హైదరాబాద్ : సింగపూర్ ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాల వేదికపై ఆదివారం వినూత్నంగా ఏర్పాటు చేయబడిన, ప్రముఖ సంగీత విద్వాంసులు గరికిపాటి వెంకట ప్రభాకర్ ‘రాగావధానం’ కార్యక్రమం సంగీత ప్రియులను 5 గంటల పాటు అద్భుతంగా అలరించింది. గరికిపాటి వెంకట ప్రభాకర్, పద్మ లలిత దంపతులు జ్యోతి ప్రకాశనం గావించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి అమెరికా నుంచి డాక్టర్ వంగూరి చిట్టెన్ రాజు, భారతదేశం నుంచి డాక్టర్ వంశీ రామరాజు, ప్రముఖ గాయకులు జి ఆనంద్, ప్రఖ్యాత గాయని సురేఖ మూర్తి తదితరులు గౌరవ అతిథులుగా విచ్చేసి తమ అభినందనలు తెలియజేశారు.
సాహిత్య అష్టావధాన ప్రక్రియలో వలె సింగపూర్ నుంచి విద్యాధరి, శేషుకుమారి, సౌభాగ్యలక్ష్మి, షర్మిల, పద్మావతి, స్నిగ్ధ, అనంత్ అనే ఏడుగురు గాయనీ గాయకులు పృచ్ఛకులుగా వ్యవహరించగా.. రాధిక మంగిపూడి అప్రస్తుత ప్రసంగం చేస్తూ సమన్వయకర్తగా వ్యవహరించారు.
పృచ్ఛకులు అడిగిన పాటలకు అప్పటికప్పుడు అవధాని అడిగిన రాగాన్ని మార్చడం సమ్మోహనపరిచింది. అలాగే అడిగిన తాళంలో మార్చి పాడడం, రాగమాలికగా లేక తాళమాలికగా అల్లి పాడడం, పద్యాలలోని స్వరాక్షరాలను ఆయా స్వర స్థానాలలోనే పాడడం, పృచ్ఛకులు నిషేధించిన స్వరాలను వర్జించి రాగాలను పాడడం వంటి చక్కటి రాగ తాళ రస విన్యాసాలతో ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా ప్రేక్షకులను ఈ కార్యక్రమం కట్టిపడేసింది.
అమెరికా, హాంగ్ కాంగ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, నార్వే మొదలగు దేశాల నుంచి ప్రపంచ వ్యాప్తంగా వివిధ తెలుగు ప్రజలు ఈ కార్యక్రమాన్ని వీక్షించి ఆనందించారు. కార్యక్రమం ముఖ్య నిర్వాహకులు కవుటూరు రత్న కుమార్ మాట్లాడుతూ.. జీవి ప్రభాకర్ కార్యక్రమానికి సంపూర్ణ న్యాయం చేకూర్చారని, ఎలాంటి ప్రశ్నలు అడిగినా ఎంతో హుందాగా ఆయా రాగాలను తాళాలను గూర్చి వివరిస్తూ కార్యక్రమాన్ని రక్తి కట్టించారని శ్రంసించారు.
జీవి ప్రభాకర్ మాట్లాడుతూ..ఈ కార్యక్రమం చేయగలగడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఎన్నో విలక్షణమైన ప్రశ్నలకు తాను తృప్తికరంగా సమాధానాలు ఇవ్వగలిగానని ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ వారికి, అతిథులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి రాధాకృష్ణ గణేశ్న సాంకేతిక సహకారం అందించగా, e remit , గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్, యీగ జ్యూస్ వారు ఆర్థిక సహాయం అందించారు. అమెరికాలోని యూఎస్ టెలివిజన్ వన్ ఛానల్ వారు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈక్షణం, సింగపూర్ తెలుగు టీవి వారు మీడియా పార్టనర్ గా సహకారం అందించారు.
పూర్తి కార్యక్రమాన్ని ఈ వీడియోలో చూడవచ్చు.
ఇవి కూడా చదవండి..
శంషాబాద్లో కారు,లారీ ఢీ..ఆరుగురు మృతి, 15 మందికి గాయాలు
ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
గాలి ద్వారా కరోనా చాలా ఆందోళనకరం: ఎయిమ్స్ చీఫ్
భారీగా నిషేధిత గుట్కా ప్యాకెట్ల పట్టివేత