హైదరాబాద్ : సీఎం కేసీఆర్ మంచి విజన్తో పారదర్శకమైన రెవెన్యూ వ్యవస్థను, రికార్డులను తయారు చేసేందుకు ధరణి పోర్టల్ను అందుబాటులోకి తీసుకువచ్చారని టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల అన్నారు. తెలంగాణ రాకముందు రెవెన్యూ రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండేది.
దీంతో ఘర్షణలు, వివాదాలు తలెత్తేవి. ఈ అనర్థాలను రూపుమాపేందుకు, ప్రతి గుంటకు యజమాని ఎవరో తెలిసేందుకు భూరికార్డుల ప్రక్షాళన, కొత్త రెవెన్యూచట్టం, ధరణి పోర్టల్.. ఇలా ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసింది. వాటి ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని ఆయన అన్నారు.
ఆధార్ కార్డు లేని ఎన్నారైలకు ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డు, పాస్ పోర్టు ద్వారా ధరణిలో లావాదేవీలకు అవకాశం కల్పించడంతో ఎంతో మంది ఎన్నారైలు దాన్ని సద్వినియోగపరుచుకున్నారని తెలిపారు. ధరణి ఏర్పడి విజయవంగా సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్నారైల తరఫున మహేష్ బిగాల సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.