Balka Suman | మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో మెజారిటీ స్థానాలు బీఆర్ఎస్-సీపీఐ కూటమి గెలుచుకుందని పేర్కొన్నారు. మెజారిటీ స్థానాలు గెలుచుకున్నప్పటికీ చైర్పర్సన్ ఎన్ని జరకుండా కాంగ్రెస్ కుట్రలు పన్నుతుందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా బనాయించిన కేసు నేపథ్యంలో రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్కు ఇవాళ బాల్క సుమన్ హాజరయ్యారు.
అనంతరం బాల్క సుమన్ మాట్లాడుతూ.. ప్రజాతీర్పునకు వ్యతిరేకంగా దౌర్జన్యంగా చైర్మన్ పీఠం దక్కించుకోవాలని మంత్రి వివేక్ వెంకటస్వామి కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. గత నెల 16, 17వ తేదీల్లో చైర్పర్సన్ ఎన్నిక జరకుండా వివేక్ అడ్డుకున్నారని తెలిపారు. తనతో సహా 25 మంది బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టారని అన్నారు. రెండేళ్లలో సింగరేణి సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని విమర్శించారు.
మందమర్రి ఏరియాలో కాసిపేట 2 ఇంక్లైన్ బొగ్గు గని తెచ్చిన ఘనత బీఆర్ఎస్దే అని బాల్క సుమన్ తెలిపారు. సింగరేణి ఏరియాలో మూడు వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత నాటి సీఎం కేసీఆర్దే అని స్పష్టం చేశారు. మంత్రి వివేక్కు ఈ ప్రాంతంపై ప్రేమ ఉంటే కొత్త భూగర్భ గనులు తీసుకురావాలని సూచించారు. హైకోర్టు తీర్పు ప్రకారం క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ ఎన్నికను అధికారులు ప్రజాస్వామ్య బద్ధంగా నిర్వహించాలని కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బనాయించిన కక్ష పూరిత కేసుల నేపథ్యంలో ఈరోజు రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో హాజరవడం జరిగింది. pic.twitter.com/ckQT16LTtv
— Balka Suman (@balkasumantrs) March 15, 2026