Hyundai : ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) ఇవాళ కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహన (EV) వినియోగదారుల కోసం తమ ‘మైహ్యుందాయ్ (MyHyundai)’ యాప్ ద్వారా 30,000 కు పైగా చార్జింగ్ పాయింట్ల (Charging Points) ను అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది. దాంతో ఒకే ప్లాట్ఫామ్పై లభించే భారతదేశంలోని అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఈవీ చార్జింగ్ నెట్వర్క్లలో ఒకటిగా ఇది నిలిచింది.
ప్రముఖ ఛార్జ్ పాయింట్ ఆపరేటర్లు, సర్వీస్ ప్రొవైడర్లతో భాగస్వామ్యం కుదుర్చుకుని ఈ ప్లాట్ఫామ్ను అభివృద్ధి చేసినట్లు కంపెనీ తెలిపింది. విశేషమేమిటంటే ఈ నెట్వర్క్ కేవలం హ్యుందాయ్ కార్లకే పరిమితం కాకుండా అన్ని బ్రాండ్ల ఎలక్ట్రిక్ వాహనాలకు అందుబాటులో ఉంటుంది. ఈ యాప్ ద్వారా సమీపంలోని చార్జింగ్ స్టేషన్లను గుర్తించడం, వాటికి నావిగేట్ చేయడం, ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవడం, డిజిటల్ పద్ధతిలో చెల్లింపులు జరపడం వంటివి సులభంగా చేసుకోవచ్చు. ఈ ఇంటిగ్రేటెడ్ నెట్వర్క్ ద్వారా దేశవ్యాప్తంగా సగటున 25 కిలోమీటర్ల పరిధిలో ఒక చార్జింగ్ స్టేషన్ అందుబాటులో ఉంటుందని హ్యుందాయ్ పేర్కొంది.
ఢిల్లీ-జైపూర్, ముంబై-పుణె-బెంగళూరు, హైదరాబాద్-కర్నూలు-బెంగళూరు వంటి ప్రధాన హైవే కారిడార్లలో కూడా ఈ సౌకర్యం విస్తరించింది. ఈ సందర్భంగా హెచ్ఎంఐఎల్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో తరుణ్ గార్గ్ మాట్లాడుతూ.. భారత్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడంలో చార్జింగ్ మౌలిక సదుపాయాలు చాలా కీలకమని అన్నారు. “మైహ్యుందాయ్ యాప్లో 30,000కు పైగా చార్జింగ్ పాయింట్లను ఏకీకృతం చేయడం ద్వారా, ఈవీ యూజర్లకు దేశంలోని అతిపెద్ద నెట్వర్క్లలో ఒకదానిని అందిస్తున్నాం” అని చెప్పారు.
అంతేగాక కంపెనీ తన సొంత డీసీ ఫాస్ట్ పబ్లిక్ చార్జింగ్ నెట్వర్క్ను కూడా భారీగా విస్తరించాలని యోచిస్తోంది. ప్రస్తుతం ఉన్న 183 స్టేషన్లను 2030 నాటికి 600 స్టేషన్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు తమ చార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా మూడు లక్షలకుపైగా చార్జింగ్ సెషన్లు జరిగాయని, దీనివల్ల సుమారు 3.5 మిలియన్ కిలోల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను నివారించగలిగామని కంపెనీ తెలిపింది. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే మాస్ మార్కెట్ కోసం ఒక కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీని విడుదల చేయడానికి కూడా హ్యుందాయ్ సన్నాహాలు చేస్తోంది.