సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో లోకకళ్యాణార్ధం, ఈ సంవత్సరమంతా అందరికీ శ్రేయస్కరంగా ఉండాలనే మహాసంకల్పంగా శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినం నాడు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ శ్రీనివాసుడికి సుప్రభాతసేవ ఘనంగా నిర్వహించారు. తోమాలసేవ, అభిషేకం, విశేషపూజలతో పాటు మహా గణపతి, విష్ణుదుర్గ, మహాలక్ష్మి అమ్మవార్లకు అభిషేకము మొదలగు విశేష కైంకర్యములు నిర్వహించారు. శ్రీవారి కళ్యాణోత్సవమును స్థానిక సెరంగూన్ రోడ్లోని శ్రీ శ్రీనివాస పెరుమాళ్ దేవాలయమందు ఏప్రిల్ 2న అత్యంత భక్తిశ్రద్ధలతో, శాస్త్రోక్తంగా, గోవింద నామస్మరణల మధ్య నిర్వహించారు.
కళ్యాణోత్సవానంతరం నిర్వహించిన పంచాంగ శ్రవణంను అందరూ ఆసక్తిగా ఆలకించారు. తెలుగు వారి తొలి పండుగ ఉగాది కావడంతో, ఉదయం సుమారు 3000 మంది, సాయంత్రం 6000 మందికి పైగా భక్తులు విచ్చేసి ఆ దేవదేవుని దర్శించుకొన్నారు. సింగపూర్ న్యాయ, హోం వ్యవహారాల శాఖ మంత్రి కె షణ్ముగం కూడా విచ్చేసి దేవుని కటాక్షాలు పొందారు. ఈకార్యక్రమాన్ని ఇంతభారీగా నిర్వహించిన తెలుగు సమాజానికి అందరూ కృతజ్ఞతలు తెలిపారు.
తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ.. తెలుగువారందరికీ శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కొవిడ్ కారణంగా గత రెండేండ్ల నుంచి ఉగాది వేడుకలు నిర్వహించలేకపోయామన్నారు. రెండేండ్ల తర్వాత ఉగాది పండుగను ప్రత్యక్షంగా నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం కార్యవర్గ సభ్యులు చెవిరెడ్డి భాస్కరరెడ్డి సహాయ సహకారాలతో కళ్యాణోత్సవంలో పాల్గొన్న దంపతులకు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి లడ్డూ ప్రసాదం, వడ, అభిషేక జలం, తలంబ్రాలు మరియు వస్త్రాలు అందించారు. ఈ కార్యక్రమానికి అన్నివిధాల సహకరించిన పెరుమాళ్ దేవస్ధాన కార్యవర్గాలకు, దాతలకు, ప్రతి ఒక్కరికీ కార్యక్రమ నిర్వాహకులు శ్రీనివాస్ రెడ్డి పుల్లన్న కృతజ్ఞతలు తెలిపారు. భక్తులకు, వాలంటీర్లకు, కార్యక్రమానికి హాజరైన వారితో పాటు లైవ్ ద్వారా వీక్షించిన అందరికీ కార్యదర్శి సత్యచిర్ల ఈ సందర్భంగా ధన్యవాదములు తెలియజేశారు.