Singapore | సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ శతాబ్దిక (1924 -2024 ) వార్షికోత్సవం సందర్భంగా అతిరుద్ర మహాయాగం నిర్వహించారు. పెరుమాళ్ దేవాలయ ప్రాంగణంలోని పీజీపీ హాలులో ఈ నెల 21వ తేదీన మొదలైన ఈ మహాయాగం ఈ నెల 26వ తేదీన మహాపూర్ణాహుతి కార్యక్రమంతో ముగిసింది. సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ నిర్వహించిన అతి రుద్ర మహాయాగం ఇది రెండోది. సభ 80వ వార్షికోత్సవాల్లో భాగంగా సింగపూర్లో 2004లో మొట్టమొదటిసారి నిర్వహించిందని నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా కార్యక్రమంలో ఏర్పాటు చేసిన మహాదేవ, శివ, రుద్ర, శంకర, నీల లోహిత, ఈశాన, విజయ, భీమ, దేవ దేవ, భవోద్భవ, ఆదిత్యమఖమొదలైన ఏకాదశ(11) కలశ రుద్రఘన మండపముల వద్ద 121 రుత్విక్యరేణ్యులు ఏక కాలము నందు రెండు ఏకాదశ రుద్రములు పారాయణ చేస్తూ ఉండగా.. మరో 11 మంది రుత్విక్కులు రుద్ర హావనము చేశారు. ఇలా 5 రోజుల పాటు ప్రతి రోజు 2662 రుద్రముల పారాయణ చేసి మహా పూర్ణాహుతి అయిన 6వ రోజు 1331 రుద్రమల పారాయణతో 16,896 రుద్రములు జపించారు. అనంతరం ఏకాదశ కలశ మండపాల వద్ద రుద్రముతో అభిమంత్రించిన 121 కలశాలతో శ్రీ శ్రీ శ్రీ పూర్ణాంబికా సమేత శ్రీ ఆనందేశ్వర మహా స్వామి వారికి అభిషేకం తదనంతరం రుద్రార్చన మహా పూర్ణాహుతులతో అత్యంత వైభవోపేతంగా జరిపించారు. ఈ ఆరు రోజులు సాయంత్రం, వేద పురోహితులు క్రమార్చన చేశారు, తర్వాత సామవేద జపం మరియు అవధారయాలు జరిగాయి.
అతిరుద్రం 2024 నిర్వహణలో కీలక పాత్ర పోషించిన SDBBS నిర్వహణ కమిటీలో – L కార్తికేయన్, డాక్టర్ I స్వామినాథన్, N ఆనంద్ చంద్రశేఖర్, బాలాజీ ఉన్నారు. రామస్వామి, గణేశ్ రాధాకృష్ణన్, ఈశ్వర్ శ్రీనివాసన్, రాజా రామన్, ఎస్ కృష్ణన్, కె సాయిరామ్, కె రామ ప్రసాద్, వేణు మాధవ్ మల్లవరపు సభ్యులుగా ఉన్నారు.
ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విశేషం ఏమిటంటే వివిధ దక్షిణ భారత రాష్ట్రాల నుంచి 22 మంది గౌరవనీయులైన పండితులు పాల్గొన్నారు. వారిలో ముగ్గురు హైదరాబాద్లోని స్కందగిరి నుంచి విచ్చేశారు. సింగపూర్ నుంచి 121 మందికి పైగా రుత్విక్కులతో పాటు, 4 దశాబ్దాలుగా నివాసి సభ పురోహితులచే వేద సంప్రదాయాలలో శిక్షణ పొందారు. ఇందులో గత దశాబ్దంగా పరమేశ్వరుని సేవలో ఎన్నో వైదిక కార్యక్రమాలు చేస్తున్న సింగపూర్ తెలుగు బ్రాహ్మణ సమాజం అతిరుద్రం తొలి రోజు మధ్యాహ్న భోజనం స్పాన్సర్ చేయడంతో పాటు అతిరుద్రం మహాయాగంలో చల్లా శ్రీ ప్రదాయ, చల్లా శ్రీకాంత్, అనంత్ బొమ్మకంటి, ధర్మారావు అక్కిపెద్ది, గంటి చంద్రశేఖర్, వాడాలి ప్రసాద్, బాలాజీ గరిమెళ్ళ, రాఘవేంద్ర దేవరకొండ, గిరి పిండిప్రోలు, వాసు జనపాటి, కృష్ణ అయ్యగారి, గోవర్ధన్, జగన్, ఫణీన్ద్ర, రమేశ్ నేమాని, సుబ్రమణ్యం, గణపతి శాస్త్రి ఆకెళ్ళ, రామ సంతోష్ శ్రీకర్ ఆకెళ్ళ, కామేశ్వర రావు భమిడిపాటి, వెంకట రమణ పమిడిఘంటం, వంశీకృష్ణ శిష్ట్లా, రత్నకుమార్ కవుటూరు తదితరులు పాల్గొన్నారు.
ప్రతిరోజు వేలాదిగా భక్తుల శివనామ స్మరణలో పీజీపీ హాలు ప్రాంగణం మార్మోగింది. భక్తులకు రుత్విక్కులకు పెరుమాళ్ ఆలయం నుంచి తెచ్చిన ప్రసాదాన్ని వడ్డించి వేడుకలకు పవిత్రతను చేకూర్చారు. ప్రతిరోజు అన్ని పురోహితులకు సమారాధనై భోజనం వడ్డించారు. తిరుచ్చి నుంచి పాల్గొన్న పురోహితులలో ఒకరు కంచి మఠం జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామిగళ్ ఆశీర్వదించిన ప్రసాదాన్ని తీసుకువచ్చి అధ్యక్షుడు ఎల్ కార్తికేయన్ కు అందజేశారు.
సభ అధ్యక్షుడు ఎల్ కార్తికేయన్, కార్యక్రమ డైరెక్టర్ రాజారామన్, సభ కార్యదర్శి ఆనంద్ చంద్రశేఖర్, అందరి వాద్యార్లకు (పురోహితులు), రుత్విక్కులకు , దాతలకు, స్వచ్ఛంద సేవకులకు, అన్ని సహాయక సంస్థలకు (శ్రీ శ్రీనివాస్ పెరుమాళ్ ఆలయం, పీజీపీ హాల్, శ్రీ శివన్ ఆలయం, హిందూ ఎండోమెంట్ బోర్డు, కవిత స్టోర్ & ట్రేడింగ్, ఇతర మౌలిక సదుపాయాల ప్రదాతలు) హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.