Yoga Day | కువైట్లోని భారతదేశ రాయబార కార్యాలయం శనివారం సాల్మియా కువైట్ సిటీలోని బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. తొలిసారి కువైట్లోని బహిరంగ వేదికలో ఇంటర్నేషనల్ యోగా డే నిర్వహించడం విశేషం. కార్యక్రమం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ (ICCR), ఆయూష్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ‘ఒక భూమికి యోగా- ఒక ఆరోగ్యం’ థీమ్తో యోగా డేను నిర్వహించారు. కార్యక్రమంలో కువైట్లో భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా పాల్గొని.. రోజువారీ జీవితంలో యోగా ప్రాముఖతను వివరించారు. కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
మిస్టర్ హుస్సేన్ అల్ ముసల్లం, ఓసీఏ డైరెక్టర్ జనరల్ మాట్లాడుతూ ‘యోగా’ ఓసీఏ కింద గుర్తించబడిన క్రీడా విభాగమని పేర్కొన్నారు. కువైట్లో యోగాను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించిన పద్మశ్రీ షేఖా షేఖా ఎ జె సబా రాయల్ ఫ్యామిలీ సభ్యురాలు, పద్మ శ్రీ ఆచార్య హెచ్ఆర్ నాగేంద్ర స్వామి వివేకానంద యోగా అనుసంధాన సంస్థాన వ్యవస్థాపకుడు సమావేశంలో పాల్గొన్నారు. విదేశీ దౌత్యవేత్తలు, పాఠశాలలు, కళాశాలల పిల్లలు, భారతీయ సమాజ సభ్యులు, యోగా ఔత్సాహికులు ఉన్న కార్యక్రమంలో సొసైటీలోని అన్ని వర్గాలకు చెందిన దాదాపు 1500 మందికిపైగా ప్రజలు పాల్గొన్నారు. 11వ అంతర్జాతీయ యోగా వేడుకకు కువైట్లో సానుకూల ప్రశంసలు అందుకున్నాయి. అంతకు ముందు రాయబార కార్యాలయం మూడు కర్టెన్-రైజర్ యోగా సెషన్స్.. అన్ని వయసుల వారికి యోగా భంగిమ పోటీలు నిర్వహించింది.