లండన్ : తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్లో(London) ‘ఇండియా డే’ (India Day celebrations)వేడుకలను ఘనంగా నిర్వహించారు. లండన్లోని భారత హై కమీషన్, భారత దేశానికి చెందిన వివిధ రాష్ట్రాల ప్రవాస సంఘాలతో సంయుక్తంగా భారత 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జరిపిన ‘ఇండియా డే వేడుకల్లో’, తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) (TAUK), తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహించింది. భారత హై కమీషనర్ విక్రమ్ దొరై స్వామి జెండా ఆవిష్కరించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ముందుగా తెలంగాణ ప్రత్యేకతతో టాక్ సంస్థ ఏర్పాటు చేసిన స్టాల్ని తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రాతినిధ్యం ఉట్టి పడేలా చరిత్రను, భాషా, సంస్కృతి, పర్యాటకం, అభివృద్ధి, గత 10 సంవత్సరాలుగా సాధించిన విజయాలు, ప్రవేశపెట్టిన పథకాలను స్టాల్స్లో ప్రదర్శించారు. తెలంగాణా రాష్ట్ర ప్రాముఖ్యత గురించి వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రవాస భారతీయులకు తెలియజేయాలనే భావనతో టాక్ సంస్థ ఆధ్వర్యంలో ‘తెలంగాణా స్టాల్’ని ఏర్పాటు చేశామని సంస్థ కార్యదర్శి రవి రేతినేని తెలిపారు.
టాక్ సీనియర్ నాయకుడు నవీన్ రెడ్డి కృతఙ్ఞతలు తెలిపారు. అలాగే వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్ విచ్చేసిన తెలంగాణ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం ఈ వేడుకల్లో పాల్గొనడమే కాకుండా ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తునందుకు టాక్ ఉపాధ్యక్షుడు సత్య చిలుముల వారికి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో భారత సంతతికి చెందిన మాజీ ఎంపీ వీరేంద్ర శర్మ, సురేష్ బుడగం, వెంకట్ రెడ్డి, సురేష్ బుడగం, స్వాతి, రవి పులుసు, క్రాంతి రేతినేని తదితరులు పాల్గొన్నారు.