NRI BRS Australia | మెల్బోర్న్ : ఎన్నారై బీఆర్ఎస్ ఆస్ట్రేలియా 12 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఎన్నారై బీఆర్ఎస్ ఆస్ట్రేలియా నాయకుడు అనిల్ బైరెడ్డి ఆధ్వరంలో మెల్బోర్న్ లో ఘనంగా 12 వ వార్షికోత్సవ వేడుకల్ని నిర్వహించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం మేరకు ఆస్ట్రేలియా వ్యాప్తంగా సమావేశాలు నిర్వహించి బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేస్తున్నామని, రానున్న రోజుల్లో ఇతర నగరాల్లో సైతం 12 వ వార్షికోత్సవ వేడుకలతో పాటు పార్టీ అభిమానుల్ని, కెసిఆర్ – కేటీఆర్ అభిమానుల్ని సమన్వయం చేస్తామని అనిల్ బైరెడ్డి తెలిపారు. 12 సంవత్సరాలుగా పార్టీకి సేవ చేసే అవకాశమిచ్చి ప్రోత్సహించిన కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావులకు, కార్యవర్గ సభ్యులకి, అలాగే ఆస్ట్రేలియాలోని ఎన్నారైలకు, మీడియా సంస్థలకు అనిల్ బైరెడ్డి కృతఙ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాల్ని తిప్పి కొట్టాలని పిలుపునిస్తూ వాస్తవాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో, ప్రత్యేకంగా రూపొందించిన వీడియోని ప్రదర్శించారు. అలాగే ఎన్నారైలు సైతం SIR పై అవగాహన కలిగి ఉండాలని సభకు వివరించారు. తెలంగాణ రాష్ట్రం పది సంవత్సరాలల్లో ఎంత అభివృద్ధి చెందిందో వీడియో రూపంలో చూపించి సభకు వివరించి, నేడు కాంగ్రెస్ అరాచక పాలనలో తెలంగాణ నష్టాన్ని ప్రస్తుత ప్రజల దీన పరిస్థిని కూడా సభకు అనిల్ వివరించారు. కెసిఆర్ గారు అప్పు చేసి అభివృద్ధి సంక్షేమ చేస్తే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులతో స్కాములు తప్ప ఏమీ లేదని విమర్శించారు.
మెల్బోర్న్లో నివసిస్తున్న పలువురు ఎన్నారైలకు అనిల్ బైరెడ్డి పార్టీ కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రిని చెయ్యడమే సంకల్పంగా ముందుకు వెళ్తామని, ఆస్ట్రేలియావ్యాప్తంగా ఎంతో మంది ఎన్నారైలు పని చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారని వారందరిని కలుపుకొని పార్టీ కోసం పని చేస్తామని హాజరైన ఎన్నారై బీఆర్ఎస్ ఆస్ట్రేలియా నాయకులు తెలిపారు.
ఈ వేడుకల్లో మహిళలు, చిన్నారులు, ఎన్నారైలంతో ఉత్సాహంగా పాల్గొనడం నయా జోష్ ని ఇచ్చిందని అనిల్ బైరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. చివరిగా 12 వ వార్షికోత్సవ కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై బీఆర్ఎస్ ఆస్ట్రేలియా నాయకులు అనిల్ బైరెడ్డితోపాటు ఇతర సీనియర్ నాయకులు రమేష్ ముత్యాల, మధుపర్సా ,రాహుల్ నడిదే, సత్య గుండా, రవీందర్ చుక్క, కార్తీక్, కుల్విందర్ గాజువా, స్వప్న, ప్రియాంక,మధు,ఇంకా ఇతర ముఖ్య నేతలు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.