ఆస్ట్రేలియా : సీఎం కేసీఆర్ పాలన తెలంగానలోని నేటి,రేపటి తరానికి వరమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆస్ట్రేలియాకు విచ్చేసిన మంత్రి నిరంజన్ రెడ్డితో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా విభాగం ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రికి విక్టోరియా ఇంచార్జి సాయిరాం ఉప్పు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు తొత్తుగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ప్రధాని మోదీ ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేశారని, పదహారు లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడం లేదని తెలిపారు.
ప్రస్తుతం దేశానికి రోల్ మోడల్గా తెలంగాణ ఆవిర్భవించిందని చెప్పారు. తెలంగాణలో ప్రస్తుతం కరెంట్ కోతలు లేవని, తాగునీటి వెతలు లేవని, వలసలు అసలే లేవని పేర్కొన్నారు. దేశానికి పన్నుల రూపంలో అత్యధిక వాటా తెలంగాణ ఇస్తున్నదని గుర్తుచేశారు. బీజేపీకి ఒక విధానం, నినాదం లేదని.. కేవలం విద్వేషాలను రెచ్చగొట్టమే వాళ్ల ఎజెండా అని విమర్శించారు.
దేశంలో మత రాజకీయంతో విద్వేష రాజకీయాలు చేస్తున్నదని మండిపడ్డారు. బీజేపీ పాలనలో తెలంగాణకు ఒరిగిందేమీ లేదు. దేశాన్ని గడిచిన ఎనిమిదేండ్లుగా సాగుతున్న మోదీ పాలనలో దారిద్య్రం మరింత పెరిగి పోయిందని విమర్శించారు.
తెలంగాణలో సబ్బండ వర్ణాలు, అన్ని మతాల ప్రజలు సర్వతోముఖభివృద్ధితో సంతోషంగా ఉన్నారని, నేటి కేసీఆర్ పథకాలు, సంస్కరణలు నేటి, రేపటి తరాలకు వరం అని మంత్రి తెలిపారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి, సభ్యులు విశ్వామిత్ర, సతీష్, వినయ్ సన్నీ, ప్రవీణ్ లేదెళ్ల, విక్రమ్ కందుల, ఉదయ్, సాయి యాదవ్, వేణు నాన, రాకేష్ , సాయి గుప్తా, సందీప్ నాయక్ పాల్గొన్నారు.