మాకెంత సంతోషాన్ని మరియు స్ఫూర్తినిచ్చిందని ప్రధాన కార్యదర్శి సుప్రజ పులుసు తెలిపారు.
ఉపాధ్యక్షుడు సురేష్ బుడగం మాట్లాడుతూ.. దసరా పండుగ సందర్బంగా స్వదేశం నుండి తెచ్చిన జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన దసరా అలాయ్ – బలాయ్ కార్యక్రమంలో భాగంగా చేనేత శాలువాలను ఒకరికొరకు పరస్పరం వేసుకొని, జమ్మి ( బంగారం) ని ఇచ్చి పుచ్చుకొని శుభాకాంక్షలు తెలుపుకొని, చేనేతకు చేయూతగా వీలైనన్ని సందర్భాల్లో చేనేత బట్టలు దరిస్తామని ప్రతిజ్ఞ చేశారు. జమ్మి ఆకులు పంచుకుంటూ లండన్ పట్టణానికి ‘అలాయ్ బలాయ్’ తెలంగాణ స్నేహమాధుర్యాన్ని ప్రత్యక్షంగా రుచి చూపించారని ఈ సందర్భంగా పలువురు ప్రశంసించారు. తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ మరియు దసరా పండగ సందర్బంగా మహిళలందరు భక్తిశ్రద్ధలతో సాంప్రదాయ బద్దంగా గౌరీ దేవికి పూజలు జరిపి బతుకమ్మ ఆట పాటలతో, కోలాటాల నృత్యాలతో, చప్పట్లు కలుపుతూ, రంగు రంగుల బతుకమ్మలతో సందడి చేసారు.
నేత కుటుంబాలకు మేలు జరగాలని కోరుతూ
విదేశాల్లో స్థిరపడ్డా కానీ తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ పాటలు పాడటం అందరిని ఆకట్టుకుంది. చిన్నారులు సైతం ఆటల్లో పాల్గొనడం కాకుండా, చిన్న చిన్న బతుకమ్మలతో సంబరాలకు కొత్త అందాన్ని తెచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులతోపాటు ప్రవాస సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. చేనేత పేరుతో బతుకమ్మ వేడుకల్ని నిర్వహించడం వినూత్నంగా ఉందని, వీరి ప్రయత్నం ఫలించి నేత కుటుంబాలకు మేలు జరగాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తెలంగాణ ప్రత్యేకతను చాటి చెప్పేలా బతుకమ్మ ను ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తునందుకు టాక్ సంస్థను పలువురు అభినందించారు.
టాక్ కన్వీనర్ అశోక్ గౌడ్ దూసరి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాతే మన పండగలకు, మన సంస్కృతికి సరైన గౌరవం గుర్తింపు లభించిందని, కాబట్టి కేసీఆర్ పేరు చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుందని తెలిపారు. బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని చేనేతకు చేయూతగా చేస్తున్న వేడుకల్లో ఎంతో సామాజిక బాధ్యత ఉందని తెలిపారు.
ఉద్యమ బిడ్డలుగా ప్రతీ కార్యక్రమానికి సామాజిక బాధ్యతను జోడించి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అన్నింటిని ప్రోత్సహించి విజయవంతం చేస్తున్న ప్రవాసులందరికి టాక్ అడ్వైసరీ బోర్డు చైర్మన్ మట్టా రెడ్డి, టాక్ ఈవెంట్స్ ఇంచార్జి మల్లారెడ్డి కృతఙ్ఞతలు తెలిపారు.
టాక్ కన్వీనర్, ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి మాట్లాడుతూ.. టాక్ సంస్థ ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా మన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయడానికి అన్నిరకాలుగా కృషి చేస్తామని తెలిపారు. హాజరైన అతిథులందరికీ తెలంగాణ పండగ భోజనాన్ని స్పాన్సర్ చేసిన నాగరాజు తౌటం ని టాక్ సంస్థ ప్రత్యేకంగా సన్మానించి గౌరవించారు.
టాక్ ఉపాధ్యక్షడు, ప్రధాన కార్యదర్శి రాకేష్ పటేల్, సత్యపాల్ రెడ్డి పింగళి మాట్లాడుతూ… గతంలో ఎన్నో సందర్భాల్లో నాగరాజు టాక్ సంస్థకు వివిధ సహాయ సహకారాలు అందించారని, అలాగే ఎల్లపుడూ దాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేసి వారికి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. టాక్ కార్యదర్శులు రవి రేతినేని, హరి గౌడ్, గణేష్ కుప్పాల మాట్లాడుతూ.. మా వేడుకలకు హాజరైన ప్రవాస సంస్థల ప్రతినిధులకు, సహకిరించిన స్పాన్సర్ సంస్థలకు, స్థానిక అధికారులకు కృతఙ్ఞతలు తెలిపారు.
ఇక్కడికి వచ్చిన ప్రవాసులు, టాక్ సంస్థ ప్రతినిధులను ఉద్దేశించి ఈ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని.. ఒక పక్క వ్యక్తిగతంగా రోజు వారి పనుల్లో బిజీగా వున్నప్పటికీ, బాధ్యత గల తెలంగాణా బిడ్డలుగా తెలంగాణా సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్తున్న టాక్ సంస్థని ప్రశంసించారు. ఉత్తమ బతుకమ్మలకు గోల్డ్ కాయిన్స్ బహుమతి, బతుకమ్మ తెచ్చిన ఆడబిడ్డలకు బహుమతులను అందించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎఫ్దీసి మాజీ చైర్మన్, టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, టాక్ ఉపాధ్యక్షులు శుష్మణ రెడ్డి , సురేష్ బుడగం , రాకేష్ పటేల్, టాక్ ప్రధాన కార్యదర్శులు సుప్రజ పులుసు,సత్యపాల్, శ్రీకాంత్ జెల్ల , అడ్వైసరి బోర్డు చైర్మన్ మట్టా రెడ్డి, ముఖ్య సభ్యులు అశోక్ దూసరి, నవీన్ రెడ్డి ,మల్లా రెడ్డి, గణేష్ కుప్పాల ,పవిత్ర కంది , స్వాతి బుడగం, సుప్రజపులుసు, సత్యమూర్తి చిలుమలా , వెంకట్ రెడ్డి దొంతుల,సత్యంకంది ,రవి రేటినేని, రవి ప్రదీప్ ,హరి గౌడ్ నవాబ్ పేట్,క్రాంతి రేటినేని, జాహ్నవి , శశి, తేజ , నిఖిల్, నాగరాజు , ప్రవీణ్ వీర, మాధవ రెడ్డి , రంజిత్,కార్తీక్, శ్రీధర్ రావు , స్నేహ,శైలజ, శ్రీ విద్య, అంజన్ రావు, మహేందర్, శ్వేతా మహేందర్, మౌనిక ,రాజేష్ వాక , మ్యాడి యువజన విభాగం నాయకులు తరుణ్ తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు.
Harish Rao | కేసీఆర్కు రైతుకు ఉన్నది పేగు బంధం.. కాంగ్రెస్కు ఉన్నది కేవలం ఓటు బంధం: హరీశ్ రావు
DA hike | పండగ వేళ గుడ్న్యూస్ చెప్పనున్న కేంద్రం.. ఉద్యోగులకు డీఏ పెంపు..?
Asia Cup | ఆసియా కప్ ట్రోఫీ వివాదం.. బీసీసీఐకి క్షమాపణలు చెప్పిన పీసీబీ చైర్మన్ నఖ్వీ..!