హైదరాబాద్ : ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలనే నినాదం రోజురోజుకు ఉధృతమవుతున్నది. అమరగాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి వేడుకల సంవత్సర సందర్భంగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అనే నినాదంతో యూఎస్ఏ నుంచి శంకర నేత్రాలయ యూఎస్ఏ అధ్యక్షుడు బాల ఇందుర్తి ఆధ్వర్యంలో ఇప్పటివరకు 60 పైగా టీవీ కార్యక్రమాలను నిర్వహించి ప్రపంచం నలుమూలలో ఉన్న తెలుగు సంస్థలను ఏకాతాటిపై తీసుకువస్తున్నట్లు నిర్వాహుకులు తెలిపారు.
అందులో భాగంగా సింగపూర్ నుంచి రత్న కుమార్ కవుటూరు వ్యాఖ్యాతగా 10 ఏప్రిల్ 2022న జరిగిన అంతర్జాల (Zoom) కార్యకడ్మింలో యూఎస్ఏ లో ప్రముఖ వక్త పద్మభూషణ్ డా. జగదీష్ సేథ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఒక తెలుగేతర వాడిగా ఘంటసాల బహుముఖ ప్రజ్ఞని తెలుసుకొని ఆశ్చర్యపోయానని, ఒక గాయకుడిగా, సంగీత దర్శకుడిగా పిన్న వయస్సులోనే దేశంకోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధుడుగా దేశానికీ ఎంతో సేవ చేసారన్నారు.
భారతరత్న పురస్కారానికి ఘంటసాల పూర్తిగా అర్హుడని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహుకుల చేసే ప్రయత్నాన్ని అభినందిస్తూ తన పూర్తి మద్దతుని తెలిపారు. ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు వి. ఎన్. ఆదిత్య మాట్లాడుతూ.. ఘంటసాల జీవించి ఉన్న సమయంలో మేము లేకపోయిన కానీ వారి పాటల్ని విని పెరిగామని, వారి పాటల్లోని మాధుర్యం, దేశభక్తిని కొనియాడారు.
ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు రామాచారి కోమండూరి మాట్లాడుతూ.. చిన్ననాటి నుంచి ఘంటసాల గారి పాటలు విని పెరిగామని, వారి లేని లోటుని ఎవరు భర్తీ చేయలేరని అని అన్నారు. వంగూరి ఫౌండేషన్ అధ్యక్షుడులు చిట్టెన్ రాజు మాట్లాడుతూ.. ఘంటసాల మనకు ఆణిముత్యాలాంటి పాటలు పాడి అందించడం తెలుగు వారు చేసుకున్న అదృష్టమని, వారి పాటలు వింటుంటే ఆ భగవంతుడే దిగి వచ్చి పాడినట్టుగా ఉంటుందని కొనియాడారు.
శంకర్ నేత్రాలయ ఫౌండర్ ప్రెసిడెంట్ ఎస్. వి. ఆచార్య, శంకర్ నేత్రాలయ బోర్డు సభ్యులు డా. రాజ్ మోదీ, శంకర్ నేత్రాలయ బోర్డు సభ్యులు డా.మాధురి నముడూరి తదితరుల పాల్గొని ఘంటసాల పాటలతో తమకున్న అభిమానాన్ని, వారి పాటలలోని మాధుర్యాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
ఘంటసాల కి కేంద్ర ప్రభుత్వం తగిన రీతిన గుర్తించి భారతరత్న అవార్డుతో సత్కరించాలి అని అభ్యర్థించారు.
ఈ బృహత్ కార్యక్రమంలో ఇప్పటివరకు అమెరికా లోని పలు తెలుగు జాతీయ సంస్థల సహకారంతో, భారతదేశం నుంచి పలువురు ప్రముఖులతో పాటు, ఇండోనేషియా, హాంగ్ కాంగ్, థాయిలాండ్, కెనడా, బెహ్రెయిన్, ఫ్రాన్స్, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, యూఏఈ, ఖతార్, ఒమాన్, నార్వే, లండన్, దక్షిణాఫ్రికా లోని పలు తెలుగు సంస్థలతో 63 టీవీ కార్యక్రమాలను నిర్వహించామన్నారు.
ఈ టీవీ చర్చా కార్యక్రమాలకు ప్రపంచ దేశాలలోని తెలుగు సంఘాలకి అనుసంధాన కర్తగా సింగపూర్ నుంచి రత్న కుమార్ కవుటూరు, న్యూజీలాండ్ నుంచి శ్రీలత మగతల, ఆస్ట్రేలియా నుంచి ఆదిశేషు వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రామనికి కావాల్సిన సహకారాన్ని ఘంటసాల కృష్ణ కుమారి అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఘంటసాల కు భారతరత్న ఇవ్వాలని సంతకాల సేకరణ (Signature Campaign) కార్యక్రమం వసంత నవరాత్రులు సందర్భంగా మొదలుపెట్టామని నిర్వాహుకులు తెలిపారు. మరిన్ని వివరాలకు కింది లింక్లో చూడవచ్చని నిర్వాహకులు తెలిపారు.
https://chng.it/nQKtBRjS