MLC Kavitha | స్వదేశానికి వచ్చి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ప్రవాసీ భారతీయులకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. భారత్లో పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామంగా నిలిచిందని, గత తొమ్మిదేళ్లలో 47 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన అన్ని సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోందని వివరించారు. ఆస్ట్రేలియాలోని బ్రిస్బెన్లో భారత జాగృతి ఆధ్వర్యంలో జరిగిన బోనాల ఉత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. ప్రవాసీ తెలంగాణ వాసులు, జాగృతి కార్యకర్తలతో కలిసి కవిత బోనంతో స్థానిక దేవాలయానికి చేరుకున్నారు. అక్కడ అమ్మవారికి నైవేద్యం సమర్పించారు.
అనంతరం జరిగిన సమావేశంలో కవిత మాట్లాడుతూ దేశంలో రెండు ఐటీ ఉద్యోగాలు ఉంటే.. అందులో ఒకటి తెలంగాణలోనే ఉంటుందన్నారు. రాష్ట్రం ఏర్పడ్డ నాటికి ఐటీ పరిశ్రమలో తెలంగాణలో3.5 లక్షల ఉద్యోగాలు ఉంటే ఇప్పుడు 9.5 లక్షలకుపైగా ఉన్నాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం సంపదను పెంచి నిరుపేదలకు పంచుతుందని చెప్పారు. జీఎస్డీపీలో జాతీయ సగటు కంటే తెలంగాణ ఎక్కువ నమోదు చేసిందన్నారు. భారత సంస్కృతిని, తెలంగాణ సంప్రదాయాలను ఆస్ర్టేలియా దేశానికి విస్తరించడంపై సంతోషం వ్యక్తం చేశారు. బిస్బెన్లో ఉన్న తెలుగు ప్రజలు, భారతీయులకు అభినందనలు తెలిపారు. ఆ దేశ చట్టాలను గౌరవిస్తూ ఉన్నతంగా జీవించాలని, సామాజిక సేవ చేయాలని ఆకాంక్షించారు. ఆస్ట్రేలియా రాజకీయాల్లో భారతీయులు రాణిస్తుండడం గర్వకారణమన్నారు.
తెలంగాణ ఏర్పాటు కోసం సుదీర్ఘకాలం పోరాటం చేశామని, 60 ఏళ్ల పోరాటం తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కల సాకారమయ్యిందని గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదేళ్లలోనే అన్ని రంగాల్లో వేగంగా ముందుకెళ్తున్నదని, ప్రజల ఆకాంక్షలు నెరవేరాయని స్పష్టం చేశారు. దాదాపు అన్ని రంగాల్లో తెలంగాణ నంబర్ వన్గా ఉందని చెప్పారు. గ్రామీణ, పట్టణాలను రాష్ట్ర ప్రభుత్వం సమాంతరంగా అభివృద్ధి చేస్తోందన్నారు. బోనాల ఉత్సవాల్లో తెలంగాణ జాగృతి ఆస్ట్రేలియా విభాగం అధ్యక్షుడు శ్రీకర్ రెడ్డి అందెం, బీఆర్ఎస్ ఆస్ట్రేలియా విభాగం అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి, బీటీఏ ప్రెసిడెంట్ కిశోర్, నాయకులు విజయ్ కోరబోయిన, స్వప్న దోమ, విరించి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.